Rakesh Master: తాగుబోతు ప్రతిపక్షం..తాగుడు మానిపించలేని అధికార పక్షం! రాకేశ్‌ మాస్టర్‌ మరణం తర్వాత చిల్లర రాజకీయాలు..

శవాలపై చిల్లర ఏరుకోవడమంటే ఇదే.. చావును కూడా రాజకీయం చేయడమంటే ఇదే.. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ దొందూ దొందే..!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 19, 2023 | 02:42 PMLast Updated on: Jun 19, 2023 | 2:42 PM

Chandra Babu Tdp Members In Social Media Claims Rakesh Master Died Of 20 Beer Bottles By Andhra Pradesh Jagan Goverment Saying They Will Give Quality Beer If Came To Power

మద్యపాన నిషేధమంటే ఏంటీ..? చీప్‌ లిక్కర్‌ అమ్మడమా..? ఇదేం నిషేధమో సీఎం జగనే చెప్పాలి.. బ్యాన్‌ అంటే అసలు అమ్మకపోవడమని అంతా భావించారు.. పెన్షన్లు విడతల వారిగా ఇచ్చినట్టు..ఈ నిషేధం కూడా దశల వారిగా ఉంటుందని అప్పట్లో వైసీపీ సెలవిచ్చింది..! ప్రస్తుతం మద్యపాన నిషేధం ఏ స్టేజీ దగ్గర ఉందో ఇంతవరకు చెప్పలేదు. మద్యపాన నిషేధం అమలులో వైసీపీ ప్రభుత్వానికి అసలు బుద్దే లేదు..అటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి ప్రజల ఆరోగ్యం పట్ల లెక్కలేదు.. కనీస బాధ్యత లేదు.. పచ్చిగా చెప్పలంటే అసలు వాళ్లకి బుర్రేలేదు.. లేకపోతే ఏంటా పిచ్చి వాగుడు.. అధికారంలోకి వస్తే క్వాలిటీ లిక్కర్ ఇస్తామనడమేంటి..? అప్పటి వరకు మందు తాగొద్దు.. మేం వచ్చిన తర్వాత తాగమనడమేంటి..? ఇదేం వెర్రీ..సాక్ష్యత్తు ఆ పార్టీ అధినేతే ఈ తరహా వ్యాఖ్యలు చేసి అభాసుపాలైనా కానీ.. ఇటు టీడీపీ కార్యకర్తలకు.. అటు సోషల్‌మీడియా తమ్ముళ్లకు ఇంకా తాగిన మత్తు దిగినట్టు లేదు. రాకేశ్‌ మాస్టర్‌ మరణం తర్వాత చిల్లర పోస్టులతో చిరాకు తెప్పిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

ప్రముఖ కొరియోగ్రఫర్‌ రాకేశ్‌ మాస్టర్ మరణం తర్వాత రకరకాల వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆయనకు మల్టీ ఆర్గన్స్ ఫెయిల్ అయ్యాయని డాక్టర్లు చెప్పారు..అయితే ఆ ఆర్గన్స్‌ పాడైపోవడానికి ‘బూమ్ బూమ్’ అని ఏపీ ప్రభుత్వం అమ్ముతున్న బీరే కారణమని సోషల్‌మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న వాళ్లు కూడా ఈ పోస్టులు పెడుతున్న వాళ్లలో ఉన్నారు. రాకేశ్‌ మాస్టర్‌ ఒక రోజులో 20బాటిల్స్‌ బీర్‌ సీసాలు ఫుల్‌గా తాగాడని..ఏపీ ప్రభుత్వం బీర్‌ తాగితే యమలోకానికి దారులు తెరుచుకున్నట్టేనని పోస్టులు పెడుతున్నారు. మరి కొందరు.. ఒక్క రోజు కాదు రెండు రోజుల్లో 20బీర్లు తాగాడని చెబుతున్నారు. రోజుకు 24గంటలుంటాయి.. ప్రాక్టికల్‌గా రోజుకు 20 బీర్‌ సిసాలు తాగొచ్చో లేదో సైంటిఫిక్‌గా తెలియదు కానీ.. ఈ విషయంపై మంచి పట్టున్న తమ్ముళ్లు మాత్రం 20బాటిల్స్‌ తాగాడంటూ పోస్టులు పెడుతున్నారు. నిజానికి ఒక్క రోజుకు 20 క్వాలిటీ బీర్లు తాగినా.. వైసీపీ బ్రాండ్‌ బీరులు తాగిన ఆర్గన్స్‌ డ్యామేజ్‌ అవుతాయి..అది పక్కా..!

తాగుడు మనిషి పతనానికి కారణం అవుతుంది.. ఈ ఒక్క అలవాటు ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తుంది.! గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ వ్యసనం కారణంగా ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఇటు సిటీల్లోనూ, టౌన్స్‌లోను యువత అప్పులు పాలవుతున్నారు. మితిమీరిన తాగుడు ఎవరికైనా చెడే చేస్తుంది. ఈ విషయాలన్నీ టీడీపీకి తెలియదా.? వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం మందు తాగొద్దని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్వాలిటీ లిక్కర్ ఇస్తామని చెప్పడం నిజంగా ఘోరం! ప్రజలను మందు తాగమని రాజకీయ పార్టీలు చెప్పడం ఏంటి..? అప్పట్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇలాంటి వ్యాఖ్యలే చేసి సారాయ్‌ వీర్రాజుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మధ్య 40ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మద్యపాన నిషేధం కోసం పోరాడకుండా.. ప్రజలు చీప్ లిక్కర్‌తో బాధపడుతున్నారని వాపోవడం విడ్డూరం.

దశాబ్దాల పాటు ‘తమవాళ్లకే’ ఎక్కువ లిక్కర్ లైసెన్స్‌లు కట్టబెట్టిన చంద్రబాబుకు తాగుడు వల్ల కుటుంబాలు పడే బాధాలు తెలియకపోవచ్చు..! ఇటు చెప్పిందే చేస్తాడు.. చేసేదే చెబుతాడు అంటూ గొప్పలు పోయే వైసీపీ ఈ విషయంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. మేనిఫేస్టో పట్టుకోని..90శాతం చెప్పినవి చేశామని వైసీపీ చెప్పుకుంటోంది..ఆ మిగిలిన 10శాతంలో మద్యపాన నిషేధమే ప్రధానంగా ఉంది. కల్తీవి అమ్మినా, చీప్‌వి అమ్మినా తాగేవాడు తాగుతూనే ఉంటాడు.. ఈ విషయం ప్రభుత్వానికి తెలియనిది కాదు.. చీప్‌వి అమ్మితే కొన్నాళ్లకు తాగడం మానేస్తారులే అనుకోవడం వెర్రితనం..! ‘ఇదిగో మందు అని’ ఫెనాయిల్‌ ఇచ్చినా తాగేసే తాగుబోతుగాళ్లు ఉన్న రాష్ట్రం మనది.. అందుకే బ్యాన్‌ చేస్తే మొత్తం చేయాలి..! వైసీపీకి ఈ విషయం ఎప్పుడు బోధపడుతుందో అప్పుడే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఫ్యాన్‌ పార్టీకి దగ్గర అవుతారు..లేకపోతే వారి ఓట్లు కూడా అస్సామే..!