Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపడతారా..? అక్టోబర్ 5న రానున్న స్పష్టత.!

చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ నారా భువనేశ్వరి కుప్పం నుంచి బస్సు యాత్రను చేపట్టనున్నట్లు సమాచారం. ఈ యాత్ర రాయలసీమ జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి విరాలు ఇప్పుడు చూద్దాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 2, 2023 | 10:56 AMLast Updated on: Oct 02, 2023 | 10:56 AM

Will Chandrababus Wife Nara Bhuvaneshwaris Hunger Strike Start The Bus Yatra

చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండు అనుభవిస్తున్నారు. ఈ అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ శ్రేణులు రకరకాలుగా సంఘీభావం తెలిపారు. నారా భువనేశ్వరి పిలుపు మేరకు కొవ్వొత్తుల ర్యాలీలు, ప్లకార్డుల ప్రదర్శనలు, కేశ ముండన కార్యక్రమాలు, కంచాలు మోగించడం లాంటివి చేపట్టారు. నేడు సాయంత్రం 7 నుంచి 7.05 వరకూ ఐదు నిమిషాల పాటు దీపాలను ఆర్పివేసి మద్దతు తెలపాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. మన్నటి వరకూ టీడీపీ పార్టీ శ్రేణులే అంతంత మాత్రాన పాల్గొని ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక రానున్న రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు సతీమణి బస్సుయాత్ర చేపడతారన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి.

బస్సు యాత్ర అక్కడి నుంచే..

అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా నిరాహార దీక్ష చేపడతానని భువనేశ్వరి ఇప్పటికే ప్రకటించారు. దీని తరువాత అక్టోబర్ 5 నుంచి బస్సు యాత్ర ఉంటుందని తెలుస్తోంది. దీనికి రూట్ మ్యాప్ కూడా సిద్దమైనట్లు సమాచారం. అయితే ఎక్కడ నుంచి ప్రారంభిస్తారు అన్నదానిపై ఒక స్పష్టత ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ముందుగా తన సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి ఈ యాత్ర రాయలసీమ జిల్లాల మీదుగా సాగుతుందని అంటున్నారు కొందరు నాయకులు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిచేసినట్లు చెబుతున్నారు. ముందుగా రాయలసీమ నుంచి ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేలా ప్రణాళికలు రచించారంటున్నారు కొందరు నాయకులు.

యాత్రకు.. కోర్టుకు లింక్ ఏంటి..?

నారా భువనేశ్వరి బస్సు యాత్ర కచ్చితంగా ఉంటుందా లేదా అంటే చంద్రబాబు కోర్టు కేసుపై ఆధారపడి ఉందంటున్నారు టీడీపీ శ్రేణులు. ప్రస్తుతం చంద్రబాబు రెండు ముఖ్యమైన కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందులో క్వాష్ పిటీషన్, బెయిల్ మంజూరు ఈరెండు ప్రదానమైనవి. ఇవి అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి. ఈ తరుణంలో బాబు క్వాష్ పిటీషన్ కొట్టివేసినా, బెయిల్ మంజూరు చేసినా ఎలాంటి యాత్ర ఉండబోదని సమాచారం. ఒకవేళ రిమాండుకు తరలిస్తే మాత్రం చంద్రబాబు సతీమణి రోడెక్కే అవకాశాలు ఉన్నాయంటున్నాయి పార్టీ వర్గాలు. ఇందులో భాగంగానే అక్టోబర్ 4న ఆమె కుప్పానికి బయలుదేరి వెళ్తారని చెబుతున్నారు. అదే రోజు నోటు ఓటు కేసు కూడా విచారణ జరుగనుంది. దీనిపై ఎలాంటి తీర్పు వస్తుందో వేచిచూడాలి. బాబు కేసులో వచ్చే పురోగతిని బట్టి అక్టోబర్ 5న యాత్ర చేయాలా వద్దా అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

T.V.SRIKAR