REVANTH REDDY: కేటీఆర్, హరీష్ అవినీతి సొమ్ము కక్కిస్తాం: సీఎం రేవంత్
గడీల పాలనను గ్రామాలకు తీసుకొస్తున్నాం. ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వెళ్తుంది. గ్రామాలు, మున్సిపల్ వార్డులు, పట్టణాల్లో ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభలు నిర్వహిస్తాం.

REVANTH REDDY: ప్రజల రక్తమాంసాలతో కేటీఆర్, హరీష్ రావు లక్ష కోట్లు సంపాదించారని, తిన్న సొమ్మంతా కక్కిస్తామన్నారు సీఎం రేవంత్. బుధవారం సచివాలయంలో జరిగిన ఆరు గ్యారెంటీల లోగో, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు గురించి వివరించారు. కేసీఆర్, బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. ప్రజా ఆమోదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే రెండు గ్యారంటీలను అమలు చేసాం. మిగతా గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజా పాలన కార్యక్రమం తీసుకున్నాం.
ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభల ద్వారా ప్రజా పాలన దరఖాస్తులు తీసుకుంటాం. నిస్సహాయులకు సహాయం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలిస్తాం. మారుమూల పల్లెలకు సంక్షేమ పథకాలు అందుతాయి. సుదూర ప్రాంతాల నుంచి ప్రజాభవన్కు వచ్చి ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు ఇస్తున్నారు. గత పదేళ్లుగా ప్రజల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వాన్నే ప్రజల వద్దకు పంపిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలంటే గడీల నుంచి పాలనను గ్రామాలకు చేర్చాలి. అందుకే మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతీ సంక్షేమ పథకం ప్రజలకు అందేలా చూసేందుకే ఈ కార్యక్రమం. జనాభా ఎక్కువ ఉన్న గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లు పెంచుతున్నాం. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు స్వీకరించే సదుపాయం కల్పిస్తున్నాం. ఎనిమిది రోజుల తరువాత కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు. గడువు తరువాత ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎవరూ ఆందోళన చెందొద్దు. ఈ ప్రభుత్వం ప్రజలది. ప్రజల కోసం పనిచేస్తుంది.
కేటీఆర్కు కౌంటర్
ప్రజావాణిలో న్యాయం జరగలేదని ఓ మహిళకు కేటీఆర్ లక్ష రూపాయలు అందించారని ప్రచారం చేసుకుంటున్నారు. మహిళకు కేటీఆర్తో లక్ష రూపాయలు ఇప్పించడంలో ప్రజావాణి విజయవంతమైంది. దోచుకున్న లక్ష కోట్లల్లో లక్ష రూపాయలే కేటీఆర్ పంచారు. ఖచ్చితంగా మిగతా డబ్బులు ప్రజలకు పంచేలా చేస్తాం. వాళ్లవి ప్రజల రక్తం పిండి సంపాదించిన ఆస్తులు. ఉపయోగపడే భవనాలను కూల్చి కొత్తవి కట్టారు. అది ఆస్తి సృష్టించడం అని చెప్పుకుంటున్నారు. 22 కొత్త ల్యాండ్ క్రూజర్ వాహనాలు కొని విజయవాడలో దాచిపెట్టారు. కోట్ల రూపాయలు వృథా చేశారు. ఐటీఐఆర్ వెనక్కు వెళితే అడగని వినోద్ కుమార్.. సైనిక్ స్కూల్ గురించి అడగకుండా ఉన్న ఆయన.. బుల్లెట్ ట్రైన్ గురించి మాకు నీతులు చెబుతారా?
టీఎస్పీఎస్సీపై
టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం తరువాత నియామకాలు పారదర్శకంగా జరుగుతాయి. గత టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు ఇప్పటికే రాజీనామా చేశారు. వారి రాజీనామాలు గవర్నర్ ఆమోదించిన మరుక్షణమే కొత్త చైర్మన్, సభ్యులను నియమిస్తాం. జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడతాం. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందొద్దు” అని రేవంత్ వ్యాఖ్యానించారు.