Women, Missing : రోజూ 39మంది మహిళలు మాయం.. మిస్సింగ్ మిస్టరీ ఏంటి..

దేశంలో ఎంతోమంది మహిళలను కనిపించకుండా పోతున్నారు. వారిని కిడ్నాప్ చేశారా.. వారికి వారే వెళ్లిపోయారా... వెళ్తే ఆ తర్వాతైనా ఆచూకీ ఎందుకు దొరకడం లేదు.. మహిళలతో పాటు పిల్లల్ని కూడా అదృశ్యం చేస్తోంది ఎవరు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 10, 2024 | 03:00 PMLast Updated on: Jul 10, 2024 | 3:00 PM

39 Women Die Every Day What Is The Missing Mystery

దేశంలో ఎంతోమంది మహిళలను కనిపించకుండా పోతున్నారు. వారిని కిడ్నాప్ చేశారా.. వారికి వారే వెళ్లిపోయారా… వెళ్తే ఆ తర్వాతైనా ఆచూకీ ఎందుకు దొరకడం లేదు.. మహిళలతో పాటు పిల్లల్ని కూడా అదృశ్యం చేస్తోంది ఎవరు.. వీరిని ఎవరైనా అక్రమ మానవ రవాణా చేస్తున్నారా… ఇవన్నీ జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయ్. మిస్ అయిన వారి గణాంకాలు.. ఎవ్రీ ఇయర్‌ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ప్రతీరోజు దేశంలో యావరేజీగా 39మంది మహిళలు కనిపించకుండా పోతున్నారు. వీరిలో మైనర్లు కూడా ఉన్నారు. రోజూ అద్యశ్యమవుతున్న వారిలో అధికంగా ఒడిశా నుంచే 13మంది ఉన్నట్టు డేటా చెప్తోంది. ఇలా అదృశ్యమై వారి జాడ కూడా తెలియని మహిళల సంఖ్య దేశవ్యాప్తంగా 2017 నాటికి లక్షా 60వేలు ఉండగా… 2022 నాటికి 2 లక్షల 31వేలు చేరుకుంది.

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్సు బ్యూరో వెల్లడించిన భారత్‌లో నేరాలు వార్షిక నివేదికలో… మైనర్లు సహా 70వేల 649 మంది మహిళలను అదృశ్యమై కన్పించకుండా పోయిన జాబితాలో చేర్చారు. 2017 నుంచి 2022 మధ్య ఈ డేటా పరిశీలిస్తే అదృశ్యమైన వారిలో 67వేల 476 మంది 18ఏళ్ల పైబడిన వారు కాగా… 3వేల 73 మంది మైనర్లు. 2017 చివరి నాటికి గణాంకాలు పరిశీలిస్తే లక్షా 29వేల మంది అదృశ్యమైన మహిళలు ఉండగా… 2022లో ఈ సంఖ్య లక్షా 97వేలకు పెరిగింది. తప్పిపోయిన మైనర్‌ బాలికల సంఖ్య అదే కాలంలో పోలిస్తే 30వేల 725 నుంచి 33వేల 798కి పెరిగింది. 2017 నుంచి 2022 వరకు పరిశీలిస్తే అదృశ్యమవుతున్నవారి సంఖ్యలో పెరుగుదల నమోదైంది. అయిదేళ్ల కాలంలో 14 లక్షల 41వేల మంది మహిళలు అదృశ్యం కాగా… అందులో 13లక్షల 84వేల మంది అచూకీని కనుగొన్నారు.

ఒడిశాలో ఐదేళ్లలో 24వేల 715 మంది మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారు. వీరి సంఖ్య 2017లో 2వేల 668 ఉండగా… అది 2022నాటికి పదిరెట్లకు పైగా పెరిగి 27వేల 383కు చేరింది. ఈ విషయంలో మధ్యప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. అక్కడ 2017లో 25వేల 997 మంది ఉండగా… 2022లో అది 35వేల 759కు పెరిగింది. అయితే నిజానికి 2017 నుంచి 2022 మధ్య కాలంలో పశ్చిమ బెంగాల్‌ అగ్రస్థానంలో ఉంది. ఆ సమయంలో అక్కడ 2017లో 33వేల 083 మిస్సింగ్‌ కేసులు, 2022లో 38వేల 848 కేసులు నమోదయ్యాయ్. ఐతే మహారాష్ట్రలో కేసుల తగ్గుదల కనిపించింది. ఇక్కడ 2017లో 27వేల 949 ఉండగా, 2022లో 23వేల 342కి తగ్గింది. అలాగే తెలంగాణలోనూ 2022 నాటికి 3వేల 51 నుంచి వెయ్యి 653కు తగ్గుదల నమోదైంది. ఈ విషయంలో ఒడిశా అతిపెద్ద మూడో రాష్ట్రంగా నిలిచింది.

దేశంలో కన్పించకుండా పోతున్న వారిలో పురుషులు కూడా ఉన్నారు. NCRB 2023 డిసెంబర్‌లో ప్రచురించిన డేటా ప్రకారం 2022నాటికి దేశంలోని వివిధ రాష్ర్టాలు, యూటీల్లో మొత్తం 3లక్షల 8వేల మంది అదృశ్యమయ్యారు. వీరిలో లక్షా 52వేల మంది పురుషులు, 21మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. అదే సమయంలో 2017 నాటికి దేశంలో 2లక్షల 97వేల మంది అదృశ్యం కాగా… అందులో పురుషులు లక్షా 37వేల మంది, ట్రాన్స్‌జెండర్లు 163 మంది ఉన్నారు.