Kunduru Jana Reddy: జానారెడ్డికి షాకిచ్చిన ఈసీ.. ఎమ్మెల్యే నామినేషన్ తిరస్కరణ..
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి ఎలక్షన్ కమిషన్ అధికారులు పెద్ద షాకిచ్చారు. ఆయన ఎన్నికల నామినేషన్ను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా మిగిలారు జానా రెడ్డి.

Kunduru Jana Reddy: తెలంగాణలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి నామినేషన్ను ఈసీ తిరస్కరించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. మొన్నటి వరకూ థర్డ్ ప్లేస్లో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు బీఆర్ఎస్ను ఢీ కొట్టే స్థాయికి చేరింది. ఓ పక్క చేరికలు.. మరోపక్క కొత్త పథకాల హామీలతో.. ప్రజల్లో ఆదరణ సంపాదిస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం అనే ఊపు రావడంతో.. కీలక నేతలంతా కాంగ్రెస్లోనే చేరుతున్నారు.
REVANTH REDDY: పదేళ్లలో కేసీఆర్ ఒక్క హామీని నెరవేర్చలేదు: రేవంత్ రెడ్డి
ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఆరు హామీలు, డిక్లరేషన్లతో ప్రచారం హోరెత్తిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి ఎలక్షన్ కమిషన్ అధికారులు పెద్ద షాకిచ్చారు. ఆయన ఎన్నికల నామినేషన్ను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా మిగిలారు జానా రెడ్డి. రాష్ట్రంలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ చేపట్టారు ఈసీ అధికారులు. ఇందులో భాగంగా చాలా వరకూ నామినేషన్లను తిరస్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 608 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో జానా రెడ్డి నామినేషన్ కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
ఓ పక్క మంచి జోరులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న వేళ సీనియర్ నేత ఎన్నికలకు దూరం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనే విషయం ఆసక్తిగా మారింది.