మ్యూజికల్ ఛైర్ గా వన్డే కెప్టెన్సీ, రోహిత్ వారసుడిగా పాండ్యా ?
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ శకం చివరి దశలో ఉంది... ఫిట్ నెస్ , ఫామ్ దృష్ట్యా ఇక రోహిత్ రిటైర్మెంట్ కు చేరువయ్యాడు. దీంతో హిట్ మ్యాన్ వారసుడిగా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ శకం చివరి దశలో ఉంది… ఫిట్ నెస్ , ఫామ్ దృష్ట్యా ఇక రోహిత్ రిటైర్మెంట్ కు చేరువయ్యాడు. దీంతో హిట్ మ్యాన్ వారసుడిగా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రేసులో పలువురు యువ ఆటగాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సత్తా చాటకుంటే మాత్రం జట్టులో భారీగా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. రోహిత్ వారసుడిగా వైస్ కెప్టెన్ గా ఉన్న గిల్ కే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని అంతా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం హార్దిక్ను వన్డేలకు కెప్టెన్గా నియమిస్తారని తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు మంచిగా రాణిస్తే సారథ్య బాధ్యతలు ఇవ్వొచ్చని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హార్దిక్ పాండ్యను వైస్ కెప్టెన్గా నియమించాలని భావిస్తే.. రోహిత్ శర్మ, అజిత్ అగార్కర్ మాత్రం శుభ్మన్ గిల్ ను ఎంపిక చేశారని సమాచారం.
పైగా హార్దిక్కు అన్యాయం జరిగిందనే భావన.. బీసీసీఐలోని పలువురి సభ్యులకు ఉందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో గంభీర్ కూడా హార్థిక్ వైపే నిలిచినట్టు సమాచారం.అలాగే టీ ట్వంటీల్లో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా… అతని సారథ్యంలో భారత జట్టు మంచి విజయాలే సాధిస్తోంది. కానీ సూర్య కుమార్ యాదవ్ మాత్రం వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. దీంతో టీ ట్వంటీ నాయకత్వ బాధ్యతలను కూడా హార్థిక్ పాండ్యాకు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ప్రదర్శన, ఫలితం పైనే కెప్టెన్సీ ఎవరికీ అప్పగించాలనేది ఆధారపడి ఉంటుంది. పైగా ఫ్యూచర్ ప్లాన్స్ పై క్లారిటీ ఇవ్వాలని ఇప్పటికే బీసీసీఐ రోహిత్ ను కోరినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించొచ్చు. అదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ మంచి ప్రదర్శన చేస్తే వన్డే కెప్టెన్సీని అతనికే అప్పగించే ఛాన్సుంది.
గిల్ ఎలాగూ వైస్ కెప్టెన్ గా కొనసాగుతాడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదని గంభీర్ భావిస్తున్నాడు. 2023 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో పాండ్యా గాయపడటంతో కొన్ని రోజుల పాటు ఆటకు దూరం అయ్యాడు. అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ను టీ20లకు రెగ్యులర్ కెప్టెన్గా, అక్షర్పటేల్ వైస్ కెప్టెన్గా నియమించారు. ఇక గిల్ ను వన్డేలకు వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయడంతో పాండ్యా కెప్టెన్సీ రేసులో లేనట్లే అని అంతా అనుకున్నారు. కానీ హెడ్ కోచ్ గంభీర్ వచ్చిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హార్థిక్ వైపే గంభీర్ మొగ్గుచూపడంతో కెప్టెన్సీ విషయంలో ట్విస్ట్ నెలకొంది. ఏదేమైనా మెగాటోర్నీ తర్వాత వన్డేలకు కొత్త సారథి ఎవరనేది తేలిపోనుంది.