ప్రభుత్వాల్లో ఎన్నికల వ్యూహకర్తలు.. ఇది మంచిదేనా.. రాజకీయం అర్థం మారుతోందా ?

జనాల్లోకి వెళ్లాలి.. వాళ్ల కష్టాలు వినాలి.. ఆ కష్టంలో భాగం అవ్వాలి.. నేనున్నాను నేను విన్నాను అని హామీ ఇవ్వాలి.. వాళ్ల మనసు గెలుచుకోవాలి. ఇదీ ఒకప్పటి రాజకీయం. రాజకీయ పార్టీలన్నీ ఇలానే చేసేవి గతంలో. కానీ ఇప్పుడు డబ్బు ఆడుతున్న ఆటలో రాజకీయం.. ఆ నోటు కిందే నలిగిపోతోంది. పార్టీలన్నీ ఇవే ఫాలో అవుతున్నాయ్. వ్యూహకర్తల మీదే భారం వేస్తూ.. వాళ్లకే ఎన్నికలు అప్పచెప్తున్నాయ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 2, 2023 | 04:44 PMLast Updated on: Jun 02, 2023 | 4:44 PM

Is It Right For Political Strategists To Interfere In The Governance Of The Government

అధికారంలోకి తీసుకువస్తే.. ప్రభుత్వంలోనూ పక్కన ఓ సీటు అలా ఉంచేసి ఇస్తున్నాయ్. ఈ విధానమే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణం అవుతోంది. ఈ మధ్యే కర్ణాటకలో ఎన్నికలు జరిగాయ్. దేశమంతా చూసింది ఈ ఫలితం కోసం. కాంగ్రెస్ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తర్వాత.. కాంగ్రెస్ విజయం వెనక కీలక పాత్ర పోషించిన వ్యక్తి.. సునీల్ కనుగోలు ! రాజకీయం తెలిసిన వాళ్లకు మాత్రమే తెలిసిన పేరు ఇది. గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ.. మార్పిస్తూ కాంగ్రెస్ పార్టీ విజయ తీరాలకు చేర్చారు సునీల్‌.

ఐతే అదే వ్యక్తిని ఇప్పుడు ప్రభుత్వంలో భాగం చేసింది కాంగ్రెస్‌. సునీల్‌ను కర్ణాటక ప్రభుత్వ సలహాదారుడిగా నియమించింది సిద్ధరామయ్య సర్కార్‌. కేబినెట్‌ హోదా ఇచ్చి మరీ పక్కనే కూర్చోబెట్టుకుంది. ఎన్నికల్లో గెలిపించారని ప్రభుత్వంలో భాగం చేయడం ఏంటి.. చివరికి ప్రభుత్వం ఎలా నడపాలో కూడా సలహాలు ఇస్తారా.. ఈ మాత్రం దానికి రాజకీయ నేతలు ఎందుకు.. రాజకీయం ఎందుకు అనే చర్చ మొదలైంది. నిజానికి ఎన్నికల వ్యూహకర్తకు ప్రభుత్వంలో పెద్ద పీట వేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో బీహార్‌లో నితీష్ సర్కార్‌ కూడా.. ప్రశాంత్ కిషోర్‌కు ఇలాంటి గౌరవమే ఇచ్చింది. ఐతే ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి కూడా అదే కారణం అయింది కూడా !

సిద్ధరామయ్య చూడని వ్యూహాలా.. చూడని రాజకీయమా? ఓ ఎన్నికల వ్యూహకర్తను.. సలహాదారుడిగా నియమించుకోవడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి సంస్కృతి కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ప్రభుత్వంలో స్ట్రాటజిస్టులు తలదూర్చడం మొదలుపెడితే.. రాజకీయం అర్థమే మారిపోతుంది. జనాలకు రాజకీయం దూరం అవుతుంది.. చివరికి నాయకులు కూడా ! బిహార్‌లో జరిగింది ఇదే.

ప్రశాంత్ కిషోర్‌ ప్రతీ దాంట్లో వేలు పెట్టడం చూసి.. నితీష్ కుమార్ దూరంగా పెట్టాడు అతన్ని ! రాజకీయ పార్టీల అధినేతలు.. త‌మ సొంత బ‌లాబ‌లాలను అంచనా వేసుకోవడం కూడా మర్చిపోయారా అనిపిస్తుంది ఇలాంటి పనులు చూస్తుంటే ! రాజకీయం మర్చిపోతున్నారు.. వ్యూహాలు మర్చిపోతున్నారు.. ఇప్పుడు వాళ్లు ప్రభుత్వంలో భాగం అయితే పాలన కూడా మర్చిపోతారు. అందుకే స్ట్రాటజిస్టులు ప్రభుత్వంలో భాగం కావడం మంచిది కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. గ్రౌండ్ లెవల్‌లో జనం ఏం అనుకుంటున్నారు.. ఏం కోరుకుంటున్నారని పార్టీ అధినేతకు తెలియజేయడం.. పరిష్కార మార్గాలు చూపించడమే స్ట్రాటజిస్ట్‌ పని. అంతే తప్ప అన్నీ వాళ్లకే అప్పగించి.. అన్నింట్లో వాళ్లే అనుకుంటే.. ఉనికికే ప్రమాదం వచ్చే చాన్స్ ఉంటుంది. చేప చెట్టు ఎక్కాలనుకోవడం.. ఊడత అండర్‌ వాటర్‌లో ఈదాలనుకోవడం అమాయకత్వం. రాజకీయ నాయకులు, స్ట్రాటజిస్టులు ఇదే తెలుసుకోవాలి.