Top Story: పాక్ ఆక్రమిత కశ్మీర్లో హమాస్ గ్యాంగ్.. భారత్ యుద్ధానికి సిద్ధం కావాల్సిందేనా?
అల్ అక్సా ఫ్లడ్స్.. ఈ మాట వింటే ఇజ్రాయెల్ పౌరులు కలలో కూడా ఉలిక్కిపడతారు. ఎందుకంటే 2023 అక్టోబర్ 7న తమ దేశంపై జరిపిన దాడుల మిషన్కు హమాస్ పెట్టిన పేరు ఇదే. నాడు వందల మంది హమాస్ ఉగ్రవాదులు ప్యారాచూట్లతో ఇజ్రాయెల్లోకి చొరబడి పెను విధ్వంసం సృష్టించారు. దొరికినవారిని దొరికినట్టే చంపేశారు.

అల్ అక్సా ఫ్లడ్స్.. ఈ మాట వింటే ఇజ్రాయెల్ పౌరులు కలలో కూడా ఉలిక్కిపడతారు. ఎందుకంటే 2023 అక్టోబర్ 7న తమ దేశంపై జరిపిన దాడుల మిషన్కు హమాస్ పెట్టిన పేరు ఇదే. నాడు వందల మంది హమాస్ ఉగ్రవాదులు ప్యారాచూట్లతో ఇజ్రాయెల్లోకి చొరబడి పెను విధ్వంసం సృష్టించారు. దొరికినవారిని దొరికినట్టే చంపేశారు. మరికొందరిని తమతో గాజాకు ఎత్తుకెళ్లారు. వారిని విడిపించడానికి ఇజ్రాయెల్ 15 నెలల పాటు భీకర యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి అల్ అక్సా ఫ్లడ్స్ పేరు రీసౌండ్ ఇస్తోంది. అదికూడా మన పొరుగునే ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్లో. ఔను మీరు విన్నది నిజమే.. ఇజ్రాయెల్ను దశాబ్దాలుగా వెంటాడుతున్న హమాస్ టెర్రర్ గ్యాంగ్ కదలికలు పీవోకేలో కలకలం రేపుతున్నాయి. అల్ అక్సా ఫ్లడ్స్ పేరిట అక్కడ ఒక కార్యక్రమం సైతం జరిగింది. ఇదే టైంలో అమిత్ షా హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు. ఈ పరిణామాలన్నీ పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరగకూడనిది ఏదో జరుగుతోందన్న అనుమానాలకు తావిస్తున్నాయి. ఇంతకూ, పీవోకేలో అసలేం జరుగుతోంది? టాప్ స్టోరీలో చూద్దాం..
ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్లో అడుగుపెట్టబోతోందని ప్రచారం జరుగుతోంది. దీంతో భారత నిఘా వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యాయి. కశ్మీర్ సంఘీభావ దినం సందర్భంగా పీవోకేలో కశ్మీర్ సొలిడారిటీ అండ్ అల్ అక్సా ఫ్లడ్స్ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హమాస్కు చెందిన సీనియర్ నేత ప్రసంగించాడు. ఈ సభను రావల్కోట్లోని సబీర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ సభలో లష్కరే, జైషే మహమ్మద్ సంస్థల సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారట. ఈ కార్యక్రమంలో హమాస్ ప్రతినిధి ఖలీద్ కద్దౌమి ప్రసంగిం చినట్టు తెలుస్తోంది. ఖలీద్ కశ్మీర్లో పోరాటాన్ని పాలస్తీనాతో ముడిపెట్టి మాట్లాడొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. జిహాదీ సంస్థలు తమ వాదనలకు బలం చేకూర్చేలా వాదనలు సృష్టించేం దుకు దీనిని వాడుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ సోదరుడు తల్హాసైఫ్, అస్గర్ఖాన్, ఇలియాస్ మసూద్ వంటి ఉగ్రవాదులు సభకు హాజరయ్యారు.
