SRIDHAR BABU: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. శనివారం నుంచే: మంత్రి శ్రీధర్ బాబు

శనివారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తాం. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల వరకు పెంపు శనివారం నుంచే అమలవుతుంది. విద్యుత్ శాఖ అధికారులతో గురువారం సీఎం సమీక్ష చేస్తారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 7, 2023 | 09:04 PMLast Updated on: Dec 07, 2023 | 9:04 PM

Sridhar Babu Announced About Telangana Cabinet Meeting Details

SRIDHAR BABU: సోనియా గాంధీ పుట్టిన రోజైన శనివారం నుంచి రెండు గ్యారెంటీల అమలు ప్రారంభిస్తామని వెల్లడించారు మంత్రి శ్రీధర్ బాబు. శనివారం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం తొలి క్యాబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు వెల్లడించారు. “మార్పు కోరుకునే వారికి రాబోయే ఐదేళ్లలో మార్పు చూపిస్తాం.

REVANTH REDDY: రేవంత్‌కు చిరు, పవన్ విషెస్.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు..

ఆరు గ్యారెంటీలపై క్యాబినెట్ మీటింగ్‌లో సుదీర్ఘంగా చర్చించాం. హామీల అమలుపై అన్ని అంశాలపై చర్చించాం. శక్రవారం నాడు.. రెండు గ్యారెంటీల అమలుపై ఆయా శాఖలతో సీఎం రేవంత్ చర్చిస్తారు. శనివారం సోనియా పుట్టిన రోజున రెండు గ్యారెంటీల అమలు ప్రారంభిస్తాం. శనివారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తాం. ఆధార్ కార్డు చూపించి మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల వరకు పెంపు శనివారం నుంచే అమలవుతుంది. విద్యుత్ శాఖ అధికారులతో గురువారం సీఎం సమీక్ష చేస్తారు. 2014 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 7 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. రైతులకు 24 గంటల కరెంటుతోపాటు, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌పై చర్చిస్తాం.

శనివారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఆ రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతోపాటు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. మంత్రులు, అధికారులు పంటనష్టంపై క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తారు. 24  గంటలు కరెంట్ ఇవ్వడం మా గ్యారెంటీ. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలపై కూడా చర్చించాం”అని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.