Mythri Movies: మైత్రీపై దాడులతో హీరోలకు గుబులు.. ఐటీ నెక్ట్స్ టార్గెట్ వాళ్లేనా ?

బ్యాక్‌ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్న మైత్రీ మూవీస్‌ బ్యానర్‌ స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయ్. ఐటీ దాడులతో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. ఐదురోజుల పాటు మైత్రీ మూవీ మేకర్స్ మీద ఇన్‌కం టాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మైత్రీ నిర్మాణ సంస్థ భాగస్వాములుగా నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి.. ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. డైరెక్టర్‌ సుకుమార్‌ను కూడా టార్గెట్ చేశారు. దీంతో నవీన్‌ ఎర్నేని ఆసుపత్రి పాలవగా.. అన్ని షూటింగ్‌లు ఆపేసి దర్శకుడు సుకుమార్ ఇంటికే పరిమితం అయ్యాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2023 | 08:00 PMLast Updated on: Apr 24, 2023 | 8:00 PM

Mythri Movies It Rides

ఈ ఎపిసోడ్‌తో టాలీవుడ్‌తో ప్రకంపనలు మొదలయ్యాయ్. అసలేం జరుగుతోంది. ఎందుకు ఐటీ అధికారులు దాడులు చేశారు. సోదాల్లో దొరికింది ఏంటి.. ఇకపై తీగ లాగబోయేది ఏంటి.. విషయం అటు తిరిగి ఇటు తిరిగి తమవైపే వస్తుందా.. రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయ్.. ఇలా వంద ప్రశ్నలు ఇండస్ట్రీ ప్రముఖులను వెంటాడుతున్నాయ్. ముఖ్యంగా మైత్రీ మూవీస్ బ్యానర్‌లో పనిచేసిన హీరోలకు హాంట్ చేస్తున్న పరిస్థితి ఇది. మైత్రీ మూవీ మేకర్స్ లావాదేవీల్లో సుకుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగులు, మైత్రీతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతర సంస్థల మీద కూడా దాడులు ఐటీ దాడులు జరిగాయ్. వారి అకౌంట్స్, డాక్యుమెంట్స్ పరిశీలించారు. విదేశాల నుంచి మైత్రీ మూవీ మేకర్స్ తీసుకొస్తున్న నిధులు.. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఐతే ఇది హైప్రొఫైల్ కేసు కావడంతో.. వివరాలు ఏవీ పెద్దగా బయటకు రావడం లేదు. రానివ్వడం లేదు గట్టిగా చెప్పాలంటే ! నిజానికి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై దాడులు జరిగితే.. దొరికిన బ్లాక్‌మనీ, ఆస్తుల వివరాలు బయటకు చెప్తారు.

మైత్రి మూవీస్ విషయంలో అలాంటి వివరాలేవీ బయటకు రాలేదు. ఐదు రోజుల దాడుల్లో ఏం గుర్తించానేది క్లారిటీగా తెలియదు. ఐతే కొన్ని విషయాలు మాత్రం ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయ్. దర్శకుడు సుకుమార్ ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కప ప్రాంతాల్లో.. మైత్రి ప్రొడ్యూసర్స్‌ ఆస్తుల కొనుగోళ్లు చేశారు. ఐతే నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి వాట్సాప్ చాటింగ్‌ కీలకంగా మారిందన్న షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. తమ చిత్రాల్లో నటిస్తున్న, నటించిన హీరోలకు చెల్లించిన అమౌంట్స్‌కు సంబంధించిన చాటింగ్‌ హిస్టరీ అలానే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

ఎలాంటి రికార్డు లేకుండా బ్లాక్‌లో చెల్లించడంతో గుర్తు కోసం చాటింగ్‌ హిస్టరీ అలానే ఉంచారని.. తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలకు ఐటీ సెగ తగిలే చాన్స్ ఉందనే టాక్‌ వినిపిస్తోంది. ఇందులో నిజం ఎంత అన్నది పక్కనపెడితే.. ఈ వ్యవహారం టాప్‌ హీరోల గుండెల్లో పరుగులు పెట్టిస్తోంది. 2015లో మైత్రీ మూవీ మేకర్స్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సంస్థ మొదటి చిత్రం శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్. జనతా గ్యారేజ్, రంగస్థలం చిత్ర విజయాలతో టాప్ పొజిషన్‌కి దూసుకువచ్చింది. ప్రస్తుతం పుష్ప 2, ఉస్తాద్ భగత్ సింగ్, ఖుషి చిత్రాలు నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ 31, రామ్ చరణ్-బుచ్చిబాబు చిత్రాలు ప్రకటించారు.