Telugudesam Party: నారా కుటుంబమా.. నందమూరి కుటుంబమా.. టీడీపీని నడపబోయేది ఎవరు..?

రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన పార్టీ.. జాతీయస్థాయిలో తనదైన ముద్ర వేయించుకున్న పార్టీ, రాష్ట్రపతులు ప్రధానులను సింగిల్‌ హ్యాండ్‌తో.. కంటి సైగతో నియమించిన పార్టీ.. టీడీపీని నెక్స్ట్ ముందుకు తీసుకెళ్లేది ఎవరు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 16, 2023 | 05:24 PMLast Updated on: Sep 16, 2023 | 5:24 PM

Who Is Going To Run The Telugu Desam Party It Has Become A Heated Debate In Ap Politics

చంద్రబాబు తర్వాత ఎవరు..? లోకేష్‌ కూడా జైలుకెళ్తే పరిస్థితేంటీ..? అవును.. ఇప్పుడిదే చర్చ. అందుకే టీడీపీ నాయకత్వంపై రాజకీయ వర్గాల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. టీడీపీ ఊహిస్తున్నట్టు.. వైసీపీ నేతలు చెబుతున్నట్టే జరిగితే.. టీడీపీని ఎవరు లీడ్‌ చేస్తారు..? నారా కుటుంబమా..? నందమూరి కుటుంబమా..? లేక పార్టీ సీనియర్లా..? టీడీపీలో ఇలాంటి రోజు అంటూ ఒకటి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన పార్టీ.. జాతీయస్థాయిలో తనదైన ముద్ర వేయించుకున్న పార్టీ, రాష్ట్రపతులు ప్రధానులను సింగిల్‌ హ్యాండ్‌తో.. కంటి సైగతో నియమించిన పార్టీ.. టీడీపీ.

ఇలాంటి ఎంతో చరిత్ర కలిగిన పార్టీ.. ఇప్పుడు తన సొంత గడ్డ మీదే క్లిష్ట సమయంలో ఉంది. ఎన్నో అటుపోట్లను ఎదుర్కొన్న టీడీపీ.. ఇప్పుడు కోర్టు మెట్లు.. జైలు గేట్లు ముందు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని టీడీపీ ఎలా ఫేస్‌ చేయబోతోందోననేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. కేసుల పరంగా చూస్తే.. ప్రస్తుతమున్న స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసే కాదు.. మరిన్ని కేసులు చంద్రబాబు, లోకేష్‌, టీడీపీ నేతల మెడకు చుట్టుకోనున్నాయి. ఫైబర్‌ నెట్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌, అంగళ్లు ఘటన, రామతీర్ధం గొడవ వంటి అంశాలపై కేసులు తెరపైకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. మరోవైపు ఇవే కాకుండా ఇంకెన్ని కేసులు వస్తాయోననే ఆందోళన కూడా కనబడుతోంది టీడీపీ వర్గాల్లో. ఐతే ఈ కేసులను ఎలా ఎదుర్కొవాలి..? వాటిని ఏ విధంగా న్యాయస్థానాల్లో వాదప్రతివాదనలు జరపాలి..? అనే అంశానికి సంబంధించి ఇప్పటికే టీడీపీ సీనియర్ల పర్యవేక్షణలో లీగల్‌ టీమ్‌ పనిచేస్తోంది. అయితే ఇదంతా ఓ ఎత్తు. ఇది అత్యవసరంగా చేయాల్సిన పనే.. నాయకుడిని జైలు నుంచి విడిపించడంతో పాటు.. ఆయన ఇమేజీకి ఏ మాత్రం మచ్చ పడకుండా తీసుకురావాలనే దిశగా టీడీపీ లీగల్‌ టీం పని చేస్తోంది.

ఇదే సందర్భంలో పార్టీ కేడర్‌ను గేరప్‌ చేయడం.. వారిలో ఓ నమ్మకం కల్పించడం ఎలా..? దీనికి ఎవరు లీడ్ తీసుకుంటారు..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికైతే.. లోకేష్‌ లీడ్‌ తీసుకుంటున్నారు. పార్టీ నేతలతో టచ్‌లో ఉంటున్నారు.. ఎప్పటికప్పుడు టెలి కాన్ఫరెన్సులు పెడుతూ సలహాలు.. సంప్రదింపులతో పార్టీని రన్‌ చేస్తున్నారు. పార్టీపరంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం.. జిల్లా స్థాయి మొదలుకుని.. నియోజకవర్గ, మండల స్థాయి కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడం వంటివి చేస్తున్నారు. అయితే లోకేష్‌ కూడా జైలుకెళ్లాక పరిస్థితేంటనేది తాజా చర్చ. నారా కుటుంబానికి చెందిన బాలయ్య.. ఎన్టీఆర్‌ వారసుడిగానే కాకుండా చంద్రబాబుకు బావ మరిదిగా.. లోకేష్‌కు మామగా కూడా పార్టీలో ఆయనకు గౌరవం ఉంది. పార్టీలో చాలామంది సీనియర్లు మొదలుకుని.. కొన్ని కొన్ని ప్రాంతాల్లో మండల స్థాయి నేతలతో కూడా బాలయ్యకు పరిచయాలు ఉన్నాయ్. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు జైలుకెళ్లిన తర్వాత బాలయ్య పార్టీ బాధ్యతను.. లీడ్‌ తీసుకోవడానికి ముందుకు వచ్చినట్టే కనిపిస్తోంది.

