రేవంత్ ను భయపెడుతున్న ఎమ్మెల్యేలు.. కావాలనే సైలెంట్ గా ఉన్నారా…?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ ఎమ్మెల్యేలు... ఇబ్బందుల పాలు చేయడం ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారుతుంది. రాజకీయంగా 10 ఏళ్లపాటు ఇబ్బందులు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ ఎమ్మెల్యేలు… ఇబ్బందుల పాలు చేయడం ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారుతుంది. రాజకీయంగా 10 ఏళ్లపాటు ఇబ్బందులు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చేసి ఏడాది అయినా సరే ఆ పార్టీ ఎమ్మెల్యేలు గానీ, నాయకులు గానీ పెద్దగా ప్రచారం చేసుకునే విషయంలో ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల విషయంలో విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే టార్గెట్ చేస్తూ వస్తున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గానీ మంత్రులు గాని పెద్దగా మాట్లాడటానికి ఆసక్తి చూపించడం లేదు. ఎవరో ఒకరిద్దరు నేతలు మినహా పెద్దగా జిల్లాల్లో మీడియా సమావేశాలు పెట్టడం గాని, ప్రజల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపించటం గాని లేదనే చెప్పాలి. ఇటీవల రైతు భరోసాతో పాటుగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. రైతు భరోసా ఒక్కొక్కరికి అమలు అవుతూనే ఉంది. ఇక రుణమాఫీ విషయంలో కూడా రైతులకు కొంత న్యాయం జరిగింది.
అయినా సరే వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. అలాగే సమగ్ర కుల సర్వే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చిన సరే ఎమ్మెల్యేలు మౌనం గానే ఉండిపోయారు. కీలక నేతలుగా ఉన్న వాళ్లు కూడా బయటకు రాకపోవడంతో… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్లని ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక ఆధిపత్యం నడుస్తుంది అనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పెద్దగా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయడం లేదు.
రెండు మూడు నెలల నుంచి మంత్రి సీతక్క కూడా పెద్దగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. పార్టీ అధికారంలో లేని సమయంలో సీతక్క ప్రజల్లోకి వెళ్లి కష్టపడ్డారు. ఇప్పుడు ఆమె కూడా సైలెంట్ గానే ఉంటున్నారు. ఇక మంత్రులు కోమటిరెడ్డి అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి వాళ్ళు సైలెంట్ గా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో ఎమ్మెల్యేలు కొంతమంది సీరియస్ గా ఉన్నారు. వారు రహస్య సమావేశం కూడా నిర్వహించారు.
అటు తీన్మార్ మల్లన్న విషయంలో కూడా పెద్దగా మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం లేదు పార్టీ నేతలు. ప్రతి విషయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాల్సిన పరిస్థితి ఉంది. బడ్జెట్ సమావేశాల్లో టార్గెట్ చేయాలని భారత రాష్ట్ర సమితి కసరత్తులు గట్టిగానే చేస్తుంది. దీనితో బడ్జెట్ సమావేశాల్లో అయినా సరే పార్టీ నేతలు మాట్లాడకపోతే మాత్రం పరిస్థితి దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయని, ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ కాలేని పరిస్థితి.