AP CM Jagan: నిన్నటి స్పందనే.. ఇవాళ్టి జగనన్నకు చెబుదాం.. పేరు మార్చి జనాలను మభ్యపెడుతున్నారా ?

రాజకీయం అంటేనే మాయ. ఉన్నది ఉన్నట్లు చూపించడమే కాదు.. లేనిది ఉన్నట్లు చూపించడమే నిజమైన రాజకీయ నాయకుడి లక్షణం. ఏపీలో వైసీపీ సర్కార్‌ పనులు, పథకాలు చూసి.. ఇప్పుడు జనం మాట్లాడుకుంటున్న మాటలు ఇవే. జగనన్నకు చెబుదాం అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు జగన్. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు దీన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది సర్కార్. దీనికోసం టోల్‌ఫ్రీ నంబరు 1902ను ఏర్పాటు చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 9, 2023 | 04:41 PMLast Updated on: May 09, 2023 | 4:41 PM

Ap Cm Jagan Political Strategy

ఆ నంబరుకు ఫోను చేసి సమస్యలు తెలియజేస్తే వాటిని నమోదు చేసుకొని పరిష్కరిస్తారు. వాటి పరిష్కార క్రమాన్ని ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసిన వారికి అప్‌డేట్స్ ఇస్తూ ఉంటారు. కార్యక్రమం కాన్సెప్ట్‌ బాగానే ఉన్నా.. దీని చుట్టూ కథే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. జగనన్నకు చెబుదాం అంటూ పాత ఫోన్‌ నంబర్‌తో కొత్త పేరును పెట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ఫోన్‌కాల్‌లో ఫిర్యాదు నేరుగా జగన్ తీసుకుంటారని.. లేదా ఆయన దగ్గరకు వెళతాయని నిన్నటి వరకూ పార్టీ వర్గాలు చెప్తున్నాయ్. నిజానికి ఇంతకుముందు ఇలాంటి కాన్సెప్ట్‌తోనే స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఐతే అది ఫెయిల్ కావడంతో.. ఇప్పుడు పేరు మార్చి జగనన్న పేరు తగిలిస్తూ.. కొత్త పథకం అని ప్రచారం చేస్తున్నారని విపక్షాలు ఫైర్ అవుతున్నాయ్.

రాజకీయంగా జరుగుతున్న యుద్ధం సంగతి ఎలా ఉన్నా.. ఈ పథకం కోసం జనాలు ఆశగా ఎదురుచూస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గంలోనూ వైసీపీ సర్కార్ మీద వ్యతిరేకత ఉంది.. గడపగడపకు కార్యక్రమంలో అదే ప్రూవ్ అయింది కూడా ! చాలాచోట్ల చాలామంది ఎమ్మెల్యేలను జనం నిలదీసిన వీడియోలు ఇప్పటికీ కనిపిస్తుంటాయ్‌ సోషల్‌ మీడియాలో. సమస్యలు తీరుస్తాం.. అన్నీ చూసుకుంటాం అని స్పందన కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ తర్వాత గాలికి వదిలేశారు. ఇప్పుడు ఆ పథకానికి పేరు మార్చి.. జగనన్నకు చెబుదాం అంటున్నారు. పేరు మార్పు తప్ప.. జనాలకు ఒరిగేది ఏమైనా ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయ్.

ఏపీలో ఎన్నికల మూడ్‌ మొదలైంది. జనంతో ఉన్నామని.. జనం తమతోనే ఉన్నారని చెప్పుకునేందుకు ఓ ఫ్లాట్‌ఫాం కావాలి. దాని కోసమే ఈ పథకం తప్ప వేరేదేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయ్. సమస్యలు తీరుస్తామని చెప్పడం కాదు.. వాటిని తీర్చడమే ఇంపార్టెంట్. ఆ సత్తా ప్రభుత్వానికి ఉందా అంటే.. మూడేళ్ల నుంచి పట్టించుకోని నాయకులు.. ఇప్పుటికిప్పుడు వెలగబెట్టేది ఏమీ ఉండదు అనే చర్చ వినిపిస్తోంది. ఒక్కటి మాత్రం క్లియర్‌.. నిన్న స్పందన అయినా.. ఇవాళ జగనన్నకు చెబుదాం అన్నా.. ఇదంతా ఎలక్షన్ స్టంట్ మాత్రమే ! ప్రభుత్వం మీద జనాల్లో వ్యతిరేకత పెరిగిందని తెలిసి.. సరిదిద్దుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పుట్టుకొచ్చిన కార్యక్రమం తప్ప.. మరొకటి కాదు. ఇదంతా జనాలను మభ్యపెట్టడానికే అనే చర్చ జరుగుతోంది.

ప్రభుత్వ వ్యతిరేకతను బయటికి కనిపించకుండా వైసీపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. గడపగడపకు ప్రభుత్వం అన్నారు. నిలదీసేసరికి స్పందన అని తీసుకొచ్చారు.. ఓ నంబర్ పెట్టారు. ఆ తర్వాత ఇంటింటికి స్టిక్కర్ అని కొత్త కథ మొదలుపెట్టారు. అదీ వర్కౌట్ కాలేదు. స్పందన కార్యక్రమాన్ని కాసిన్ని మెరుగు దిద్ది.. ఇప్పుడు జగనన్నకు చెబుదాం అంటున్నారు. ఇందులో రాజకీయం, స్వార్థం తప్ప.. జనాలకు ఏం చేస్తారో, చేశారో చెప్పే పరిస్థితి ఎక్కడ ఉంది అని మెజారిటీ వర్గాల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. స్పందనలో కంప్లైట్ చేయమని ప్రభుత్వం చెప్పింది.. ఇప్పుడే అదే సర్కార్ జగగనన్నకు చెబుదాం అంటోంది. అంటే స్పందన ఫెయిల్ అయినట్లే కదా ! నాలుగేళ్లుగా పరిష్కార మార్గం దొరకని సమస్యలకు.. ఒక్క ఏడాదిలోదారి ఎలా చూపిస్తారు సార్ అని ప్రశ్నిస్తున్నారు ఏపీ జనాలు.