గతంలో ఎప్పుడో కానీ పార్టీ కార్యక్రమాలకు హాజరుకాని బాలయ్య.. పరిస్థితిని అర్థం చేసుకుని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వరుసగా రెండు రోజుల పాటు పార్టీ వ్యవహరాల్లో సీనియర్లతో భేటీ నిర్వహించారు. చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. తన వంతుగా కొన్ని సూచనలు చేయడంతో పాటు.. చంద్రబాబు అరెస్ట్‌ వల్ల కొందరు పార్టీ కార్యకర్తలు.. అభిమానులు చనిపోయారు. ఇప్పటి వరకు 25 మంది చనిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలను ఓదార్చేందుకు తాను వెళ్తానని బాలయ్య ప్రకటించారు. ధైర్యంగా ఉండండి.. నేనున్నా.. నేను ముందుండి నడిపిస్తానంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు పార్టీ వర్గాల్లోనూ.. అలాగే రాజకీయ వర్గాల్లోనూ విపరీతంగా చర్చకు దారి తీసింది. పార్టీ పగ్గాలు ఇప్పటికిప్పుడే వెంటనే చేజిక్కించుకోవాలి.. పెత్తనం చేయాలనే దిశగా బాలయ్య ఆలోచన కాకున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు తన అవసరం ఉంది కాబట్టి లీడ్‌ తీసుకోవాలని బాలయ్య భావిస్తున్నప్పటికీ.. చర్చ మాత్రం వేరే విధంగా జరుగుతోంది.

బాలయ్య ఇకపై లీడ్‌ రోల్‌లోకి వస్తారా.. అనే చర్చ జరుగుతోంది. అయితే బాలయ్య పార్టీని లీడ్‌ చేయగలరా.. ఓవైపు సినిమాల్లో బాలయ్య ఇప్పటికే బిజీగా ఉన్నారు.. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ పరంగా ఏదైనా కార్యక్రమం ఇస్తే దాన్ని టేకప్‌ చేసి పర్యటనలు వంటివి బాలయ్య చేయగలరు కానీ.. చంద్రబాబు తరహాలో పార్టీని రన్‌ చేయడం సాధ్యం కాదనే అంటున్నారు. ఈ క్రమంలో మరో చర్చా జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు చంద్రబాబు ఉన్నారు కాబట్టి.. బాలయ్య రాజకీయ వ్యవహరాలు, పార్టీ వ్యవహరాలపై పెద్దగా ఫోకస్‌ పెట్టలేదని.. కానీ తప్పదని అనుకుంటే.. ఆయన ఫోకస్‌ అంతా పార్టీ పెట్టగలరని అంటున్నారు. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో గతంలో నానా గొడవలు ఉండేవని.. కానీ ఎప్పుడైతే బాలయ్య ఆ క్యాన్సర్‌ ఆస్పత్రి పార్టీ వ్యవహరాలపై పూర్తి గ్రిప్‌ దక్కించుకుని.. దానిని అద్భుతంగా ఎడ్మినిస్ట్రేషన్‌ చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య కొద్దిగా ఫోకస్‌ పెడితే పార్టీని లీడ్‌ చేయడం బ్రహ్మ విద్యేం కాదని అంటున్నారు.

ఇదే సందర్భంలో భువనేశ్వరి లేదా బ్రాహ్మాణి పార్టీ పగ్గాలు చేపడతారేమోననేది మరో వాదన. అయితే వీరిద్దరికి ఇప్పటి వరకు రాజకీయంగా ఎలాంటి అనుభవం లేదు. కానీ వీరిద్దరూ రాజకీయ కుటుంబాలకు చెందిన వారు. దాదాపు నలభై ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న సంక్షోభాల్లో చాలా వాటిని దగ్గరుండి చూసిన వారు. అలాగే హెరిటేజ్‌ సంస్థను దగ్గరుండి ప్రగతి బాట పట్టించిన వారిలో వీరిద్దరూ ముందు వరుసలో ఉంటారు. ప్రత్యేకించి భువనేశ్వరి విషయానికొచ్చేసరికి.. తన తండ్రి హయాంలో జరిగిన రాజకీయం తెలుసు. అలాగే తన భర్త హయాంలో జరిగిన రాజకీయాలను దగ్గరుండి చూశారు. నేతల కుల గోత్రాలు వారి పుట్టు పుర్వోత్తరాలు ఎలా ఉంటాయో తెలియకున్నా.. నేతల మనస్తత్వాలు ఎలా ఉంటాయి.. కేడర్‌ ఆలోచనలు ఎలా ఉంటాయోననేది భువనేశ్వరి అర్థం చేసుకోగలరనేది ఓ చర్చ. ఇదే తరహా బ్రహ్మాణి కూడా దాదాపు అదే స్థాయిలో పని చేయగలరని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగా లోకేష్‌ కూడా జైలుకెళ్లే పరిస్థితే వస్తే.. వీరిద్దరు కూడా పార్టీ ముందున్న ఆప్షన్‌ అవుతారనే చెప్పాలి.