To Retired 55 members in Rajyasabha: రాజ్యసభలో 55మందికి రిటైర్మెంట్ … ఎప్పుడంటే !
2024 ఏప్రిల్ నెలలో పెద్దల సభ నుంచి భారీగా సభ్యుల రిటైర్మెంట్ ఉండబోతోంది. పదవీ వికరణ చేసేవారిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే మార్చిలోనే కొత్త సభ్యుల ఎన్నిక ఉండబోతోంది. బీజేపీ ఈ ఎలక్షన్ ప్లస్ అవుతాయా ?

2024 ఏప్రిల్ లో రాజ్యసభ నుంచి 55 మంది సభ్యులు పదవీ విరమణ పొందబోతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల నుంచి కూడా రిటైర్మెంట్ ఉండబోతోంది. అత్యధికంగా బీజేపీ నుంచి 27 మంది సభ్యులు, కాంగ్రెస్ నుంచి 10 మంది, బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, టీడీపీ, వైసీపీ నుంచి ఒక్కొక్కరు చొప్పున పదవీ విరమణ చేస్తారు. ఈ జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్, మన్ సుఖ్ మాండవీయ, భూపేందర్ యాదవ్, నారాయణ రాణే, రాజీవ్ చంద్రశేఖర్ తదితురులు ఉన్నారు. ఏపీకి చెందిన జి.వి.ఎల్ నర్సింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన కూడా ఏప్రిల్ లోనే రిటైర్డ్ అవుతారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఏప్రిల్ లో ఆయన రిటైర్డ్ అవుతారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పాటు కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు. అందుకే ఈసారి రాజ్యసభకు పోటీ చేయకపోవచ్చని అనుకుంటున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జే.పి. నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన వేరే రాష్ట్రం నుంచి పోటీ చేయాల్సి వస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఈమధ్యే బీజేపీ అధికారంలోకి వచ్చింది. దాంతో ఈసారి రాజ్యసభ స్థానాల్లో ఎక్కువగా బీజేపీకే దక్కే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 2024లో ఈ 55 మంది సభ్యుల రిటైర్మెంట్ ఉండబోతుంది. అంతకంటే ముందే మార్చిలోనే కొత్త సభ్యుల ఎన్నిక జరిగే అవకాశముంది. అంటే సార్వత్రిక ఎన్నికలకు ముందే రాజ్యసభ సభ్యుల ఎలక్షన్ పూర్తవుతుంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే… తెలంగాణలో కాంగ్రెస్ కు రెండు రాజ్యసభ సీట్లు వచ్చే ఛాన్సుంది. ఇక్కడ బీఆర్ఎస్ రెండు సీట్లు కోల్పోయి ఒక్కటి దక్కించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఉన్న ఒక్క సీటును తిరిగి నిలుపుకోవడంతో పాటు అదనంగా మరో రెండు స్థానాలు గెలుచుకోబోతోంది.