Navya: సర్పంచ్‌ నవ్య అబద్ధం చెప్పిందా.. మాట మార్చిందా?

బీఆర్ఎస్ సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య వ్యవహారం రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాలు మొత్తం ఆసక్తిగా గమనించాయ్ ఈ వ్యవహారాన్ని! ఎట్టకేలకు గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రాజయ్య 20లక్షలు విడుదల చేశారు. ఐతే ఆ తర్వాత కూడా నవ్య శపథాలు చేసింది. తనను వేధించిన ఏ ఒక్కరిని వదిలేది లేదు అని ప్రతిజ్ఞ చేసింది. దీంతో వివాదం ఏ మలుపు తిరగబోతుందని ఆసక్తిగా గమనిస్తున్న వేళ.. ఈ ఎపిసోడ్‌లో సంచలన ట్విస్ట్‌ కనిపించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 5, 2023 | 01:43 PMLast Updated on: Jul 05, 2023 | 1:43 PM

Station Ghanpur Mla Sarpanch Navya Affair Has Come To A Head The Mla Released The Funds She Needed

సర్పంచ్ నవ్య వ్యవహారాన్ని జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. విచారణ చేపట్టి నివేదిక అందించాల్సిందిగా పోలీసు అధికారులను మహిళా కమిషన్ ఆదేశించింది. మహిళా కమిషన్‌కు పోలీసులు సంచలన నివేదిక ఇచ్చారు. ఎమ్మెల్యేలపై ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు లేవని తేల్చేశారు. దీంతో కేసు నమోదు చేయడం కుదరదని నివేదికలో చెప్పేశారు. నిజానికి జూన్‌ 21న ఎమ్మెల్యే రాజయ్యపై.. సర్పంచ్ నవ్య ధర్మసాగర్ పీఎస్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి ఏదైనా ఆధారాలు ఉంటే.. రెండు రోజుల్లో సమర్పించాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఐతే నవ్య నుంచి ఎలాంటి ఆధారాలు అందకపోవడంతో ఈ ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు నిర్ధారించారు.

ఇక అటు మహిళా కమిషన్ దగ్గరకు కూడా నవ్య వెళ్లకపోవడంతో.. ఈ వివాదం ఇక ముగిసినట్లే ప్రచారం జరుగుతోంది. ఈ నివేదికతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. తనకు 20లక్షలు ఇస్తే కాంప్రమైజ్‌ కావాలని ఒత్తిడి తీసుకువచ్చారని.. తన భర్తను కూడా వాళ్ల వైపు తిప్పుకున్నారని.. దీనికి సంబంధించి ప్రతీ ఆధారం తన దగ్గర ఉందని పదేపదే చెప్పిన నవ్య ఇప్పుడు ఎందుకు సైలైంట్ అయింది.. తన దగ్గర ఆడియో రికార్డులను ఎందుకు బయటపెట్టడం లేదు. నిజంగా ఉన్నాయా లేదా.. మీడియాలో హడావుడి కోసమే ఇంత రచ్చ చేసిందా.. నవ్య అబద్దం చెప్పిందా.. మాట మార్చిందా అనే చర్చ జరుగుతోందిప్పుడు ! ఏమైనా నవ్య ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవని పోలీసులు తేల్చేయడంతో.. ఎమ్మెల్యే రాజయ్యకు రిలీఫ్ లభించినట్లు అయింది.