CM Revanth Reddy : రేవంత్ మొదటి సంతకం దేనిపై అంటే !

తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఒంటి గంటా 4 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గవర్నర్ తమిళిసై ఆయన చేత ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్ కృతజ్ఞతా సభ కూడా అదే స్టేడియంలో జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇదే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తొలి సంతకం చేయబోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 6, 2023 | 03:18 PMLast Updated on: Dec 06, 2023 | 3:18 PM

What Is The First Signature Of Telangana State Cm Revanth Reddy

తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఒంటి గంటా 4 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గవర్నర్ తమిళిసై ఆయన చేత ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్ కృతజ్ఞతా సభ కూడా అదే స్టేడియంలో జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇదే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తొలి సంతకం చేయబోతున్నారు. ఏ ఫైల్ పై ఆయన మొదటి సంతకం ఉండబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీలపై హామీ ఇచ్చింది. ఈ ఆరు గ్యారంటీలను చట్టబద్ధం చేస్తామని కూడా చాలా బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ చెప్పారు. అందుకే ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి.. మొదటి ఫైలు ఆరు గ్యారంటీలపైనే సంతకం చేస్తారని తెలుస్తోంది.

CM Revanth Reddy : రేవంత్‌ ప్రమాణస్వీకారానికి చంద్రబాబు! కేసీఆర్‌కు కూడా ఆహ్వానం.. వస్తారా ?

రాష్ట్రంలోని మహిళలు, రైతులు, విద్యార్థులు, ఇళ్లు లేని పేద కుటుంబాలు, నిస్సహాయులకు భరోసా కల్పించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. చాలా వర్గాలు ఈ హామీలను చూసే కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపించారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఆరు హామీల అమలును మొదటి ప్రాధాన్యతగా తీసుకోబోతోంది. మహిళలకు నెలకు 2 వేల 500 రూపాయల చొప్పున ఇచ్చే మహాలక్ష్మి పథకం, 500 వందలకే గ్యాస్ సిలెండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మొదటి గ్యారంటీ. రెండోది రైతు భరోసా.. ప్రతియేటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున.. అలాగే వ్యవసాయ కూలీలకు 12 వేలు, వరి పంటకు బోనస్ గా 500 రూపాయల ఇస్తామని ప్రకటించారు. ఇక మూడో గ్యారంటీ.. గృహ జ్యోతి పథకం.. ఈ స్కీమ్ కింద ప్రతి కుటుంబానికీ 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. నాలుగో గ్యారంటీ.. యువ వికాసం… విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు.. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నది. ఐదో గ్యారంటీ .. చేయూత స్కీమ్. ఇందులో వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, అనాథలు మొదలైన వర్గాల వారికి ఇస్తున్న నెలవారీ ఫించన్లను 4వేలకు పెంచుతామనీ.. 10 లక్షల దాకా రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కల్పిస్తామని ప్రకటించింది కాంగ్రెస్.

కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి ఏటా కనీసం 88 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో వీటిని అమల్లోకి తెస్తే రాబోయే రోజుల్లో లక్ష కోట్ల దాకా అవసరమవుతాయి. మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలతో పాటు 66 హామీలను కూడా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చింది. వీటి అమలుకు మరిన్ని వేల కోట్ల నిధులు కావాలి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ఎన్నికల హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. గతంలో 2004లో కూడా వైఎస్సార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్ పై.. ఇదే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార వేదిక పైనే తొలి సంతకం చేసారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే తరహాలో సంతకం చేయబోతున్నారు. ఆ తరువాత 9న మంత్రివర్గ సమావేశం ఉండే ఛాన్సుంది. ఈ పథకాలను ఎలా అమలు చేయాలన్నది ఆ రోజు నిర్ణయిస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే 5 లక్షల కోట్ల అప్పు చేసింది. ఉద్యోగులకు ఫస్ట్ తారీఖున జీతాలు ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చింది. మరి కొత్త సర్కార్ కి పాత అప్పులు.. కొత్త స్కీముల అమలుకు పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి. ఇవన్నీ సీఎంగా రేవంత్ కి పెద్ద సవాల్ గా మారనున్నాయి.