చివరి కోరిక నెరవేరకుండానే వెళ్ళిపోయిన శ్రీదేవి

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 13, 2024 | 08:19 PMLast Updated on: Aug 13, 2024 | 8:19 PM

Sridevi Left Without Fulfilling Her Last Wish

ఇండియన్ సినిమా చరిత్రలో తొలి లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి జయంతి నేడు. అగ్ర నటులకు, రాజకీయ నాయకులకు మరే ఇతర రంగంలో కూడా శ్రీదేవి స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించలేదు. ఆమె తెరపై కనపడితే చాలు అనుకుని అభిమానులు థియేటర్లకు క్యూ కట్టేవారు హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు… మైమరిపించే నటన కూడా ఉంటుందని ఇండియన్ సినిమాకు ఘనంగా చాటి చెప్పిన క్వీన్ శ్రీదేవి. అలాంటి శ్రీదేవి జీవితంలో ఒక కోరిక నెరవేరలేదు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అందాల సుందరి కొన్ని పాత్రలు చేయాలనుకుని చేయలేకపోయారు.

ఈ విషయాన్ని స్వయంగా ఒక సందర్భంగా శ్రీదేవి బయటపెట్టారు. “నేను చాలా పాత్రలలో నటించాను కాని… ‘దేవదాసు’ సినిమాలోని పార్వతి, ‘లైలా మజ్ను’లోని లైలా పాత్రలు చేయలేకపోయాను. ఆ పాత్రలు చేయాలనేది నా చిరకాల కోరిక. కాని చేయలేకపోయాను అంటూ బాధ పడ్డారు శ్రీదేవి. తాను ఎన్నో సినిమాలు చూసినా సరే ఒక నటి మాత్రం తనను బాగా ఆకట్టుకుంది అన్నారు ఆమె. ‘షర్మిలీ’లోని రాఖీ చేసిన ద్విపాత్రాభినయం బాగా ఆకట్టుకుంది అన్నారు శ్రీదేవి.

తాను ఒక్కోసారి మంచిపాత్ర తన చేజారిపోయినప్పుడు బాధపడతాను అంటూ చెప్పుకొచ్చారు. భారతీరాజా, ‘కిళెక్కే పోగుం రైలు’ తీసినప్పుడు అందులోని హీరోయిన్ పాత్ర కోసం నన్ను అడిగారు. అప్పుడు 20 రోజులు అవుట్ డోర్లో ఉండాలన్నారు కానీ… ఆ సమయంలో నాకున్న ఇతర సినిమాలతో సెట్ కాకపోవడంతో సారీ చెప్పాల్సి వచ్చిందని… కాని ఆ పాత్ర చాలా మంచిదని, తర్వాత బాధపడినా ఒక విషయం మాత్రం తనకు సంతోషాన్ని ఇచ్చింది అన్నారు. ఆ పాత్ర తనకు రాకపోవడం మంచే జరిగిందని… రాధిక లాంటి నాటికీ అవకాశం దొరికి… మంచి హీరోయిన్ దొరికిందని తర్వాత సంతోష పడ్డాను అన్నారు శ్రీదేవి.