Chandrababu: చంద్రబాబు కేసులో ఈడీ రంగప్రవేశం చేయబోతుందా.. రాజకీయ, న్యాయ నిపుణులు ఏమంటున్నారు..?

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు మెడకు ఉచ్చు మరింతగా బిగించుకోనుందా.. అంటే అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. న్యాయ శాఖ నిపుణులు, రాజకీయ పండితులు, పలువురు రిటైర్డ్ జడ్జిలు, న్యాయవాదులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 18, 2023 | 01:30 PMLast Updated on: Sep 18, 2023 | 1:30 PM

What Will Happen In Chandrababu Skill Scam

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో దాదాపు రూ. 371 కోట్ల రూపాయలు షెల్ కంపెనీలకు పంపించి హవాలా ద్వారా మనీ లాండరింగ్ కి పాల్పడినట్లు చెబుతున్నారు సీబీఐ అధికారులు. ఈ కేసు విచారణ నిమిత్తం చంద్రబాబుకు జుడీషియల్ కస్టడీకి పంపించింది ఏసీబీ కోర్టు. ఈ నేపథ్యంలో హైకోర్టులో బెయిల్ పిటీషన్ సహా క్వాష్ పిటీషన్ పై విచారణ సెప్టెంబర్ 19కి వాయిదా పడిన తరుణంలో ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

న్యాయ నిపుణులు..

ఈ కేసులో సెక్షన్ 309 ఉన్నందున బెయిల్ అంత త్వరగా వచ్చే అవకాశం లేదంటున్నారు. కింది స్థాయి స్పెషల్ కోర్టులు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంటాయంటున్నారు న్యాయ నిపుణులు. అయితే చంద్రబాబు తరఫు న్యాయవాదులు క్వాష్ పిటీషన్ వేయడం పై కూడా పలు అనుమానాలు వస్తున్నాయి. కేసులు ఎదుర్కోలేక ఎలాంటి ఆధారాలు లేవని కేసును కొట్టేయమంటూ హైకోర్టులో వేసిన పిటీషన్ చెల్లదంటున్నారు. దీనిపై సీఐడీకి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. ఈలోపు చంద్రబాబు రిమాండ్ గడువు ముగుస్తుంది కావున మరి కొన్ని రోజులు రిమాండ్ పొడిగించాల్సిందిగా పిటీషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. ఇలా గనుక జరిగితే మరి కొన్ని రోజులు జైల్లో ఉండక తప్పదు.

న్యాయవాదులు..

ఈ కేసుపై హైకోర్టులో బెయిల్ పిటీషన్ వేసినప్పటికీ న్యాయమూర్తికి సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. దీనికి కౌంటర్ గా సీఐడీ తరఫు న్యాయవాదులు వారు సేకరించిన సాక్ష్యాలు, ఆధారాలు జడ్జి ముందు ప్రవేశ పెడతారు. ఇరువురి వాదనలలో ఎవరి వైపు సరైన ఆధారాలు ఉన్నట్లు జడ్జి భావిస్తే వారికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాగే చంద్రబాబు తరఫు న్యాయవాదులు బెయిల్ పిటీషన్ వేయడానికి ప్రదాన కారణం కూడా ఈ కేసు నుంచి బయటకు రావాలనే ఉద్దేశ్యమే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో హై కోర్టు ఏం చెబుతుందో వేచి చూడాలి. ఒక వేళ ఏసీబీ కోర్టులో బెయిల్ రద్దై రిమాండ్ తో పాటూ సీఐడీ విచారణకు అదేశిస్తే దాని అనుసారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంటుంది. ఒకవేళ హై కోర్టు నిందితుడి ప్రమేయం లేదని భావిస్తే సీఐడీ కస్టడీ అయిపోయిన తరువాత బెయిల్ పిటీషన్ వేసుకోవాలని సూచిస్తుందంటున్నారు.

రాజకీయ నిపుణులు..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో షెల్ కంపెనీల ద్వారా డబ్బులు బదిలీ అయినట్లు ఐటీ గుర్తించింది. అక్కడి నుంచి గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి నోటీసులు ఇస్తే వాటిని పట్టించుకోలేదు. తాజాగా మరోసారి స్పందించిన ఇన్ కం ట్యాక్స్ అధికారులు దీనిపై వివరణ కోరారు. ఆ లీడ్ పట్టుకొని సీఐడీ విచారణ చేపట్టింది. ఇందులో చాలా మంది వాగ్మూలాన్ని రికార్డు చేసుకున్నారు. మరి కొందరు అరెస్ట అయి బెయిల్ పై బయట ఉన్నారు. వీరందరికీ కీలకంగా ఉన్నారు చంద్రబాబు అని భావించి అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు రాజకీయ నిపుణులు. ఇందులో ఎంతమందికి స్కిల్ ఇచ్చామో ఇప్పటికీ వాటి వివరాలను చూపించడంలో విఫలమయ్యారు చంద్రబాబు లాయర్లు. పైగా ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించారో ఆ సమాచారాన్ని అందించడంలో జాప్యం ప్రదర్శిస్తున్నారు అంటున్నారు. ఇలాగే జరిగితే ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని భావిస్తున్నారు.

ఈడీ కస్టడీ తప్పదా..

ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో ఈ కేసును ఈడీ స్వీకరించే అవకాశాలు ఉన్నయంటున్నారు పరిశీలకులు. ఈడీ రంగంలోకి దిగితే ఈ కేసు మరింత వేగం పుంజుకోనుంది. ఇందులో నేరం జరిగినట్లు రుజువైతే కచ్చితంగా శిక్షపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ దర్యాప్తు సంస్థలు చేసిన విచారణను ఆధారంగా మరింత లోతుగా అధ్యయనం చేసే వీలుంటుంది. పైగా కోర్టులో రేపు బెయిల్ పిటీషన్, క్వాష్ పిటీషన్ పై వాదనలు జరగనున్న నేపథ్యంలో ఈడీ కస్టడీ కోరుతూ పిటీషన్ వేస్తే చంద్రబాబు మెడకు ఉచ్చు బలంగా బిగించుకున్నట్లే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రేపే లేకున్నా ఈ వారంలో ఈడీ చంద్రబాబును కస్టడీకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

T.V.SRIKAR