BRS: బీఆర్ఎస్ టికెట్ల కోసం రేసులో వారసులు.. క్యూలో 30 మంది !!

అధికార పార్టీ నుంచి అనామక పార్టీ దాకా.. అన్నీ వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ పోల్స్‌లోనూ వారసత్వ సునామీ రాష్ట్ర రాజకీయాలను ముంచెత్తబోతోంది. ఈవిషయంలో అన్ని పార్టీల కంటే ముందంజలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 18, 2023 | 03:56 PMLast Updated on: Aug 18, 2023 | 3:56 PM

Brs Sitting Mlas Wants Seats For Their Family Members As Successors

BRS: పార్టీలకు అతీతంగా వారసత్వ రాజకీయాల హవా తెలంగాణలో జోరుగా సాగుతోంది. అధికార పార్టీ నుంచి అనామక పార్టీ దాకా.. అన్నీ వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ పోల్స్‌లోనూ వారసత్వ సునామీ రాష్ట్ర రాజకీయాలను ముంచెత్తబోతోంది. ఈవిషయంలో అన్ని పార్టీల కంటే ముందంజలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఉంది. ఛాన్స్ దొరికితే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని, వచ్చే ఎన్నికల ద్వారా అసెంబ్లీలోకి అరంగేట్రం చేయాలని దాదాపు 30 మంది బీఆర్ఎస్ లీడర్ల వారసులు భావిస్తున్నారట. ఈసారి తమ వారసులకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలంటూ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో కొందరు బీఆర్ఎస్ పెద్దలకు వినతిపత్రాలు అందజేస్తున్నారట. ఇలా ట్రై చేస్తున్న బీఆర్ఎస్ లీడర్లలో పలువురి వారసులకు అసెంబ్లీ టికెట్లు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
తలసాని కుమారుడికి.. మల్లారెడ్డి అల్లుడికి ఛాన్స్
2019 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కుమారుడు సాయికిరణ్‌ బీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసి ఓడిపోయారు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కిషన్‌రెడ్డికి గట్టి పోటీనిచ్చేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దింపే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్థానంలో సాయికిరణ్‌‌ను సనత్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి బరిలోకి దింపే అవకాశముంది. గతంలో మల్కాజిగిరి ఎంపీగా పనిచేసిన మంత్రి మల్లారెడ్డిని మరోమారు లోక్‌సభకు పోటీ చేయించాలని సీఎం భావిస్తున్నారు. 2019లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసిన ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి మేడ్చల్‌ సీటు కేటాయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఉమ్మడి వరంగల్‌, నల్లగొండ, ఖమ్మంలలో..
పలువురు ఎమ్మెల్యేల కుమారులు, ఇతర కుటుంబసభ్యులు ఇప్పటికే క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ వేర్వేరు పదవుల్లో కొనసాగుతున్నారు. ఆర్మూర్, నిర్మల్, పటాన్‌చెరు, తాండూరు, నిజామాబాద్‌ అర్బన్, చేవెళ్ల, షాద్‌నగర్‌ ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు నియోజకవర్గ స్థాయిలో కీలకంగా పనిచేస్తున్నారు. అవకాశం చిక్కితే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి అడుగు పెట్టేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు.
* ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి) సతీమణి గండ్ర జ్యోతి (జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌), డీఎస్‌ రెడ్యా నాయక్‌ (డోర్నకల్‌) కుమారుడు డీఎస్‌ రవిచంద్ర, కుమార్తె కవిత మాలోత్‌ (మహబూబాబాద్‌ ఎంపీ) ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నారు.
* ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డితో పాటు ఎన్‌.భాస్కర్‌రావు (మిర్యాలగూడ) కుమారుడు సిద్ధార్థ్, కంచర్ల భూపాల్‌రెడ్డి (నల్లగొండ) సోదరుడు క్రిష్ణారెడ్డి ఆశావహుల జాబితాలో ఉన్నారు.
* ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కుమారులు రామకృష్ణ, రాఘవేంద్ర, భద్రాచలం నియోజకవర్గం ఇన్‌చార్జి తెల్లం వెంకట్‌రావు సోదరి తెల్లం సీతమ్మ (జెడ్పీటీసీ) కూడా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతూ అవకాశం కోసం చూస్తున్నారు.
రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ లలో..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్‌ రావు మెదక్‌ టికెట్‌ ఆశిస్తూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రోహిత్‌కు కూడా టికెట్‌ ఇవ్వాలని మైనంపల్లి కోరుతున్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్‌రావు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం) కుమారుడు కార్తీక్‌రెడ్డి, హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ముఠా గోపాల్‌ (ముషీరాబాద్‌) కుమారుడు ముఠా జయసింహ కూడా అసెంబ్లీపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో బండ్ల క్రిష్ణమోహన్‌ రెడ్డి (గద్వాల) సతీమణి జ్యోతి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి (మక్తల్‌) సతీమణి సుచరిత, పోతుగంటి రాములు (నాగర్‌కర్నూల్‌ ఎంపీ) కుమారుడు భరత్, వీఎం అబ్రహాం (ఆలంపూర్‌) కుమారుడు వీఎం అజయ్‌ క్రియాశీల రాజకీయాల్లో ఇప్పటికే నియోజకవర్గాల్లో చక్రం తిప్పుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్స్‌వాడ) కుమారుడు భాస్కర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ (నిజామాబాద్‌ రూరల్‌) కుమారుడు జగన్‌మోహన్‌ (దర్పల్లి జెడ్పీటీసీ), హనుమంతు షిండే (జుక్కల్‌) కుమారుడు హరీష్‌ కుమార్‌ షిండే, గంప గోవర్దన్‌ (కామారెడ్డి) కుమారుడు శశాంక్‌ టికెట్‌ ఆశిస్తున్న వారసుల జాబితాలో ఉన్నారు. తనకు విశ్రాంతి ఇచ్చి కుమారుడికి టికెట్‌ ఇవ్వాలని బాజిరెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు.