SUPREME COURT: మరణశాశనంలో మార్పులు చేసిన సుప్రీం కోర్ట్..!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 5, 2023 | 07:37 AMLast Updated on: Feb 05, 2023 | 7:37 AM

Supreme Court మరణశాశనంలో మార్పులు చే

వైద్యరంగానికి సంబంధించిన అంశంపై సుప్రీం కోర్టు కీలకతీర్పు వెలువరించింది. సుదీర్ఘ కాలంగా వైద్యసేవలు చేసుకుంటూ, చావలేక బ్రతుకుతున్న వారికి, మృత్యువుకు చేరువవుతున్న వ్యక్తులకు ఎలాంటి కష్టానికి గురిఅవ్వకుండా మరణాన్ని ప్రసాదించడానికి అనుసరించాల్సిన నియమనిబంధనల్లోని సంక్లిష్టతలను సర్వోన్నత న్యాయస్థానం తొలగించింది. జీవన సంకల్పం(LIVING WILL) మార్గదర్శకాలను సరళతరం చేస్తూ 2018లో ఇచ్చిన తీర్పును తాజాగా సవరించింది. వైద్యుల నుంచి వ్యక్తమైన పలు అభ్యంతరాలను జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ ప్రక్రియలో వైద్యులు, ఆసుపత్రులకు ప్రాధాన్యం కల్పించింది. ధర్మాసనంలో జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ ఇతర సభ్యులు. జనవరి 24న వెలువరించిన ఉత్తర్వులోని పూర్తి వివరాలు శనివారం అందుబాటులోకి వచ్చాయి. వైద్య వీలునామాను కార్యరూపంలో పెట్టేదెవరు? ఎలా అమలు చేయాలి? వైద్య మండలి అనుమతివ్వకపోతే అప్పుడేం చేయాలి… తదితర అంశాల్లో స్పష్టతనిస్తూ అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలను జారీ చేసింది.

గత 2018 తీర్పులో రోగులకు అనాయాస మరణాన్ని ప్రసాదించే విషయంలో వారు రాసుకునే వైద్య వీలునామాను ప్రామాణికంగా గుర్తించాలని సుప్రీంకోర్టు 2018 తీర్పులో పేర్కొంది. దాని ప్రకారమే వైద్యం ఆసుపత్రుల్లో కొనసాగించాలో వద్దో నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొంది. గౌరవప్రదంగా మరణించే హక్కును గుర్తించింది. వైద్య వీలునామా ఎలా ఉండాలో ఆ తీర్పులో పేర్కొంది. జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ సమక్షంలో వైద్య వీలునామాపై సదరు వ్యక్తి సంతకం చేయాలి. ఆ పత్రంపై ఇద్దరు సాక్షులతో పాటు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ సంతకం చేయాలి. ఈ వీలునామా ఆ వ్యక్తి ఇష్టప్రకారం, స్వచ్ఛందంగా రాయించినదేనని పేర్కొనాలి. ఆ తర్వాత వైద్య వీలునామాను నమోదు చేయించాలి.

గత నెల 24న ఇచ్చిన ఆదేశాల్లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ నిబంధనను సవరించింది.. జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌కి బదులుగా గెజిటెడ్‌,నోడల్‌ అధికారి సాక్షి సంతకం చేయాలని పేర్కొంది. రోగి నిర్ణయాలు తీసుకోలేని స్థితికి చేరుకున్నప్పుడు…అతని తరఫున సుఖవంతమైన మరణానికి సమ్మతి తెలిపేందుకు లేదా నిరాకరించేందుకు సంరక్షకులు, సమీప బంధువుల పేర్లను వీలునామాలో పొందుపరచాలని తెలిపింది. వైద్య వీలునామా రాసుకుని ఉన్నట్లయితే దానిని కుటుంబ వైద్యుడికి అందజేయాలి లేదా ఆ విషయాన్ని తెలియజేయాలి.

ఈ మరణం కోసం ఓ మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేసింది. రోగి నిర్ణయం తీసుకోలేని స్థితిలోకి వెళ్లిపోయినప్పుడు వైద్య వీలునామా అమలుకు సంబంధించిన విషయాలపై వైద్యుడు చొరవతో సంబంధిత ఆసుపత్రి…తొలుత ప్రాథమిక మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాలి. ఇందులో స్పెషలిస్ట్‌ వైద్యుల సంఖ్య గతంలో మూడుగా ఉండేది. ఇప్పుడు దానిని రెండుకు తగ్గించారు. ప్రాథమిక మెడికల్‌ బోర్డు సిఫార్సులను రెండో మెడికల్‌ బోర్డు పరిశీలించి 48 గంటల వ్యవధిలోగా నిర్ణయాన్ని తెలియజేయాలి. ఒకవేళ రెండో మెడికల్‌ బోర్డు అనాయాస మరణానికి అంగీకరించకుంటే రోగి సంరక్షకులు నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టు ఇంకో మెడికల్‌ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవచ్చు అని ఈ సవరణల్లో పొందుపరిచింది. ఒక వేళ తొలి మెడికల్‌ బోర్డు …వైద్య వీలునామాపై ముందుకు వెళ్లడానికి నిరాకరిస్తే రోగి బంధువులు ఈ కేసును రెండో మెడికల్‌ బోర్డుకి సిఫార్సు చేయాలని ఆసుపత్రిని కోరవచ్చు. రెండు మెడికల్‌ బోర్డులు కూడా ప్రాణాధార వ్యవస్థ తొలగింపునకు అంగీకరించకపోతే ఆసుపత్రి సిబ్బంది కానీ, రోగి బంధువులు కానీ హైకోర్టును ఆశ్రయించవచ్చు.

అసలు వైద్య వీలునామా అంటే ఏమిటి అనే సందేహం ఇప్పటికే మీలో కలిగి ఉండవచ్చు. మృత్యువు సమీపిస్తోందని వైద్యులు నిర్ధారించిన వ్యక్తులు…తమకు చికిత్సను లేదా ప్రాణాధార వ్యవస్థలను ఏ దశలో నిలిపి వేయాలో వివరిస్తూ ముందుగా రాసుకునే జీవన సంకల్పమే వైద్య వీలునామా (ADVANCE DIRECTIVE). అనాయాస మరణంపై నిర్ణయాలు తీసుకోలేని స్థితికి చేరుకుంటే తన తరఫున అందుకు ఎవరిని సంప్రదించాలో తెలియజేసే పత్రం అది. దీనివల్ల వృద్దులు తమకు ఆరోగ్యం సహకరించకుంటే వైద్యానికి ధనాన్ని వృధా చేసుకోకుండా ఉండేందుకు, రోగికి వ్యాధి తీవ్రరూపందాల్చినప్పుడు దానినుంచి వేదనకు గురి అవ్వకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది.