DANGER MALLANNA : మల్లన్నసాగర్ కి భూంకంపం ముప్పు.. డ్యామ్ బద్దలైతే కరీంనగర్ కు డేంజర్

తెలంగాణలో (Telangana) బీఆర్ఎస్ (BRS) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్లన్నసాగర్ (Mallanna Sagar) కి భూకంపం (Earthquake) ముప్పు పొంచి ఉంది. ఇదే ప్రతిపక్షాల ఆరోపణలు కాదు.. కాగ్ నివేదికలోనే ఈ దారుణం బయటపడింది. అసలు ఈ విషయం డ్యామ్ కట్టకముందే NGRI హెచ్చరించినా.. కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt) ఆ రిపోర్ట్ ను ఖాతర్ చేయలేదు. ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై 5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చే ఛాన్సుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 15, 2024 | 03:12 PMLast Updated on: Jan 15, 2024 | 3:12 PM

Earthquake Threat To Mallanna Sagar Danger To Karimnagar If The Dam Breaks

తెలంగాణలో (Telangana) బీఆర్ఎస్ (BRS) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్లన్నసాగర్ (Mallanna Sagar) కి భూకంపం (Earthquake) ముప్పు పొంచి ఉంది. ఇదే ప్రతిపక్షాల ఆరోపణలు కాదు.. కాగ్ నివేదికలోనే ఈ దారుణం బయటపడింది. అసలు ఈ విషయం డ్యామ్ కట్టకముందే NGRI హెచ్చరించినా.. కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt) ఆ రిపోర్ట్ ను ఖాతర్ చేయలేదు. ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై 5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చే ఛాన్సుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జలాశయం ప్రాంతంలో భూమి కింద నిట్టనిలువుగా భారీ చీలికలు ఉన్నట్టు కాగ్ రిపోర్టు బయటపెట్టడంతో.. మల్లన్నసాగర్ చుట్టు పక్కల ప్రాంతాల జనం భయపడుతున్నారు. అంతేకాదు కరీంనగర్ కూడా డేంజర్ జోన్ లో ఉందని అంటున్నారు నిపుణులు.

మల్లన్నసాగర్.. కాళేశ్వరం (Kaleswaram) భారీ ప్రాజెక్టులో కీలకమైన రిజర్వాయర్. అలాంటి మల్లన్నసాగర్ డేంజర్ జోన్ లో ఉంది. భూకంపం ముప్పు ఉందనీ.. ప్రాజెక్ట్ నిర్మాణం చేయొద్దని కేంద్ర ప్రభుత్వ సంస్థ NGRI సలహా ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం శాస్త్రవేత్తల మాటలు పట్టించుకోకుండా మల్లన్నసాగర్ నిర్మాణం చేసిందని కాగ్ రిపోర్ట్ బయటపెట్టింది. ఎలాంటి స్టడీ చేయకుండా తొందరపడి నిర్మాణం చేశారని కూడా కాగ్ ఆరోపించింది. ఒకవేళ భూకంపం వస్తే.. చుట్టుపక్కల జనం ప్రాణాలు, ఆస్తి నష్టం ఘోరంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. మూడేళ్ళుగా కాళేశ్వరంపై సమగ్రంగా చేసిన ఆడిట్ రిపోర్ట్ ను కాగ్ ప్రభుత్వానికి సమర్పించింది.

2016 ఆగస్టులో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్.. ఈ మల్లన్నసాగర్ ప్రాజెక్టును ఆమోదించే టైమ్ లోనే ఓ సలహా ఇచ్చారు. ప్రాజెక్ట్ నిర్మించే సైట్ భూంకపాలు తలెత్తే అవకాశం ఉందా లేదా అన్నది NGRIతో స్టడీ చేయించాలని కోరారు. అప్పుడు తెలంగాణ నీటిపారుదల అధికారులు లెటర్ రాస్తే.. NGRI శాస్త్రవేత్తలు వచ్చి స్టడీ చేశారు. 2017లో వాళ్ళు రిపోర్ట్ సమర్పించారు. కానీ అప్పటికే మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం పనులు కాంట్రాక్టర్లకు ఇచ్చేసింది కేసీఆర్ ప్రభుత్వం.

నిజానికి తెలంగాణ ప్రాంతం భూకంపాల తీవ్రత తక్కువగా ఉండే సిస్మోజన్ 2లోనే ఉంది. కానీ కోయినా, లాతూర్ లో ఎర్త్ క్వేక్స్ తర్వాత.. దక్షిణాదిలోనూ అలాంటి అవకాశాలు ఉన్నట్టు తేలింది. ప్రస్తుతం మల్లన్నసాగర్ ప్రాంతంలో 5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వస్తే.. ప్రాజెక్ట్ కట్టడాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. జనరల్ గా ఇంత తీవ్రతతో భూమి కంపిస్తే.. దాని ప్రభావం 200 కిలోమీటర్ల దాకా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూకంపాలను తట్టుకునే విధంగా మల్లన్నసాగర్ నిర్మాణం చేయలేదని తెలుస్తోంది. పైగా ఈ ప్రాంతంలో భూ గర్భంలో చాలా లోతు వరకూ నిట్ట నిలువునా భూమి చీలి ఉన్నట్టు కదలికలు కనిపిస్తున్నాయని NGRI ప్రాథమిక రిపోర్టులో తెలిపింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో అతి పెద్ద రిజర్వాయర్ అయిన మల్లన్నసాగర్ ని 50 TMCల సామర్థ్యంతో నిర్మించారు. దీనికి 10 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. ఇక్కడ ఊహించని విధంగా భూకంపం సంభవిస్తే మాత్రం.. ఆ డ్యామ్ బద్దలై నీళ్ళు ఉవ్వెత్తున ఎగిసిపడతాయి. చుట్టుపక్కల పంట పొలాలు, ఊళ్ళు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు.. ఆ నీళ్ళు అప్పర్, లోయర్ మానేరు డ్యాములను ముంచెత్తుతాయి. దాంతో గంటల వ్యవధిలోనే కరీంనగర్ పట్టణం గోదావరిలో కలిసే ప్రమాదం ఉందని నీటిపారుదలరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇంత భయంకరమైన ప్రమాదం పొంచి ఉన్నా.. అతి పెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్ ను కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు నిర్మించిందన్న విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు దోచిపెట్టేందుకు NGRI రిపోర్టు చూడకుండానే అనుమతులు ఇచ్చారా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను కాగ్ రిపోర్టే బయటపెట్టడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.