CONGRESS: రిజర్వుడ్ స్థానాల్లో కాంగ్రెస్ పాగా.. అధిక సీట్లు గెలుచుకున్న హస్తం..

ఎస్సీ, ఎస్టీ వర్గాలు కాంగ్రెస్‌ వైపే ఉన్నట్లు తేలిపోయింది. మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. తెలంగాణలో మొత్తం 19 ఎస్సీ స్థానాల్లో బీఆర్ఎస్ ఐదు మాత్రమే గెలిచింది. 14 చోట్ల కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా బీఆర్ఎస్‌వైపు మొగ్గు చూపారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 4, 2023 | 03:22 PMLast Updated on: Dec 04, 2023 | 3:22 PM

Congress Party Got Highest Reserved Seats In Telangana

CONGRESS: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మరి ఈసారి కీలకమైన ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో గెలుపు ఎవరిది..? అక్కడి ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు..? గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఏ పార్టీని అక్కున చేర్చుకున్నారు..? ఏ పార్టీని తిప్పికొట్టారు అన్నది చూద్దాం. తెలంగాణలో మొత్తం 19 ఎస్సీ, 12 ఎస్టీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా బీఆర్ఎస్‌వైపు మొగ్గు చూపారు. ఈసారి ఈ రెండు వర్గాలను తమ వైపు తిప్పుకోవడానికి అన్ని పార్టీలు గట్టిగా ప్రయత్నించాయి. రకరకాల హామీలు ఇచ్చాయి. దీంతో వీళ్ళు ఎటు వైపు చూపిస్తారన్న ఆసక్తి కనిపించింది.

BRS: ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బీఆర్ఎస్‌ గెలిచేదేమో!

అయితే ఫలితాలు వెల్లడి అయ్యాక మాత్రం ఎస్సీ, ఎస్టీ వర్గాలు కాంగ్రెస్‌ వైపే ఉన్నట్లు తేలిపోయింది. మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. తెలంగాణలో మొత్తం 19 ఎస్సీ స్థానాల్లో బీఆర్ఎస్ ఐదు మాత్రమే గెలిచింది. 14 చోట్ల కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో బీజేపీ ఖాతా తెరవలేదు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకంగా 16 చోట్ల గెలవగా… ఈసారి ఏకంగా 11 స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. అది గులాబీ పార్టీ విజయావకాశాలను దెబ్బకొట్టింది. చెన్నూరు, బెల్లంపల్లి, జుక్కల్, ధర్మపురి, చొప్పదండి, మానకొండూరు, ఆంధోల్, వికారాబాద్, అచ్చంపేట, నకిరేకల్, తుంగతుర్తి, వర్ధన్నపేట, మధిర, సత్తుపల్లి స్థానాలు కాంగ్రెస్‌ ఖాతాలో చేరాయి. సత్తుపల్లిలో గత ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఇక జహీరాబాద్, చేవెళ్ల, కంటోన్మెంట్, స్టేషన్‌ ఘన్‌పూర్‌, అలంపూర్‌లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. తెలంగాణలో 12 ఎస్టీ స్థానాలున్నాయి. ఇందులో కాంగ్రెస్ 9 చోట్ల గెలవగా.. బీఆర్ఎస్ మూడింట్లో మాత్రమే విజయం సాధించింది.

Congress Cabinet: కేబినెట్‌ కూర్పు.. కాంగ్రెస్‌కి పెద్ద ఛాలెంజ్‌..

గత ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ నాలుగు స్థానాలను మెరుగు పరుచుకుంది. వరంగల్‌లోని మూడు స్థానాలు హస్తం సొంతమయ్యాయి. ఖమ్మంలోని ఐదింటిలో నాలుగు చోట్ల హస్తం హవా సాగింది. ఒక్క భద్రాచలంలో మాత్రం బీఆర్ఎస్ బయటపడింది. ఆదిలాబాద్‌లోని రెండు ఎస్టీ స్థానాలు కారు ఖాతాలో పడ్డాయి. ఎస్సీలను తనవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నించింది. 12 అంశాలతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది. అంబేద్కర్ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 12లక్షల చొప్పున ఇస్తామని తెలిపింది. పోడు భూములకు పట్టాలు, కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ఆరు లక్షల సాయం లాంటి హామీలు కాంగ్రెస్‌కు కలసి వచ్చాయి.