PM MODI: ఎస్సీ వర్గీకరణకు ప్రధాని నరేంద్ర మోడీ హామీ..

తెలంగాణలో BRS ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేసిందన్నారు ప్రధాని. దళిత నేతను సీఎం చేస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ (KCR) సీఎం కుర్చీలో కూర్చున్నారని ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి.. ఇవ్వలేదన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 11, 2023 | 07:38 PMLast Updated on: Nov 11, 2023 | 7:38 PM

Pm Modi Agreed For Sc Sub Categorisation

PM MODI: ఎస్సీ వర్గకరణ చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ (PM Narendra Modi) హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం జరిగిన మాదిగ విశ్వరూప మహాసభలో ఈ ప్రకటన చేశారు. ఎస్సీల వర్గీకరణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తామనీ.. సుప్రీంకోర్టులో ఉన్న కేసు త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. వర్గీకరణకు చట్టపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. అందుకోసం 30 యేళ్ళుగా పోరాటం చేస్తున్న MPRS అధినేత మందకృష్ణ మాదిగకు అండగా నిలబడతానని మోడీ హామీ ఇచ్చారు.

Manda Krishna Madiga: కంటతడి పెట్టిన మంద కృష్ణ.. సముదాయించిన ప్రధాని మోడీ

తెలంగాణలో BRS ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేసిందన్నారు ప్రధాని. దళిత నేతను సీఎం చేస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ (KCR) సీఎం కుర్చీలో కూర్చున్నారని ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి.. ఇవ్వలేదన్నారు. దళితుల ఆశలపై నీళ్ళు చల్లింది కేసీఆరేనని ప్రధాని మోడీ విమర్శించారు. దళితబంధు (Dalith Bandhu) పథకంతో బాగుపడ్డది బీఆర్ఎస్ నేతలే అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ (BRS & Congress) పార్టీలు మాదిగ (Madiga) విరోధులని ఆరోపించారు మోడీ. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్‌ను రెండుసార్లు ఎన్నికల్లో ఓడించిందని, పార్లమెంట్‌లో ఫోటో కూడా పెట్టలేదన్నారు. ఆయనకు భారతరత్న కూడా ఇవ్వలేదని, తాము వచ్చాకే అంబేద్కర్ (Ambedkar) ఫోటో పెట్టామనీ, భారత రత్న ఇచ్చామన్నారు ప్రధాని.

దళిత బిడ్డ రామ్ నాథ్ కోవింద్, ఆ తరువాత గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును కూడా ఓడించడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందిని మోదీ విమర్శించారు. దళిత నేత బాబూ జగ్జీవన్ రామ్ (Babu Jagjeevan Ram) ను కూడా కాంగ్రెస్ ఎన్నో ఇబ్బందులు పెట్టిందన్నారు ప్రధాని నరేంద్రమోడీ.