RS Praveen Kumar: తెలంగాణలో కాంగ్రెస్‌, బీఎస్పీ పొత్తు.. ఆర్ఎస్ ప్రవీణ్‌కు ఎక్కడి టికెట్ ఇస్తారంటే..

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తో పొత్తుకు సిద్దమైన తెలంగాణ కాంగ్రెస్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 9, 2023 | 05:48 PMLast Updated on: Sep 09, 2023 | 5:48 PM

Is Congress Getting Ready For An Alliance With Bsp R S Praveen Kumar In Telangana

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణ రాజకీయం హీటెక్కుతోంది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌.. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. బీఆర్‌ఎస్‌లో సీట్లు ఆశించి భంగపడిన నేతలను కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ఆ పార్టీ నేతలు. బీఎఆర్‌ఎస్‌లో ఉన్న అసంతృప్తి నేతలకు కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉంచింది. ఎవరైనా పార్టీలో చేరవచ్చని, వారికి తగిన గుర్తింపు ఇస్తామని చెబుతోంది. వామపక్షాల పార్టీలో చర్చలు జరిపిన కాంగ్రెస్ అధిష్టానం.. పొత్తు దిశగా అడుగులు వేస్తోంది. అంతటితో ఆగకుంగా తమ బలాన్ని పెంచుకునేందుకు ఇతర పార్టీలతో పొత్తులకు యత్నిస్తోంది. బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకారం తెలిపిందని తెలుస్తోంది.

జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమి ఇండియాలో ఇప్పటికే కాంగ్రెస్, బీఎస్పీ ఉన్నాయ్. దీంతో తెలంగాణలోను ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. ఇప్పటికే వామపక్షాలు, బీఎస్పీ ఓటు శాతంపై రాష్ట్రవ్యాప్తంగా సునీల్ కనుగోలు సర్వే నిర్వహించారు. ఇందులో వామపక్షాలకు 1.5 శాతం ఓటర్లు ఉన్నట్లు గుర్తించారని.. ప్రవీణ్‌ కుమార్ సారధ్యంలోని బీఎస్పీ పార్టీ ఓటు శాతం 1 నుంచి 3 శాతానికి ఓట్లు పెంచుకున్నట్లు తేలింది. ఇప్పటికే ఈ రెండుపార్టీలతో కాంగ్రెస్ స్నేహపూర్వకం, సానుకూలంగానే ఉంటూ వస్తోంది. దీంతో బీఎస్పీ, వామపక్షాలతో పొత్తులకు ఇబ్బంది ఉండదని, సీట్లు సర్దుబాటు చేసుకుంటే మూడు పార్టీల ఓట్లు బదలాయించుకునేలా ముందుకు సాగాలని కాంగ్రెస్ భావిస్తోంది.

ఐతే రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఉన్న పది స్థానాల్లో సీట్లు కేటాయించాలని.. బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కోరగా.. సీపీఐ, సీఎం కూడా తమకు 10స్థానాలు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఐతే ఇప్పటికే కాంగ్రెస్‌లో సీట్ల కోసం ఒత్తిడి అధికంగా ఉంది. దీంతో సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా..సీట్లను సర్దుబాటు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో బీఎస్పీ 10కి రెండు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పినట్లు తెలుస్తోంది. సిర్పూర్ కాగజ్ నగర్‌లో నిర్వహించిన సర్వేలో ప్రవీణ్ కుమార్‌కు అనుకూలంగా ఉండడంతో ఆ స్థానాన్ని ఆయనకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. అదనంగా మరో సీటు ఆదిలాబాద్‌లో ఇచ్చి బీఎస్పీకి నచ్చజెప్పాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మునుగోడు, వైరా, కొత్తగూడెం, బెల్లంపల్లి, హుస్నాబాద్ కేటాయించాలని సీపీఐ కోరగా.. ఇబ్రహీంపట్నం, భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ, పినపాక టికెట్లు కావాలని సీపీఎం కోరుతన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయా పార్టీలకు చెరో రెండు స్థానాలు ఇచ్చి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇవ్వాలని పార్టీ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది.