Chengicharla violence: చెంగిచెర్ల ఘటన.. బండి సంజయ్పై కేసు.. రాజాసింగ్ హౌజ్ అరెస్ట్
ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. హిందూత్వ పేరుతో పని చేసే బీజేపీ నేతలు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజా సింగ్ ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించడం వివాదాస్పదమైంది. దీంతో పోలీసులు ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు.

Chengicharla violence: హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్, చెంగిచెర్లలో హిందువులపై కొందరు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక మహిళకు గాయాలయ్యాయి. మరికొందరిపైనా దాడి జరిగింది. అయితే, ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. హిందూత్వ పేరుతో పని చేసే బీజేపీ నేతలు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజా సింగ్ ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించడం వివాదాస్పదమైంది. దీంతో పోలీసులు ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు.
Siddharth: సిద్ధార్థ్తో పెళ్లి.. సోషల్ మీడియాలో అదితి పోస్ట్ వైరల్
చెంగిచెర్లలో గాయపడ్డ మహిళను పరామర్శించేందుకు బండి సంజయ్.. బుధవారం ఆ ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించారు. ఆయనతోపాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు కూడా వెంట ఉన్నారు. కానీ, బండి సంజయ్ అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. బారికెడ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బండి, బీజేపీ కార్యకర్తలు వాటిని దాటి, పోలీసుల్ని తప్పించుకుని వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత తలెత్తింది. చివరకు బండి సహా కార్యకర్తలు అక్కడికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. అయితే, తమ విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో బండితోపాటు మరో తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మరోవైపు గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. ఆయన కూడా గురువారం సాయంత్రం చెంగిచెర్ల వెళ్లి, బాధితుల్ని పరామర్శిస్తానని ప్రకటించారు.
ఆయన వెళ్తే ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉందని పోలీసులు అన్నారు. అందువల్ల ఆయనను హౌజ్ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, పోలీసుల తీరుపై రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను హౌజ్ అరెస్ట్ చేయడం సరికాదన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నారు. మరి ఈ రోజు సాయంత్రం రాజా సింగ్ చెంగిచెర్ల వెళ్తారా.. లేదా.. అనేది ఆసక్తికరంగా మారింది.