CM kcr: బీఆర్ఎస్‌కు మరో భారీ షాక్‌.. కేసీఆర్‌ స్ట్రాటజీలు వర్కౌట్ కావట్లేదా..

బీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 5, 2023 | 06:50 PMLast Updated on: Oct 05, 2023 | 6:50 PM

Another Big Shock For Brs Kcrs Strategies Didnt Work Out

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పరిణామాలు వేగంగా మారుతున్నాయ్. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు.. జంపింగ్‌ జపాంగ్‌లు కనిపిస్తున్నాయ్. చేరేవాళ్లు చిన్నోళ్లు.. వెళ్లేవాళ్ల పెద్దోళ్లు అనేట్లు మారింది గులాబీ పార్టీ పరిస్థితి. మైనంపల్లి, తుమ్మల, కసిరెడ్డి, ఇప్పుడు మనోహర్ రెడ్డి.. బడా నేతలంతా వరుసగా బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్తున్నారు. మైనంపల్లి సంగతి ఎలా ఉన్నా.. మిగతా ముగ్గురి విషయంలో మాత్రం కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టిందా.. స్ట్రాటజీ వర్కౌట్‌ కాలేదా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. నిజానికి ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేయాలన్నది కేసీఆర్ వ్యూహం. ఇది కాస్త తేడా కొట్టినట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్‌ టికెట్ దక్కక.. అసంతృప్తితో కొందరు కీలక నాయకులు పార్టీని వీడుతుండటం పార్టీ పెద్దలను కలవరపెడుతోంది.

ఇప్పటికే మాజీ మంత్రులు, సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పదవుల్లో కొనసాగుతున్నవారు, కీలక నాయకులు.. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి ఇతరపార్టీల్లో చేరారు. ఇప్పుడు ఇదే బాటలో నడిచేందుకు సిద్దమయ్యారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మనోహర్ రెడ్డి. బీఆర్ఎస్‌, బీజేపీ నుంచి వలసలు కొనసాగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ మంచి జోరు మీద ఉంది. రోజురోజుకు ఆ పార్టీలో చేరే నాయకులు సంఖ్య పెరుగుతోంది. ఇతర పార్టీల్లోని అసంతృప్తులను గుర్తించి.. వారితో సంప్రదింపులు జరిపి పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇలా బీఆర్ఎస్‌ టికెట్ ఆశించి భంగపడ్డ ఉమ్మడి రంగారెడ్డి డిసిసిబి ఛైర్మన్‌తో కాంగ్రెస్ నాయకులు సంప్రదింపులు జరిపారు. ఇవి ఫలించడంతో మనోహర్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధం అయ్యారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌తో తన నివాసంలోనే మనోహర్ రెడ్డి భేటీ అయ్యారు. తాండూరు టికెట్ ఆశిస్తున్న ఆయనకు రేవంత్ నుండి హామీ లభించడంతో.. త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. తన సన్నిహితులు, అనుచరులతో మరోసారి చర్చించి కాంగ్రెస్ లో చేరికపై మనోహర్ రెడ్డి అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక అటు ఇప్పటికే మాజీ మంత్రి తుమ్మల వంటి కీలక నాయకుడు కూడా బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అలాగే మల్కాజ్‌గిరి టికెట్ దక్కినప్పటికీ.. కొడుకుకు మెదక్ టికెట్ దక్కకపోవడంతో మైనంపల్లి హన్మంతరావు కూడా బీఆర్ఎస్ వీడారు. మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా వరుసగా కీలక నాయకులు రాజీనామా చేయడం బిఆర్ఎస్‌కు పెద్దదెబ్బే..