Rahul Gandhi: 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అశోక్ గెహ్లాట్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Ashok Gehlot made key comments that Rahul Gandhi is the prime ministerial candidate
లోక్ సభ ఎన్నిలకలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. ఈలోపూ రాజకీయ సమీకరణాలు చాలా మారవచ్చు. అయితే తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనఫున ప్రధాని అభ్యర్థిగా రాహూల్ గాంధీ పోటీ చేయనున్నట్లు తెలిపారు. బెంగళూరు వేదికగా 26 పార్టీల ఇండియా కూటమి సమీష్టిగా కలిసి ఆలోచించి, చర్చలు జరిపిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ప్రధాన మంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా స్థానిక పరిస్థితుల గురించి కూడా ప్రస్తావించారు. ఏ రాజకీయ పార్టీకి అయినా ప్రాంతీయ అంశాలపై తీవ్రంగా ప్రభావం పడుతుందని చెప్తూనే.. దేశ రాజకీయాల గురించి మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో ప్రతి పార్టీ పైనా తీవ్రమైన ఒత్తిడి ఉందని ఆ ఒత్తిడిని కూడా ప్రజలే తీసుకొచ్చారని చెప్పారు. అందుకే అన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి ఒకటయ్యామన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పై విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు దురహంకారం ప్రదర్శించకూడదని సూచించారు. బీజేపీ గతంలో కేవలం 31 శాతం ఓట్లతోనే అధికారం సాధించిందని ఈ సందర్బంగా తెలిపారు. మిగిలిన 69 శాతం ఓట్లు మోదీ వ్యతిరేకమైనవే అని గుర్తు చేశారు. ఇండియా కూటమికి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఎన్డీఏలో భయం మొదలైందన్నారు. బీజేపీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 50శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీయే కృషి చేస్తోందని ఆపార్టీ నాయకులు చెప్పిన మాటలపై కూడా స్పందించారు. మోదీ 50శాతం ఓట్లు ఎప్పటికీ సాధించలేరని.. గతంలో ప్రజాదరణ అధికంగా ఉన్న సమయంలోనే ఈస్థాయి ఓట్లు పోలవ్వలేదని తెలిపారు. ప్రస్తుతం మోదీకి వ్యతిరేకత మొదలైందని గతంలో కంటే కూడా ఓట్లు ఇప్పుడు తగ్గుతాయని చెప్పారు. రానున్న లోక్ సభ ఎన్నికలు ప్రధాని ఎవరు అవుతారో నిర్ణయిస్తాయని.. గతంలో కాంగ్రెస్ వల్లే మోదీ ప్రధాని అయ్యారని ఆసక్తికర వ్యాక్యలు చేశారు.
తాజాగా చంద్రయాన్ 3 విజయం సాధించడం వెనుక కాంగ్రెస్ పార్టీ కృషి ఉందని తెలిపారు. నెహ్రూ, ఇందిరా గాంధీలు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడే ఇలాంటి వాటికి ప్రోత్సాహం అందించారని అప్పట్లో వారి కఠోర శ్రమ వల్లే ఇప్పుడు ఈవిజయాన్ని సాధించగలిగామన్నారు.
రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి నిర్ణయానికి ప్రస్తుతానికి 26 పార్టీల మద్దతు మాత్రమే ఉంది. ఇది కూడా గెహ్లాట్ మాటల్లో తెలిసింది. అయితే చివరి వరకూ ఇలాగే ఉంటుందా.. భవిష్యత్తులో ముంబై వేదికగా జరిగే సమావేశంలో హాజరయ్యే పార్టీలు కూడా దీనికి మద్దతు ఇస్తాయా అన్నది వేచి చూడాల్సిన అంశం. మహారాష్ట్రలో కీలకమైన పార్టీలు, రాజకీయంగా హేమాహేమీ నాయకులు ఉన్నారు. వీరు ఈనిర్ణయాన్ని సమర్థిస్తారా లేదా తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
T.V.SRIKAR