Sankranti Special Buses : సంక్రాంతికి స్పెషల్ బస్సులు లేనట్టే అదనపు ఛార్జీలు మోత తప్పదా ?

తెలంగాణలో సంక్రాంతికి ఊరు వెళ్ళాలంటే ఈసారి అదనపు ఛార్జీల మోత తప్పేలా లేదు. గతంలో ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే బస్సులు నడిపింది TSRTC. తెలంగాణలోని జిల్లాలతో పాటు పొరుగున్న ఉన్న ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళే స్పెషల్ బస్సుల్లో కూడా ఎక్స్ ట్రా ఛార్జీలు వసూలు చేయలేదు. కానీ ఈసారి స్పెషల్ బస్సులు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంతో బస్సులు చాలడం లేదు. అటు రైళ్ళల్లో చాంతాడంత వెయిటింగ్ లిస్ట్స్ ఉంటున్నాయి. దాంతో ఈ సంక్రాంతికి ప్రైవేట్ బస్సుల్లో డబుల్, త్రిబుల్ ఛార్జీలు పెట్టి ఊళ్ళకి వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 3, 2024 | 11:08 AMLast Updated on: Jan 03, 2024 | 11:08 AM

As There Are No Special Buses For Sankranti Are There Extra Charges

 

తెలంగాణలో సంక్రాంతికి ఊరు వెళ్ళాలంటే ఈసారి అదనపు ఛార్జీల మోత తప్పేలా లేదు. గతంలో ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే బస్సులు నడిపింది TSRTC. తెలంగాణలోని జిల్లాలతో పాటు పొరుగున్న ఉన్న ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళే స్పెషల్ బస్సుల్లో కూడా ఎక్స్ ట్రా ఛార్జీలు వసూలు చేయలేదు. కానీ ఈసారి స్పెషల్ బస్సులు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంతో బస్సులు చాలడం లేదు. అటు రైళ్ళల్లో చాంతాడంత వెయిటింగ్ లిస్ట్స్ ఉంటున్నాయి. దాంతో ఈ సంక్రాంతికి ప్రైవేట్ బస్సుల్లో డబుల్, త్రిబుల్ ఛార్జీలు పెట్టి ఊళ్ళకి వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

తెలంగాణలో మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టాక బస్సుల్లో ఆక్యుపెన్సీ బాగా పెరిగింది. ఉచిత ప్రయాణంతో మహిళలు భారీ సంఖ్యలో బస్సులు ఎక్కుతున్నారు. దాంతో ఎక్స్ ప్రెస్ బస్సులు లేని చోట్ల డీలక్స్ బస్సులను కూడా ఆర్టీసీ నడుపుతోంది. ఈ పరిస్థితుల్లో సంక్రాంతి పండక్కి స్పెషల్ సర్వీసులు వేయడానికి బస్సుల కొరత తీవ్రంగా ఉంది. పండగ రద్దీని తట్టుకోడానికి రెగ్యులర్ గా వెళ్ళే డీలక్స్, సెమీ లగ్జరీ బస్సులతో పాటు స్పెషల్స్ కింద ఎక్స్ ప్రెస్ బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ప్రతి యేటా తమ సొంత ఊళ్ళల్లో జరిగే సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడానికి 25 లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. జనవరి రెండో వారంలో పిల్లలకు సెలవులు ఇచ్చిన దగ్గర నుంచీ రద్దీ మొదలవుతుంది. ఆర్టీసీ 4 వేల 500 బస్సులను అదనంగా నడుపుతుంది. అందుకోసం జిల్లాల్లోని డిపోల నుంచి హైదరాబాద్ కి ఎక్స్ ప్రెస్ సర్వీసులను తరలిస్తుంటారు.

ఈసారి ఊళ్ళకు వెళ్ళే మహిళల సంఖ్య కూడా పెరిగే ఛాన్సుంది. వాళ్ళ రద్దీని తట్టుకోడానికి అదనపు సర్వీసులు నడిపే పరిస్థితి కూడా లేదు. సాధారణంగా సంక్రాంతికి హైదరాబాద్ లాంటి సిటీల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళే ప్రయాణీకులే అధికంగా ఉంటారు. అక్కడికి బస్సులు వేస్తే… ఇక్కడ తెలంగాణలో పల్లెలకు వెళ్ళే వారికి బస్సుల కొరత ఏర్పడుతుంది. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళను నడుపుతోంది. కానీ వాటిల్లో వెయిటింగ్ లిస్ట్ 150 నుంచి 250 దాటి కనిపిస్తున్నాయి. రైళ్ళల్లో బుకింగ్ చేసుకోడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. దాంతో జనమంతా బస్సులనే నమ్ముకుంటారు.

ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోతే… ప్రైవేట్ పైనే ప్రయాణీకులు ఆధారపడాల్సి పరిస్థితి ఈసారి కనిపిస్తోంది. ప్రతి యేటా సంక్రాంతికి ప్రైవేట్ బస్ ఆపరేటర్లు… డబుల్, త్రిబుల్ ఛార్జీలు వసూలు చేస్తుంటారు. ఈసారి ఇంకా రేట్లు పెరిగే అవకాశాలున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ టు విశాఖకు 910 రూపాయల ఛార్జ్ ఉంటే, సంక్రాంతికి 1600 దాకా వసూలు చేస్తారు. ఇక విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, తిరుపతి, కడప లాంటి ప్రాంతాలకు కూడా ఛార్జీలు రెట్టింపు అయ్యే ఛాన్సుంది. ఇటు తెలంగాణలో జిల్లా ప్రధానకేంద్రాలకు వెళ్ళే ప్రైవేట్ బస్సుల్లోనూ ఛార్జీల మోత తప్పదనిపిస్తోంది. అందుకే… ప్రైవేట్ బస్సులు అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేయకుండా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.
తెలంగాణ ఆర్టీసీ ఎలాగొలా స్పెషల్ బస్సులు నడిపినా… అందులో మహిళలకు ఛార్జీలు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో మహిళలతో యుద్ధాలు తప్పవు. అందుకే స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు వసూలు చేస్తారా లేదా అన్నది కూడా… TSRTC ముందే ప్రకటిస్తే బాగుంటుందని అంటున్నారు.