Corona: కరోనా కొత్త వేరియంట్‌ కలకలం.. అంత ప్రమాదమా.. మరో వేవ్ తప్పదా?

కరోనా మరోసారి సరికొత్త వేవ్ తో ప్రాణాలను బలితీసుకోవడానికి వస్తుందా. దీనికి శాస్త్రవేత్తలు ఈజీ 5 పాయింట్‌ 1 ఎరిస్‌ అని పేరు పెట్టారు. బ్రిటన్ లో దీని ప్రభావం భయంకరంగా ఉంది. రోజురోజుకూ చాపకింద నీరులా విస్తరిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 8, 2023 | 04:38 PMLast Updated on: Aug 08, 2023 | 4:38 PM

Ometrons New Variant Easy 5 1 Eris Is Scaring People In Britain

రెండేళ్లు.. దాదాపు రెండేళ్లు.. కరోనాతో సాగించిన పోరాటం అంతా ఇంతా కాదు. ఊపిరి తీసుకోలేని ప్రాణాలు.. ఆగిన బతుకులు.. కరోనా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. కంటికి కనిపించని శత్రువుతో బయటకు కనిపించని యుద్ధం చేసింది ప్రపంచం అంతా ! కరోనా కోరల్లోంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం.. పీడ వదిలింది అనుకున్న ప్రతీసారి కొత్తగా మళ్లీ ప్రమాదాన్ని మోసుకొస్తోంది కరోనా. ఇప్పుడు అదే జరిగింది. కొత్త వేరియంట్ ఒకటి ప్రపంచాన్ని భయపెడుతోంది. కోవిడ్ కొత్త వేరియంట్‌ ఈజీ 5 పాయింట్‌ 1 ఎరిస్‌ అని పేరు పెట్టారు దీనికి ! థర్డ్‌వేవ్‌లో ప్రపంచాన్ని భయపెట్టిన ఒమిక్రాన్‌కి ఇది సబ్‌వేరియంట్. బ్రిటన్‌లో పుట్టి.. ఆ దేశాన్ని తీవ్రంగా వణికిస్తోంది. జూలై 3న ఎరిస్ వేరియంట్ మొదటి కేసును గుర్తించారు. బ్రిటన్‌లో ఇది వేగంగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

గత వారం రోజుల్లోనే 8వేల మంది ఈ వేరియంట్‌ కారణంగా ఆసుపత్రుల్లో చేరారు. బ్రిటన్‌లో నమోదవుతోన్న ప్రతీ ఏడు కేసుల్లో ఒకటి ఎరిస్ వేరియంటే ! ఇది ఆషామాషీ వేరియంట్ కాదు. బ్రిటన్‌ని దెబ్బతీసిన ప్రమాదకర వేరియంట్లలో ఎరిస్ రెండోది. బ్రిటన్‌కి ఇరుగుపొరుగు దేశాల్లో.. ముఖ్యంగా మిడిలీస్ట్ కంట్రీస్‌లో హైఅలర్ట్ మొదలైంది. యూఎస్, జపాన్ దేశాల్లో ఇప్పటికే కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. బ్రిటన్‌లో కేసులు భారీగా పెరగడంతో.. భారత్‌లోనూ ఆ ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడ కూడా కొత్త వేరియంట్ కేసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో జనాల్లో మళ్లీ భయాలు మొదలయ్యాయ్. కరోనా కొత్త వేవ్‌ ముంచుకొచ్చే ప్రమాదం ఉందా అనే ఆందోళన జనాల్లో కనిపిస్తోంది. ఐతే ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేశంలో మెజారిటీ జనాలకు వ్యాక్సినేషన్ జరిగిందని.. ఎరిస్ వేరియంట్ వచ్చినా భయపడాల్సినంత స్థాయిలో ఉండబోదని వైద్య నిపుణులు చెప్తున్నారు.