Team India: మత్తు వదలరా

ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే కొన్ని మెళుకువలు పాటించాల్సి ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 16, 2023 | 03:10 PMLast Updated on: Sep 16, 2023 | 3:10 PM

Team India Needs Some Tricks To Win Against Sri Lanka In The Asia Cup

రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఆసియా కప్ 2023లో తొలి ఓటమిని చవిచూసింది. ఆసియా కప్ సూపర్ 4 ఆఖరి మ్యాచులో బంగ్లాదేశ్ 6 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. అయితే, సూపర్-4 రౌండ్‌లోని చివరి మ్యాచ్ ఫలితం టీమిండియాపై పెద్దగా ప్రభావం చూపించదు. ఎందుకంటే భారత్, శ్రీలంక జట్లు ఇప్పటికే ఫైనల్స్‌కు చేరుకున్నాయి. సూపర్-4 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. అనంతరం శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీ చేసినప్పటికీ 259 పరుగులకే ఆలౌటైంది టీమిండియా. సెప్టెంబర్ 17న ఫైనల్ జరగనుంది. దీనికి ముందు భారత జట్టు 5 లోపాలను అధిగమించాల్సి ఉంటుంది.

ఒకప్పుడు.. భారత జట్టు స్పిన్ బౌలర్లను ఆడటంలో ఫేమస్. కానీ ఆసియా కప్‌లో గత 2 మ్యాచ్‌లలో అలాంటిదేమీ కనిపించలేదు. భారత్‌ మీద మొత్తం 10 వికెట్లను శ్రీలంక స్పిన్నర్లు తీశారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. బంగ్లాదేశ్ స్పిన్నర్లు కూడా భారత బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టి 4 వికెట్లు పడగొట్టారు. అంటే భారత్‌ చివరి 20 వికెట్లలో 14 వికెట్లు స్పిన్నర్లకే దక్కాయి. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లకు ఇబ్బందికరంగా మారుతున్నారు. భారత్‌పై శ్రీలంక కేవలం 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. దీని తర్వాత ధనంజయ్ డి సిల్వా, దునిత్ వెల్లల్లాగే 7వ వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బంగ్లాదేశ్ కూడా 193 పరుగుల వద్ద 7 వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత కూడా ఆ జట్టు 265 పరుగులకు ఆలౌటైంది. కాబట్టి.. డెత్ ఓవర్ల బౌలింగ్ పై ఫోకస్ చేయాల్సి ఉంది. ఒకానొక సమయంలో శ్రీలంకపై టీమిండియా స్కోరు 3 వికెట్లకు 154 పరుగులు. ఆ తర్వాత మన జట్టు 59 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్‌పై కూడా 5 వికెట్లకు 170 పరుగులు చేసిన తర్వాత మన జట్టు 259 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ఆరో బౌలర్ గత 2 మ్యాచ్‌ల్లో ప్రత్యేకంగా రాణించలేకపోయాడు. శ్రీలంకపై అక్షర్ పటేల్ 5 ఓవర్లలో 29 పరుగులు ఇవ్వగా, బంగ్లాదేశ్‌పై తిలక్ వర్మ 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చాడు. మరోవైపు బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు స్పిన్నర్లు కనీసం అద్భుతంగా రాణించారు.వన్డే ఆసియా కప్ లో ఇది భారత్-శ్రీలంక మధ్య 8వ ఫైనల్. ఇంతకు ముందు జరిగిన 7 ఫైనల్స్‌లో టీమ్ ఇండియా 4 గెలిచింది. శ్రీలంక 3 గెలిచింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఫైనల్ జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక స్పిన్నర్లు సమర్ధవంతంగా ఎదుర్కొంటేనే టీమిండియా విజేతగా నిలుస్తుంది.