Jr NTR: తాత పుట్టినరోజు వేడుకలకు తారక్‌ దూరం.. ఆ అవమానంతోనే రావడంలేదా ?

నిజమో.. ప్రచారమో.. ఎన్టీఆర్‌ను నందమూరి కుటుంబం అసలు పట్టించుకోదనే చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్ దూరంగా ఉండటం ఈ మాటలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 20, 2023 | 04:15 PMLast Updated on: May 20, 2023 | 4:15 PM

Jr Ntr To Skip Ntr Centenary Celebrations In Hyderabad

Jr NTR: దూరాన్ని దూరం చేసి దగ్గర అవ్వాలనుకున్న ప్రతీసారి.. దూరం మరింత పెరుగుతూనే ఉంది. ఎన్టీఆర్, నందమూరి కుటుంబం గురించి ప్రతీసారి జరుగుతున్న చర్చ ఇదే ! నిజమో.. ప్రచారమో.. ఎన్టీఆర్‌ను నందమూరి కుటుంబం అసలు పట్టించుకోదనే చర్చ జరుగుతూనే ఉంది. తారక్‌ కూడా తన కష్టంతోనే హీరోగా ఎదిగాడని.. నందమూరి కుటుంబాన్ని ఇది మరింత బాధపెడుతోందని.. ఏదో ఒక చోట.. ఎవరో ఒకరి నోటి నుంచి ప్రతీసారి వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్ దూరంగా ఉండటం ఈ మాటలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

నిజానికి సినిమా అయినా.. ఫ్యాన్స్ మీటింగ్ అయినా.. కార్యక్రమం ఏదైనా తాతను తలుచుకోకుండా మాట కూడా మాట్లాడరు ఎన్టీఆర్. అలాంటిది తాత పుట్టినరోజు వేడుకలకు తారక్ దూరంగా ఉండడం ఇప్పుడు కొత్త అనుమానాలకు తెరతీస్తోంది. టీడీపీ, చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు.. వ్యవహరించిన తీరుతో.. ఎన్టీఆర్‌ హర్ట్ అయ్యారా.. అలకపాన్పు ఎక్కారా.. కావాలని ఈ వేడుకలకు హాజరుకావడంలేదా.. ఫ్యామిలీ ట్రిప్ పేరుతో కావాలని దూరంగా ఉన్నారా అనే చర్చ నందమూరి అభిమానులతో పాటు.. రాజకీయవర్గాల్లోనూ వినిపిస్తోంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలనుకున్నారు.

ఆ పార్టీ నాయకుడు టీడీ జనార్థన్‌ స్వయంగా వెళ్లి ఎన్టీఆర్‌ను ఆహ్వానించారు కూడా! ఐతే ముందుగా ఫిక్స్ చేసుకున్న ఓ ప్రోగ్రాం కారణంగా.. వేడుకలకు హాజరుకావడం లేదని ఎన్టీఆర్ ప్రకటించాడు. చెప్పడం అయితే ఇలా చెప్పాడు కానీ.. అసలు కారణం వేరే ఉందట. విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమానికి రజనీకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది టీడీపీ. అయితే, ఈ కార్యక్రమానికి కనీసం తనను పిలవకపోవడంపై తారక్‌ అలిగాడని తెలుస్తోంది. చంద్రబాబు, బాలకృష్ణ తీరుపై ఈ విషయంలో ఎన్టీఆర్ అసహనంగా ఉన్నారు. అందుకే హైదరాబాద్‌ కార్యక్రమానికి కావాలని డుమ్మా కొట్టారని తెలుస్తోంది. విజయవాడ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ను ఆహ్వానించకపోవడంతో జరిగిన డ్యామేజీని తప్పించుకోవడానికి తారక్‌ను పిలిచారు తప్ప.. ప్రేమతో కాదనే మరో చర్చ కూడా ఉంది. తారక్‌ కూడా ఇలానే ఫీల్ అయి హర్ట్ అయ్యారా.. అందుకే హైదరాబాద్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్.

నిజానికి నందమూరి కుటుంబానికి, ఎన్టీఆర్‌కు మధ్య దూరం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఎన్ని రకాలుగా బాలకృష్ణకు దగ్గరయ్యేందుకు ఎన్టీఆర్ ప్రయత్నాలు చేస్తున్నా.. అటు వైపు నుంచి పాజిటివ్‌ సిగ్నల్స్ రావడం లేదని టాక్. తారకరత్న కార్యక్రమంలోనూ ఎన్టీఆర్‌ను, కల్యాణ్‌రామ్‌ను బాలకృష్ణ పట్టించుకోనట్టు కనిపించారు. ఇప్పుడేమో ఫ్యామిలీ ట్రిప్ పేరుతో ఎన్టీఆర్ వేడుకలకు తారక్‌ దూరం అయ్యాడు. దీంతో ఈ దూరం తగ్గేది ఎప్పుడు.. దగ్గరయ్యేది ఎప్పుడు అని అభిమానులు చర్చించుకుంటున్నారు.