DEFENCE BUDGET 2023: రక్షణ రంగానికి పెద్దపీట వేయకుంటే ముప్పు తప్పదా..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2023 | 08:39 AMLast Updated on: Jan 31, 2023 | 8:41 AM

Defence Budget 2023 రక్షణ రంగానికి పెద్దప

మన దేశంపైకి చైనా యుద్దానికి సిద్దం అవుతోంది. సరిహద్దుల వద్ద తమ ఆయుధాలతో గస్తీ కాస్తుంది. ఈ పరిస్థితుల్లో మన దళాలను అత్యాధునిక ఆయుధాలతో బలోపేతం చేయకపోతే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత్‌ గతంలో ఎన్నడూ ఎదుర్కోనంత ముప్పును వాస్తవాధీన రేఖ వద్ద ఎదుర్కొంటోంది. ఎల్‌ఏసీ వద్ద పాగావేసిన చైనా దళాలు తమ ఆలోచనలను వెనక్కి తీసుకునేందుకు సిద్దంగా లేరు. రోజురోజుకూ భారత భూభాగంపైకి దూసుకువస్తున్నారు. చైనా వైపు 5జీ కమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌తో సహా అత్యాధునిక సాంకేతికతను కూడా మోహరిస్తోంది. చైనా ముప్పు కేవలం హిమాలయాల వరకే అనుకొని కూల్ గా కూర్చుంటే మన పని అయిపోయినట్లే. డ్రాగన్‌ నౌకలు బంగాళాఖాతంలోకి కూడా చొచ్చుకొస్తున్నాయి. భారత్‌ చుట్టూ నౌకాదళ స్థావరాలను ఏర్పరచుకుంటున్నాయి.

2025 నాటికి చైనా వద్ద 400 యుద్ధ నౌకలు ఉంటాయని అమెరికా ఇప్పటికే అంచనా వేసింది. భారత్‌ వద్ద ప్రస్తుతం కేవలం 139 మాత్రమే ఉన్నాయి. వైమానిక దళం రష్యా తయారీ మిగ్‌ 21లతో ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గ్లోబల్‌ ఫైర్‌పవర్‌ ఇండెక్స్‌ ప్రకారం రక్షణ రంగంపై చైనా 230 బిలియన్‌ డాలర్లు వెచ్చించగా.. భారత్‌ కేవలం 54 బిలియన్‌ డాలర్లే ఖర్చుచేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆయుధాలకు ఆమడ దూరంగా ఉన్న జపాన్‌ కూడా చైనా దెబ్బకు రక్షణ బడ్జెట్‌ను గణనీయంగా పెంచుకొంది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు చైనా ఎంత వేగంగా విద్రోహ శక్తిగా మారుతోందో అని. ఈ నేపథ్యంలో 2023 బడ్జెట్‌లో సబ్‌మెరైన్లు, తేలికపాటి యుద్ధ ట్యాంకులు, ఫైటర్‌ విమానాల కొనుగోళ్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ విమాన వాహక నౌకను ఇప్పటికే హడావుడిగా నౌకాదళంలో ప్రవేశపెట్టారు. కానీ, దీనిపై వినియోగించేందుకు అవసరమైన విమానాల కొనుగోళ్లు మాత్రం ఇప్పటికీ పూర్తికాలేదు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే ఈ నౌకను వాడుకొనే పరిస్థితి లేదు. ఇప్పటికే దీనిపై 27 రఫేల్‌ మెరైన్‌ రకం విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ కొనుగోళ్ల కాంట్రాక్టుల ప్రక్రియ పూర్తికావాలంటే కనీసం ఏడాదైనా పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ విమానాల కొనుగోళ్లకు పచ్చజెండా ఊపేందుకు అవసరమైన నిధులను కేటాయించాలి.
అలాగే ప్రాజెక్టు 75ఐ కింద కొత్తగా ఆరు జలాంతర రక్షణవలయాలను నిర్మించాల్సి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి దీని కాంట్రాక్టు చర్చలు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో నిధులను సిద్ధం చేసుకొంటే శరవేగంగా పనులను మొదలుపెట్టవచ్చు. ఒక వేళ ఈ ప్రాజెక్టు ముందుకు కదలక పోతే మరిన్ని స్కార్పియన్‌ శ్రేణి సబ్‌మెరైన్ల కొనుగోళ్లు చేసేలా నేవీ ఇప్పటికే ప్రణాళిక -బి ని సిద్ధంగా పెట్టుకొన్నట్లు సమాచారం. ఇక ఇండో-పసిఫిక్‌ వ్యూహానికి మరింత పదును రావాలంటే భారత్‌ నౌకాదళం డ్రోన్ల వినియోగాన్ని భారీగా పెంచాలి. ఇప్పటికే ప్రిడేటర్‌ డ్రోన్ల కొనుగోళ్లపై కూడా చర్చలు జరుగుతున్నాయి. సముద్ర నిఘా, నీటి లోపలి నుంచి శత్రు ప్రవేశాన్ని కట్టడికి ఇవి చాలా అవసరం.

