ETELA VS BANDI: ఈటల VS బండి.. కాంగ్రెస్‌లోకి ఈటల ! బండిపై పోటీ చేసే ఛాన్స్

తెలంగాణ రాష్ట్రం రాకముందు.. వచ్చిన తర్వాత.. ఎన్నో యేళ్ళ పాటు మంత్రి, MLA పదవుల్లో ఉన్న సీనియర్ నేత ఈటల రాజేందర్ ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు. కేసీఆర్‌తో పడక బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన పొలిటికల్ కెరీర్ దెబ్బతింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 17, 2024 | 04:20 PMLast Updated on: Feb 17, 2024 | 4:20 PM

Etela Rajender Will Quit Bjp And Join Congress And Contest From Karimnagar

ETELA VS BANDI: ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లో చేరబోతున్నారా..? ఆయనకు కరీంనగర్ ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేశారా..? సరైన అభ్యర్థి లేడని భావిస్తున్న టైమ్‌లో కరీంనగర్‌లో ఈటలను కాంగ్రెస్ నిలబెట్టబోతోందా..? అందుకే హస్తం పార్టీ నేతలతో ఈటల సమావేశ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే కరీంనగర్ ఎంపీ స్థానంలో.. తనకు బీజేపీలో ప్రత్యర్థి అయిన బండి సంజయ్‌ని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు.. వచ్చిన తర్వాత.. ఎన్నో యేళ్ళ పాటు మంత్రి, MLA పదవుల్లో ఉన్న సీనియర్ నేత ఈటల రాజేందర్ ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు.

Chandrababu Naidu: చంద్రబాబుకు షాక్.. ఫైబర్‌నెట్ కేసులో ఏ1గా చార్జిషీటు దాఖలు

కేసీఆర్‌తో పడక బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన పొలిటికల్ కెరీర్ దెబ్బతింది. బీజేపీలో చేరినా అక్కడ సరైన ప్రాధాన్యత లేకపోవడం.. పైగా బండి సంజయ్‌తో గొడవలతో మరింత ఇబ్బందుల్లో ఉన్నారు ఈటల రాజేందర్. అందుకే ఇప్పుడాయన కాంగ్రెస్‌లోకి వెళ్తారన్న టాక్స్ నడుస్తున్నాయి. తాను ఊరికే పార్టీలు మారేవాడిని కాను.. అని గతంలో అనేకసార్లు చెప్పారు ఈటల. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆయన్ని కాంగ్రెస్ వైపు టర్న్ చేస్తున్నాయని అంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఈటల రాజేందర్. అసలే బీజేపీలో అంతంత మాత్రం గౌరవం ఉందని బాధపడుతుంటే.. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోయింది. బీజేపీలో కరీంనగర్ ఎంపీ టిక్కెట్ అడిగారు. టీఆర్ఎస్‌లో ఉన్నప్పటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీద ఈటలకు మంచి పట్టు ఉంది. దాంతో తాను ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తానన్న నమ్మకం ఉంది.

TDP IN TO NDA: పొత్తుల టైమ్.. ఎన్డీఏలోకి టీడీపీ ! ముహూర్తం ఎప్పుడంటే ?

అయితే అక్కడ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్‌ను కాదని ఈటలకు ఇవ్వలేమని బీజేపీ పెద్దలు చెప్పారు. ఆ తర్వాత మల్కాజ్‌గిరి టిక్కెట్ అడిగారు ఈటల. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీకి ఓటు బ్యాంక్ ఉండటంతో పాటు.. GHMC కార్పొరేటర్ల అండ కూడా ఉంటుందని భావిస్తున్నారు. బీజేపీ అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి హామీ రాలేదు. పైగా మల్కాజ్‌గిరి ఎంపీ టిక్కెట్‌కు పార్టీలోనే గట్టి పోటీ ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లోకి వెళితే బెటర్ అన్న ఆలోచన ఈటల చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడైతే కరీంనగర్ ఎంపీ టిక్కెట్ ఇచ్చే ఛాన్సుంది. ఎందుకంటే.. గతంలో ఈ స్థానం నుంచి పోటీ పడ్డ పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి రేవంత్ కేబినెట్‌లో మంత్రి పదవి చేపట్టారు. కరీంనగర్ ఎంపీ స్థానానికి నిలబడేందుకు సరైన అభ్యర్థి కాంగ్రెస్‌కి దొరకడం లేదు. ఈటల వస్తే ఆ లోటు భర్తీ అవుతుందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. కానీ రాష్ట్రంలో బీజేపీలో చేరికలు ఉండటం లేదు. పైన కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా.. వచ్చే ఐదేళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే హవా. అలాంటిప్పుడు ఈటల కాంగ్రెస్‌లో చేరడమే బెటర్ అని ఆయన అనుచరులు కొందరు చెబుతున్నారు.

పైగా బీజేపీలో తన ప్రత్యర్థి బండి సంజయ్ మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం కలుగుతుందని అంటున్నారు. ఈటలను కూడా కాంగ్రెస్‌లోకి తెచ్చేందుకు.. లేటెస్ట్‌గా జాయిన్ అయిన పట్నం మహేందర్ రెడ్డితో పాటు మైనంపల్లి హన్మంతరావు గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈమధ్య మైనంపల్లి ఇచ్చిన విందు పార్టీకి ఈటల కూడా హాజరయ్యారు. అప్పటి నుంచే ఈటల హస్తం గూటికి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈటల చేరికపై ఆయన అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కేంద్రంలో మళ్ళీ వచ్చేది బీజేపీ ప్రభుత్వం అయినప్పుడు.. ఇప్పుడు ఈటల కాంగ్రెస్‌లోకి వెళ్లడం కరెక్ట్ కాదంటున్నారు కొందరు. ప్రధాని మోడీ, అమిత్ షా దగ్గర పలుకుబడి కలిగిన ఈటలకు కేంద్రంలో ఏదో ఒక పదవి దక్కే ఛాన్సుందని అనేది వాళ్ళ వాదన. ఈ పరిస్థితుల్లో ఈటల కాంగ్రెస్‌లో చేరతారా.. లేదంటే తాను ముందు నుంచీ చెబుతున్నట్టుగా పార్టీ మారకుండా బీజేపీలోనే కొనసాగుతారా అన్నది చూడాలి.