Adipurush: తిరుమల కొండపై ముద్దులు, కౌగిలింతలు.. ఆదిపురుష్‌ టీమ్‌ భారీ అపచారం..

తిరుమల కొండపై నారాయణుడు సంచరిస్తుంటాడు.. అందరిని కాచుకుంటుంటాడు, కష్టాలు తీర్చుతాడని భక్తుల నమ్మకం. ఏడు కొండల్లో ఎక్కడ చూసినా భక్తి భావమే కనిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 7, 2023 | 02:33 PMLast Updated on: Jun 07, 2023 | 2:33 PM

Adipurush Movie Director And Actress Krithi Sanon Kissng At Srivari Temple

ఆ వేంకటేశ్వరుడి నామమే వినిపిస్తుంది. మాఢ వీధుల్లో నాలుగు దిక్కుల్లోనూ స్వామివారు సంచరిస్తుంటారని భక్తుల నమ్మకం. అందుకే ఆలయ ప్రాంగణంలో, మాఢ వీధుల్లో ఏ చిన్న పొరపాటు కూడా దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అంత పవిత్రమైన తిరుమలలో వరుసగా అపచారాలు జరుగుతున్నాయ్. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయ్. మిగతా వాళ్ల సంగతి వదిలేస్తే అన్నీ తెలిసిన.. సెలబ్రిటీలు కూడా ఇలాంటి అపచారాలకు పాల్పడడం.. మరింత చర్చకు దారి తీస్తోంది. తిరుమలలో నయనతార చెప్పులతో నడిచిన ఘటన రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. అది మర్చిపోక ముందే.. ఆదిపురుష్ టీమ్ చేసిన రచ్చ.. ఇప్పుడు భక్తుల కోపానికి కారణం అవుతోంది.

తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. డైరెక్టర్‌ ఓం రౌత్‌, హీరోయిన్ కృతిసనన్‌.. శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి అర్చనసేవలో పాల్గొన్నారు. దర్శనం తర్వాత.. గుడి బయటకు వచ్చిన దర్శకుడు ఓం రౌత్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు వివాదానికి దారి తీస్తోంది. దర్శనం పూర్తి చేసుకుని కారులో వెళ్లేందుకు కృతి సనన్ రెడీ అవుతున్న సమయంలో.. ఆమె దగ్గరకు ఓం రౌత్ వచ్చాడు. టాటా చెప్పాడు. అక్కడితో ఆగి ఉంటే బాగుండేది. ఓ వివాదం, అపచారం జరిగేది కాదు. కృతిని హగ్ చేసుకున్న ఓం రౌత్.. ఆమె చెంపపై ముద్దు పెట్టాడు. గాడ్ బ్లెస్ యూ అంటూ ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. స్వామి వారి భక్తులకు ఇది కోపం తెప్పిస్తోంది. ఎక్కడ ఉన్నామో.. ఎలాంటి చోట తిరుగుతున్నామో తెలియకపోతే ఎలా ! గొప్ప సినిమానే తీసి ఉండొచ్చు.. ఎమోషన్ కూడా ఉండి ఉండొచ్చు.. అది చూపించే విధానం, ప్రాంతం తెలియాలి కదా ! పవిత్రమైన, స్వామివారు తిరిగే ఆ కొండపై ఈ వెలికి చేష్టలు ఎందుకు అని భక్తులు ఫైర్ అవుతున్నారు.

అది అపచారం మాత్రమే కాదు.. అసభ్యత కూడా అని మరికొందరు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం.. గాల్లోకి ముద్దులు ఇవ్వడం.. సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్ కావొచ్చు. తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో.. అదీ పట్టు వస్త్రాల్లో స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత.. ఇలా గుడి ముందు ముద్దులు, ఆలింగనాలు కరెక్ట్ కాదు అని భక్తులు మండిపడుతున్నారు. ఔం రౌత్ ఉద్దేశపూర్వకంగా ఈ పనిచేసి ఉండకపోవచ్చు.. కానీ ఎక్కడేం చేయాలో తెలియాలి కదా ! నువ్వేంటి అని చూడదు.. నువ్వేం చేశావనే చూస్తారు ఎవరైనా ! ఇంత చిన్న లాజిక్ మిస్ అయి.. తిరుమల కొండపై ముద్దులు, కౌగిలింతలు పెట్టుకున్న ఓం రౌత్‌పై ఇప్పుడు భక్తులు భగ్గుమంటున్నారు. ఇప్పుడు ఔం రౌత్ మాత్రమే కాదు.. గతంలో నయనతార కూడా ఇలానే చేసింది. భర్త విష్నేష్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్న నయన్‌.. చెప్పులతో మాఢవీధుల్లో తిరిగింది. అప్పట్లో ఆ ఘటన రేపిన దుమారం అంతా ఇంతా కాదు.

చివరికి భక్తులకు నయనతార క్షమాపణలు చెప్పింది. సెలబ్రిటీల ప్రతీ అడుగును లక్షల కళ్లు కనిపెడుతూ ఉంటాయ్. దానికి తగినట్లు బిహేవ్ చేయాలి. ఇప్పుడు జరిగింది అంతా.. సినిమా ఇండస్ట్రీకి చెందినవారిగా.. ఆదిపురుష్ టీమ్‌కు చిన్న విషయమే కావొచ్చు.. కానీ అది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. ఈ రెండు ఘటనల నుంచి అయినా సెలబ్రిటీలు పాఠాలు నేర్చుకోవాలి. ఎప్పుడు ఏం చేయాలో కాదు.. ఏం చేయకూడదో తెలుసుకోవాలి.