మనకు తరచూ చోటుచేసుకొంటున్న యుద్ధ విమానాల ప్రమాదాల కారణంగా వాయుసేన బలం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఫోర్స్ త్వరగా యుద్ధ విమానాలను అందుబాటులో ఉంచుకోవాలి. దీనికి సంబంధించి మల్టీ రోల్‌ ఫైటర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ కాంట్రాక్టును ముందుకు తీసుకెళ్లడమో.. మరిన్ని రఫెల్స్‌ కొనుగోలు చేయడంమో చేయాలి. సరిహద్దుల్లో ఉద్రిక్తతల సమయంలో వాయుసేనను బలహీనంగా ఉంచడం ఏమాత్రం సరైన పద్దతి కాదు. రక్షణ రంగ కేటాయింపులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి కేంద్రం నాన్‌లాప్సబుల్‌ ఫండ్‌ను ఈ సారైనా ఏర్పాటు చేస్తుందని దళాలు ఆశిస్తున్నాయి. ఎందుకంటే ఆయుధ కాంట్రాక్టులు పూర్తి కావాలంటే చాలా దశలను దాటాలి. ఇందుకు సమయం పడుతుంది. ఈ లోపు కేటాయింపులు వృధా అవకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇటీవల రక్షణ మంత్రత్వ శాఖలో జరిగిన కార్యక్రమంలో త్రివిధ దళాలు ఈ సారి కేటాయింపులు పెంచాలని బలంగా కోరాయి. గతేడాది బడ్జెట్‌లోనే మూలధన వ్యయాలను రూ.1.32 లక్షల కోట్ల నుంచి రూ.1.52 లక్షల కోట్లకు పెంచారు. ఈ సారి పెంపు మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా. వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ విధానంలో మార్పులు చోటు చేసుకోవడంతో పింఛన్‌ బిల్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన బకాయిల చెల్లింపులకు అదనంగా 8,450 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. రక్షణ సంస్థల వద్ద అత్యధికంగా భూమి ఉంది. వీటిల్లో చాలా వరకు ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ హబ్‌లుగా మారాయి. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ కొంత భూమిని విక్రయించి నిధులను సమకూర్చుకొనే అంశంపై కూడా ప్రతిపాదనలు ఉండే అవకాశాలున్నట్లు కొందరి విశ్లేషకుల అభిప్రాయం.

కేంద్రప్రభుత్వం దీనిని ఏవిధంగా పరిగణలోకి తీసుకొని రక్షణ రంగానికి నిధులు సమకూరుస్తుందో బడ్జెట్ వివరాలు వెలువడేవరకు వేచిచూడాలి. గతంలో యంత్రాలతోనే యుద్దాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మోదీ ప్రభుత్వం తెలిపింది. అందుకే ఆర్మీ బలగాల సంఖ్యను తగ్గిస్తూ అగ్నిపధ్ పేరుతో సరికొత్త పథకాన్ని రూపకల్పన చేసింది. రక్షణ రంగానికి మిత సంఖ్యలో సైనిక బలగాలను సమకూర్చుకునేందుకు సన్నాహాలు చేసింది. మరి ఈ బడ్జెట్ లో ఏమాత్రం నిధులను అణువాయుధాల కొనుగోలుకు సమకూర్చుకుంటుందో తెలుసుకోవాలంటే సీతమ్మ వారి పద్దులు విడుదల్యేవరకు ఎదురు చూడకతప్పదు.