మరోవైపు.. ఈ నెల 4వ తేదీనే భారత హోం మంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్పై హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. అక్కడి భద్రతా పరిస్థితులను, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ల పరిస్థితిని ఆయన పర్యవేక్షించారు. ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను బలోపేతం చేయడం, సీమాంతర చొరబాట్లను అడ్డుకోవడం వంటి అంశాలపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. కశ్మీర్లో వెహికల్ చెకింగ్ను తీవ్రతరం చేయాలని ఆదేశించారు. గతేడాది ఆగస్టులో హమాస్ నేతలతో లష్కరే ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ భేటీ అయ్యాడు. ఖతార్ రాజధాని దోహా దీనికి వేదికైంది. 2018లో సైఫుల్లాను అమెరికా ఉగ్రజాబితాలో చేర్చింది. లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్కు అతడు అత్యంత సన్నిహితుడు. కానీ, దీనికి ముందే హమాస్, పాక్ మధ్య చర్చలు జరిగాయి. 2023 డిసెంబర్లో పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో అల్ అక్సా మసీదు పవిత్రత, ముస్లిం ఉమ్మా యొక్క భాత్యత పేరుతో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరాన్లో హత్యకు గురైన నాటి హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీయే పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాకిస్తాన్ను ధైర్య వంతుడిగా కొనియాడుతూ.. ఇజ్రాయిల్ పాకిస్తాన్ నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటే, ఆ దేశ క్రూరత్వం ఓడిపోతుందని చెప్పాడు. అప్పుడే హమాస్, పాకిస్తాన్ బంధంపై అనుమానాలు మొదలయ్యాయి. పీవోకే సమావేశంతో పూర్తి స్పష్టత వచ్చింది. అయితే, హమాస్ ఉగ్రవాదులకు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఏం పని?
హమాస్ ప్రధాన లక్ష్యం ఇజ్రాయెల్ను అంతం చేయడం. ఆ లక్ష్యంతోనే 2023 అక్టోబర్ 7న ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్స్ ప్రారంభించింది. ఆకస్మిక దాడులు ఇజ్రాయెల్ ఎదుర్కోలేదని హమాస్ ఉగ్ర మూకలు భావించాయి. కానీ, సుదీర్ఘ యుద్ధంతో ఇజ్రాయెల్ హమాస్ అగ్ర కమాండర్లు అందర్నీ లేపేసింది. గాజాలో హమాస్ అన్న మాటే వినపడకుండా అమెరికాతో కలిసి గేమ్ స్టార్ట్ చేసింది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ సైతం గాజాను స్వాధీనం చేసుకుంటామని సంచలన ప్రకటన చేశారు. గాజాలో ఉన్న పాలస్తీనియన్లకు అరబ్ దేశాలు ఆశ్రయం ఇవ్వాల్సిందే అని క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేశారు. కాబట్టి గాజాలో హమాస్ ఉగ్ర ముఠా తిరిగి పుంజుకోవడం ఇంపాజిబుల్. వివరంగా చెప్పాలంటే హమాస్కు గాజాకంటే సేఫ్ ప్లేస్ కావాలి, అది ఇజ్రాయెల్ను ధ్వంసం చేసే ఆయుధాలతో నిండి ఉండాలి. ఈ భూమ్మీద అంత సురక్షిత స్థానం పాకిస్తానే. పైగా ఆ దేశం దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ను ధ్వంసం చేసేందుకు హమాస్కి కావాల్సింది ఇదే. అందుకే గాజా యుద్ధం మొదలైన దగ్గర నుంచీ పాకిస్తాన్తో స్నేహానికి హమాస్ అర్రులు చాస్తోంది. కానీ, పాక్ ఆక్రమిత కశ్మీరే ఎందుకు?
హమాస్ లాంటి ఉగ్రసంస్థకు పాకిస్తాన్ ఊరికే సాయం చేయదు. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకునేందుకు తాము సహాయపడినట్టే.. భారత్పై ప్రతీకారం తీర్చుకునేందుకు హమాస్ను తమకు సాయపడాలనే డిమాండ్ను ఇస్లామాబాద్ పెడుతుంది. మన దేశంపై 2023 అక్టోబర్ 7 నాటి దాడులు చేసేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం ఉపయోగపడుతుంది. బహుశా అందుకే పీవోకేలో ఉగ్రవాద గ్రూపులతో కలిసి కశ్మీర్ సొలిడారిటీ అండ్ అల్ అక్సా ఫ్లడ్స్ పేరిట సమావేశం నిర్వహించి ఉండొచ్చు. కశ్మీర్లో భారత రక్షణ దళాల ఆపరేషన్లతో జైషే మహమ్మద్ బలహీనపడింది. దీంతో హమాస్ను రంగంలో దించాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే మన దేశం సమస్యల్లో చిక్కుకున్నట్టే. హోంమంత్రి అమిత్ షా సైతం హైలెవెల్ మీటింగ్ నిర్వహించడానికి ఇదే కారణం కావచ్చు. నిజానికి.. హమాస్ను ఇప్పటివరకూ మన దేశం ఉగ్రసంస్థగా గుర్తించలేదు. కేవలం రాజకీయ సంస్థగానే పరిగణిస్తూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే హమాస్ను ఉగ్రసంస్థగా గుర్తిం చే సమయం వచ్చినట్టే కనిపిస్తోంది. కానీ, ఇదొక్కటే సరిపోదు. పాకిస్తాన్ కుట్రలకు చెక్ పెట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధం కాక తప్పదు.