Wife Murder: భార్యను చంపి 17 ఏళ్లు తప్పించుకున్నాడు..!!
కొన్నిసార్లు హంతకులు పోలీసుల కళ్లముందే తిరుగుతుంటారు..వాళ్లతో నిత్యం మాట్లాడుతుంటారు..అయినా అనుమానించలేం. అలాంటి ఘటనే కేరళలో జరిగింది.

The case of Janarthanan Nair's murder of his wife Ramadevi
అది 2006 మే 26.. కేరళలోని పతనంతిట్ట జిల్లా తిరువాళ్ల సమీపంలోని పుల్లాడ్ అనే ఊరు. రాత్రి అవ్వడంతో అంతా పడుకున్నారు. 50ఏళ్ల రమాదేవికి అదే ఆఖరి రాత్రి..ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి ఆమెను కసకసా.. కసితీరా పదునైన ఆయుధంతో పొడిచి పొడిచి చంపేశాడు. ఉదయం పోలీసులకు భర్త జనార్ధనన్ నాయర్ ఇన్ఫామ్ చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు క్లూస్ సేకరించారు. తర్వాత దర్యాప్తు మొదలుపెట్టారు. 17సంవత్సరాల తర్వాత ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. హంతకుడు ఎవరో తెలుసా?
రమాదేవి, జనార్ధనన్ నాయర్ ఇంటికి సమీపంలో హత్య జరిగిన సమయంలో ఓ బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అందులో తమిళనాడుకు చెందిన ఓ కార్మికుడు హత్య జరిగిన తర్వాత రోజు నుంచి కనిపించకుండా పోయాడు. ముందుగా అతనే హత్య చేసి ఉంటాడని పోలీసులు భావించారు. అతని కోసం గాలింపు చేపట్టారు. నాలుగేళ్ల తర్వాత ఆ కార్మికుడు హత్య చేయలేదని ఓ నిర్ధారణకు వచ్చారు. ఇక జనార్ధనన్ నాయర్ తమ్ముడిపై అప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదై ఉండడంతో ఆ కోణంలోనూ దర్యాప్తు చేశారు పోలీసులు. కానీ అక్కడ కూడా ఏం తేలలేదు.. జనార్ధనన్ నాయర్ తమ్ముడికి ఈ హత్యతో సంబంధంలేదని పోలీసులు తేల్చారు. ఇక చేసేదేమీ లేక 2010లో కేసును క్లోజ్ చేశారు లోకల్ పోలీసులు.
మరో పదేళ్లు గడిచిపోయాయి.. ఇంతలో భర్త జనార్ధనన్ నాయర్ మళ్లీ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ కేసు క్లోజ్ చేయడాన్ని ఒప్పుకొని ఆయన.. తన భార్య హత్య కేసును క్రైమ్ బ్రాంచ్కి అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రమాదేవి హత్య కేసును మళ్లీ రీఓపెన్ చేశారు. ఇక్కడితో మొదలైన వాళ్ల వేట..చివరికు అనుహ్య మలుపులు తిరిగి హంతకుడిని పట్టుకునేలా చేసింది. ఇంతకు రమాదేవిని చంపింది ఎవరో తెలుసా..? ఆమె భర్త జనార్ధనన్ నాయరే..అవును..! భార్య చనిపోయినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న వెంట్రుకలను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఫోరెన్సిక్కి పంపించారు. మొత్తం 40వెంట్రుకల్లో నాలుగు జనార్ధనన్ నాయర్వని తేలింది. ఘటన జరిగిన సమయంలో తానక్కడ లేనని ముందుగా చెప్పిన భర్తని క్రైమ్బ్రాంచ్ పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. క్లోజ్ చేసిన కేసును ఏరికోరి రీఓపెన్ చేయించుకున్న జనార్ధనన్ నాయర్ ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఏదో ఆలోచించి ప్లాన్ వేస్తే కథ మరోలా అడ్డం తిరిగింది. ఎవరో ఒకర్ని ఈ కేసులో దోషీగా తేల్చాలని నాయర్ భావించగా..తర్వాత కేసు అటు తిరిగి ఇటు తిరిగి హంతకుడైన భర్తని పట్టించింది.