Sanju Samson: చెప్తే వినలేదు చెడిపోగా చూస్తున్నాం

క్రికెట్ వరల్డ్ కప్‌కు ఎంపికైన టీమిండియా జట్టులో యువ క్రికెటర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడం పలువురు క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 24, 2023 | 09:51 AMLast Updated on: Sep 24, 2023 | 9:51 AM

Young Cricketer Sanju Samson Did Not Get A Place In The Team Selected For The Cricket World Cup

క్రికెట్ వరల్డ్ కప్‌కు ఎంపికైన టీమిండియా జట్టులో యువ క్రికెటర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడం పలువురు క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. సంజూ శాంసన్‌కు జట్టులో చోటు కల్పించకపోవడాన్ని తప్పుబడుతూ పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. శాంసన్‌ను పక్కనబెడుతూ బీసీసీఐ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం సరికాదంటూ విమర్శలు చేస్తున్నారు. ఐపీఎల్‌తో పాటు వన్డేల్లో బాగానే రాణించినా వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన జట్లలో సంజూకి మొండిచెయ్యి చూపడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో సంజూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తూనే ఉన్నారు. సెలక్టర్లు ఉద్దేశపూర్వకంగానే శాంసన్‌ను పక్కనబెట్టారని ఏకిపారేస్తున్నారు.

భారత జట్టులో ఇప్పటికే ఇద్దరు కీపర్లు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఉన్నందునే మరో కీపర్ సంజూకి జట్టులో చోటు దక్కలేదని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. జట్టులో అవకాశాల కోసం సంజూ వేచిచూడాలని సలహా ఇచ్చారు. అయితే సంజూ శాంసన్ సొంత రాష్ట్రం కేరళకు చెందిన మరో మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఈ విషయంలో సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంలో సంజూకి చాలా అవకాశాలు ఇచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడని అభిప్రాయపడ్డాడు. శాంసన్‌కు యాటిట్యూడ్ ఎక్కువ.. ఎవరి మాట వినడని వ్యాఖ్యానించాడు. అందుకే వరల్డ్ కప్ ఆడే టీమిండియా జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డాడు. పరిస్థితులకు తగినట్లు తన ఆటతీరును మార్చుకోవాలని తాను కూడా శాంసన్‌కు సూచనలు చేశానని.. అయితే అతను తన మాట ఎప్పుడూ వినలేదని శ్రీశాంత్ తెలిపాడు. తన సలహాను పాజిటివ్‌గా తీసుకుని ఆ దిశగా తన తప్పిదాలను సరిదిద్దుకుని ఉంటే.. ఇప్పుడు శాంసన్ కెరీర్ మరో రకంగా ఉండేదని, ఐపిఎల్ ఫిక్సింగ్ ఆరోపణలతో తన కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకున్న శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు.