Rajanikanth: చంద్రబాబుతో రజనీ ములాఖత్ ?

చంద్రబాబుతో రజనీకాంత్ ములాఖత్ పై వచ్చిన స్పష్టత.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 16, 2023 | 01:56 PMLast Updated on: Sep 16, 2023 | 1:56 PM

Rajinikanths Office Denied The News About Rajinikanths Meeting With Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై రియాక్ట్ అవుతున్నారు. చాలామంది దీన్ని ఖండిస్తున్నారు. అక్రమ అరెస్ట్ అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడో విషయం తెగ వైరల్ అవుతోంది. అదే చంద్రబాబును సూపర్‌స్టార్ రజనీకాంత్‌ కలవబోతున్నారని ! రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్న చంద్రబాబును కలిసేందుకు రజనీ రాబోతున్నారని జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. నిజానికి నందమూరి ఫ్యామిలీకి, చంద్రబాబు కుటుంబానికి రజనీకాంత్‌ చాలా దగ్గర. చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. లోకేశ్‌కు ఫోన్‌ చేసి పరామర్శించారు కూడా ! చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని లోకేశ్‌కు ధైర్యం చెప్పారు.

చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరని.. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనకు రక్ష అని.. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవు. చేసిన మంచి పనులు, ప్రజాసేవే ఆయణ్ని బయటకు తీసుకొస్తాయని అన్నారు. ఐతే చంద్రబాబుని రజనీకాంత్‌ ములాఖత్‌లో కలవనున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయ్. ఐతే చంద్రబాబుతో రజనీ కాంత్ ములాఖత్ పై వచ్చిన వార్తలను రజనీకాంత్ కార్యాలయ వర్గాలు ఖండించాయి. చంద్రబాబుతో రజనీకి ఎలాంటి ములాఖత్‌ లేదని క్లారిటీ ఇచ్చారు. రజనీకాంత్ ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్నారని.. రాజమండ్రి వచ్చే షెడ్యూల్ ఏదీ లేదని తలైవా వ్యక్తిగత సిబ్బంది క్లియర్‌కట్‌గా చెప్పారు.

గతంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజనీ చీఫ్‌ గెస్ట్‌గా కూడా హాజరయ్యారు. చంద్రబాబును అభినందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలతో రేగిన మంట అంతా ఇంతా కాదు. వైసీపీ నేతలు రజనీపై స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. ఇంత జరిగినా.. రజనీ నుంచి కనీసం రియాక్షన్ రాలేదు. కాకపోతే ఆ తర్వాత జైలర్ సినిమా ఫంక్షన్‌లో అర్థమైందా రాజా అంటూ తలైవా కూడా వైసీపీకి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు వచ్చినందుకే ఈ లెవల్‌లో టార్గెట్ చేశారే.. అలాంటిది రాజమండ్రి వచ్చి చంద్రబాబును కలిస్తే.. వైసీపీ నుంచి ఎలాంటి విమర్శలు వినిపిస్తాయో ఏమో అనే చర్చ జోరుగా సాగుతున్న వేళ.. తలైవా నుంచి క్లారిటీ వచ్చింది.