హనుమంతుడి లేని రామాలయం, ఒంటిమిట్ట రామాలయం చరిత్ర ఇదే
ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజున తెలంగాణలోని భద్రాచలంతో సహా అన్ని రామాలయాల్లో మధ్యాహ్నం పూట, అభిజిత్ ముహూర్తంలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తుంటారు.

ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజున తెలంగాణలోని భద్రాచలంతో సహా అన్ని రామాలయాల్లో మధ్యాహ్నం పూట, అభిజిత్ ముహూర్తంలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో మాత్రం శ్రీరామ నవమి పర్వదినాన కాకుండా తిథుల ప్రకారం నాలుగైదు రోజులు ఆలస్యంగా చతుర్దశి పౌర్ణమి రోజున కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అది కూడా సంధ్యకాలంలో, వెన్నెల వెలుగుల్లో కల్యాణం నిర్వహిస్తారు. చతుర్దశి రాత్రి పున్నమి ఘడియలు సమీపిస్తున్న సమయంలో, వెన్నెల రాత్రిలో సీతారామ కల్యాణం జరగడానికి వెనుక రెండు పురాణగాథలు ఉన్నాయి. శ్రీరాముడు మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినప్పుడు ముక్కోటి దేవతలు హాజరయ్యారట.
సూర్యాస్తమయం తర్వాతే చంద్రుడు రావాలి. కానీ, సూర్యుడు అస్తమించకుండా ఉండిపోవడంతో చంద్రుడు శ్రీరాముడిని చూడ్డానికి రాలేకపోయాడు. రాలేకపోయానని చంద్రుడు ముభావంగా ఉండడం గమనించిన శ్రీరాముడు, నేను రామచంద్రుడు అని నీ పేరే పెట్టుకుంటానని సముదాయిస్తాడు. అప్పటికీ చంద్రుడిలో మార్పు రాకపోవడంతో ద్వాపరయుగంలో రాత్రి 12 గంటలకు కృష్ణావతారంలో జన్మిస్తానని చెప్తాడు. అలా చెప్పినా చంద్రుడు బాధపడుతూనే ఉంటాడట. నీ కోసం ఒంటిమిట్టలో వెన్నెల రాత్రిలో నా కల్యాణం జరిపించుకుంటానని చెప్పిన తర్వాత చంద్రుడు సంతోషించాడని ఒక కథ ఉంది. ఇక రెండో కథ ప్రకారం, ”పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు చంద్రుడు, లక్ష్మీదేవి జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. కలిసి జన్మించారు కాబట్టే చంద్రుడిని చందమామ అంటాం. మరోవిధంగా చూస్తే రాముల వారిది సూర్యవంశం, సీతాదేవిది చంద్రవంశం. భారతీయ సంస్కృతిలో కన్యాదానం చేసే వధువు తరఫు వారికి అనుకూల సమయం వెన్నెల రాత్రి కాబట్టి, సీతారామ కల్యాణం కూడా వెన్నెల రాత్రి చేస్తారు అనేది పురాణం.
ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత.. ఇక్కడ హనుమంతుడు లేకపోవడం. ఒంటిమిట్ట ఆలయంలోని మూల విగ్రహంలో ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుల విగ్రహాలు చెక్కారు. ప్రతి రామాలయంలో సీతారామలక్ష్మణుల పక్కన హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది. కానీ, ఈ ఆలయంలో హనుమంతుని విగ్రహం ఉండదు. దీని వెనుక కూడా ఒక పురాణగాథ ఉందట. పూర్వకాలంలో మునులు యాగం చేస్తున్నప్పుడు రాక్షసుల బాధ ఎక్కువై రాముడిని ప్రార్థిస్తే, ఆ సమయంలో రాముడు కోదండము, పిడిబాకు పట్టుకొని ఆ యాగాన్ని రక్షించాడని, అదే సమయంలో ఇక్కడ వెలిశారని కథ ప్రచారంలో ఉంది. అప్పటికి రాములవారికి ఆంజనేయస్వామి పరిచయం కాలేదు కాబట్టి ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం ఉండదని చెబుతారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఒకే రాయిపైన సీతారామ లక్ష్మణులు ఉంటారు. ఒంటిమిట్ట రాజగోపురం నిర్మాణం చోళ శిల్ప శైలిలో ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని సందర్శించినప్పుడు భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటని చెప్పారని చరిత్రకారులు చెబుతారు. ఒంటిమిట్ట దేవాలయం ఆర్కిటెక్చర్ పరంగానూ చాలా విశిష్టమైన దేవాలయం. చోళులు, విజయనగరం సామ్రాజ్యం వాళ్లు కట్టారు.
మొదలుపెట్టిన వాళ్లు చోళులు. పూర్తి చేసింది విజయనగర సామ్రాజ్యం వారు. రెండు శైలులూ కనిపిస్తాయి. రంగ మండపంలో 32 స్తంభాలు ఉంటాయి. మండపం ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా ఉంటుంది. పైన రూఫ్ ఉన్నా గాలి వస్తుంటుంది. ఇక్కడ స్తంభాలు పోలో స్టైల్లో ఉంటాయి. పైన స్ట్రక్చర్ ఉంటుంది, అంటే విగ్రహాలు మలిచి ఉంటాయి. విశాల ఆవరణ ఉండే ఒంటిమిట్ట కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలు ఉన్నాయి. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు ఉంటుంది. చోళ, విజయనగర వాస్తుశైలి కనిపించే ఆలయ స్తంభాలపై రామాయణ, భాగవత కథలు కూడా కనిపిస్తాయి. ఆలయానికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం. పక్కనే రథశాల, రథం ఉంటాయి. ఒంటిమిట్ట శ్రీరాముడి దర్శనానికి వచ్చే భక్తులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ను 1640వ సంవత్సరంలో కడపను పాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధిగా చెబుతారు. స్వామి భక్తుడిగా మారిన ఇమాంబేగ్ తాగునీటి అవసరాలకోసం బావిని తవ్వించారని చెబుతారు. దీని వెనక కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. ఇమాంబేగ్ ఈ ఆలయానికి వచ్చిన సమయంలో, మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా ? అని భక్తులను ప్రశ్నించాడని, చిత్తశుద్ధితో పిలిస్తే కచ్చితంగా పలుకుతాడని సమాధానం చెప్పడంతో ఆయన మూడుసార్లు రాముడిని పిలిచారని చెబుతారు. బదులుగా ఆయనకు మూడు సార్లు ఓ అని సమాధానం రావడంతో ఆయన ఆశ్చర్యపోయారట. అందువల్ల ఆయనపేరు మీదే ఆ బావిని ఇమాంబేగ్ బావి అంటారని ఇక్కడి వాళ్లు చెప్తున్నారు. అందుకే, ఒంటిమిట్ట ఆలయంలో కోదండరాముడిని ముస్లింలు కూడా దర్శించుకుంటారు.