HYD BRS KHALI : హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఖాళీ.. హస్తంగూటికి ఎమ్మెల్యేలు,కార్పొరేటర్లు?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చాక చాలామంది బీఆర్ఎస్ లీడర్లు ఆ పార్టీలోకి జంప్ చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కు చెందిన BRS ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు జై కాంగ్రెస్ అంటున్నారు. GHMC పరిధిలో బలంగా ఉన్న గులాబీ క్యాడర్ ను కాపాడుకోడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 12, 2024 | 09:47 AMLast Updated on: Feb 12, 2024 | 11:19 AM

Brs Vacancy In Hyderabad Mlas And Corporators Join Hands

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చాక చాలామంది బీఆర్ఎస్ లీడర్లు ఆ పార్టీలోకి జంప్ చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కు చెందిన BRS ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు జై కాంగ్రెస్ అంటున్నారు. GHMC పరిధిలో బలంగా ఉన్న గులాబీ క్యాడర్ ను కాపాడుకోడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. అయితే రోజుకొకరు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తుండటంతో… లోక్ సభ ఎన్నికల నాటికి హైదరాబాద్ బీఆర్ఎస్ లో ఎవరు ఉంటారో… ఎవరు ఉండరో తెలియని పరిస్థితి ఏర్పడింది.

కాంగ్రెస్ లో చేరితే నాలుగు పనులు అయినా చక్కబెట్టుకోవచ్చు. గులాబీ పార్టీని పట్టుకొని ఎన్నాళ్ళని వేలాడతాం… తమకు గుర్తింపు లేని పార్టీలో ఉండటం కంటే… హస్తం గూటికెళ్ళి ఎక్కడో అక్కడ టిక్కెట్ తెచ్చుకోవడం బెటర్ అని అనుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారం చేపట్టిన డిసెంబర్ నెలలోనే… హైదరాబాద్ లో ఐదుగురు BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని టాక్ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో చేరికలను కొన్నాళ్ళ పాటు వాయిదా వేసుకున్నట్టు తెలిసింది.

ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు మాజీ మేయర్ (Former Mayor) బొంతు రామ్మోహన్ (Bonthu Rammehan) గట్టి షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. వారం రోజుల్లోనే ఆయన హస్తం పార్టీలో చేరతారని చెబుతున్నారు. బొంతు రామ్మోహన్ మల్కాజ్ గిరి పార్లమెంట్ (Parliament) టిక్కెట్ అడుగుతున్నారు. కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడే కాంగ్రెస్ లో చేరుతుండటంతో… GHMCలోని BRS కార్పొరేటర్లలో కలకలం మొదలైంది. గత వారంలోనే కార్పొరేటర్లతో తెలంగాణ భవన్ లో సమావేశం అయ్యారు కేటీఆర్. BRS కార్పొరేటర్లకు మైనంపల్లి హన్మంతరావు ఫోన్లు చేసి… కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారన్న వార్తలతో అప్రమత్తమయ్యారు కేటీఆర్.

రాష్ట్రంలో అన్ని స్థానాల్లో మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు GHMC పరిధిలోని అసెంబ్లీ సీట్లు నిరాశపరిచాయి. ఇక్కడ 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా దక్కలేదు. దాంతో సిటీలో పట్టు తెచ్చుకోడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల నాటికి కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది. 14 మంది BRS కార్పొరేటర్లు కాంగ్రెస్ లీడర్లతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి GHMC పరిధిలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లను కాపాడుకోడానికి KTR ఏం చేస్తారో చూడాలి.