KTR: బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయంపై సీఎం ఎందుకు స్పందించరు: కేటీఆర్

బీజేపీకి కాంగ్రెస్.. ప్రత్యామ్నాయం కాదు. ఆ పార్టీని ఆపగలిగే శక్తి ప్రాంతీయ రాజకీయ పార్టీలకే ఉంది. కాంగ్రెస్‌కు దమ్ముంటే వారణాసిలో పోటీ చేసి మోదీపై గెలవాలి. కాంగ్రెస్ వైఖరివల్లే ఇండియా కూటమి చెల్లాచెదురవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 3, 2024 | 04:33 PMLast Updated on: Feb 03, 2024 | 4:33 PM

Brs Leader Ktr Fires On Cm Revanth Reddy

KTR: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోయినప్పటికీ.. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్. బీజేపీకి వ్యతిరేకంగా సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. “మీరు ఎందుకు భయపడుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా ఎందుకు లొంగిపోయారు..? కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు” అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అనంతరం కూకట్‌పల్లిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.

Jharkhand MLAs: హైదరాబాద్‌లో ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు.. భారీ భద్రత.. కలిసేందుకు నో ఛాన్స్

“బీజేపీకి కాంగ్రెస్.. ప్రత్యామ్నాయం కాదు. ఆ పార్టీని ఆపగలిగే శక్తి ప్రాంతీయ రాజకీయ పార్టీలకే ఉంది. కాంగ్రెస్‌కు దమ్ముంటే వారణాసిలో పోటీ చేసి మోదీపై గెలవాలి. కాంగ్రెస్ వైఖరివల్లే ఇండియా కూటమి చెల్లాచెదురవుతోంది. దీనిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బీజేపీని మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నేతలే అడ్డుకోగలరు. చీకటి ఉంటేనే వెలుతురు తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూస్తే కాంగ్రెస్ పార్టీ పాలన అర్థం అవుతుంది. చిన్న పిల్లలు కూడా కాంగ్రెస్ పార్టీ హామీలను గుర్తు చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్‌పై ఉంది. హైదరాబాదీ ఓటర్లు తెలివిగా అభివృద్ధికి ఓటేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్య తేడా కేవలం 1.8 శాతమే. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. గ్రామీణ ప్రజలు.. కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 స్థానాలు వచ్చాయి. ప్రజలు బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఆ బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత మాపై ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసుకుంటున్నాడు. మాకూ నోరు ఉంది. వంద రోజుల వరకూ ఓపిక పడతాం. గుజరాత్, యూపీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీతో నేరుగా పోటీ పడాల్సిన కాంగ్రెస్, ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పోటీ పడుతుంది” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు