North East BJP: హిందూయేతరులు ఎక్కువుండే ఈశాన్యంలో కమలం ఎలా వికసించింది…?

హిందూయేతరులు ఎక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఎలా పాగా వేయగలిగిందన్నదే ఆసక్తికర అంశం... బీఫ్‌ తినడాన్ని బీజేపీ బహిరంగంగా వ్యతిరేకిస్తుంది. ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో బీఫ్ వినియోగం ఎక్కువ. మరి ఈ రెండింటికీ పొత్తు కుదరడం వెనుక పెద్ద ప్రయత్నమే ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 3, 2023 | 12:49 PMLast Updated on: Mar 03, 2023 | 12:49 PM

How Did The Lotus Bloom In The North East Where Non Hindu People Are The Most

బీజేపీ అంటే ప్రధానంగా ప్రతిపక్షాలు చేసే విమర్శ మతతత్వ పార్టీ… బీజేపీ కూడా హిందుత్వంపై అభిమానాన్ని దాచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించదు… అలాంటి బీజేపీ హిందూయేతరులు ఎక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో ఎలా పాగా వేయగలిగిందన్నదే ఆసక్తికర అంశం… బీఫ్‌ తినడాన్ని బీజేపీ బహిరంగంగా వ్యతిరేకిస్తుంది. ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో బీఫ్ వినియోగం ఎక్కువ. మరి ఈ రెండింటికీ పొత్తు కుదరడం వెనుక పెద్ద ప్రయత్నమే ఉంది.

మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అదరగొట్టింది. నిజానికి ఈ మూడు రాష్ట్రాల్లో త్రిపురలో మాత్రమే తన సొంత బలంతో కమలం అధికారంలోకి రాగలిగింది. గతంలో కమ్యునిస్టులను చావుదెబ్బ కొట్టిన కమలానికి ఈసారి విజయం అంత ఈజీగా దక్కలేదు. రాజవంశీకుడు స్థాపించిన తిప్రా మోథా పార్టీ బీజేపీని గట్టిగా ఢీకొట్టింది. అయితే విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. ఇక నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక్కడ బీజేపీ మైనర్‌ పార్ట్‌నర్‌ మాత్రమే… మేఘాలయలో బీజేపీ మూడు సీట్లతోనే సరిపెట్టుకున్నా అది తక్కువేం కాదు. ఈ మూడు రాష్ట్రాల్లోనే కాదు ఈశాన్యం అంతటా కమలం వికసిస్తోంది.

ఈశాన్యంలో ఇటీవల జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుతోంది. 2016లో అస్సాంలో జరిగిన ఎన్నికల్లో కమలం విజయం సాధించింది. అదే తొలి అడుగు. అదే ఏడాది అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ అధికారంలోకి రాగలిగింది. 2017లో మణిపూర్‌ను గెలుచుకుంది. 2018లో త్రిపురలో గెలిచింది. 2019లో అరుణాచల్‌ప్రదేశ్‌ను గెలుచుకుంది. 2021లో అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. 2022లో మణిపూర్‌ కూడా కమలం ఖాతాలో చేరింది.

బీజేపీ ఇలా ఈశాన్యంలో ఎలా నెగ్గుతోందన్న ప్రశ్నకు చాలా కారణాలే ఉన్నాయి. అస్సాం, త్రిపురలు హిందువులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కాబట్టి ఇక్కడ గెలిచింది అనుకుంటే ఓకే… కానీ మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లోనూ సత్తా చాటడమే రాజకీయ విశ్లేషకులకు పూర్తిగా అంతు చిక్కని అంశం. ఆ రాష్ట్రాల్లో గిరిజనులు, క్రిస్టియన్లు ఎక్కువ. బీఫ్‌ ఎక్కువగా తింటారు. అది అక్కడి సంస్కృతి. పైగా వారు స్థానిక భాషలతో పాటు ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడతారు. ఇటు బీజేపీ ఏమో గొడ్డు మాంసానికి వ్యతిరేకం. అదే సమయంలో హిందీని ఇతర రాష్ట్రాల మీద రుద్దుతోందన్న ఆరోపణ దానిపై ఉంది. అలాంటప్పుడు బీజేపీని ఈశాన్య రాష్ట్రాలు ఎలా ఆదరిస్తున్నారన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఈశాన్య రాష్ట్రాల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసారు. ఆ గుడ్‌విల్ అక్కడ ఉంది. మోడీ అధికారంలోకి రాగానే ఈశాన్య రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించారు. నిధులు మంజూరు చేశారు. పైగా ప్రచారంలో బీజేపీ సంగతి తెలిసిందే.. ఇవన్నీ కొంతమేర ఫలించాయి. వీటన్నింటికంటే బీజేపీ వేసిన రాజకీయపుటెత్తులు కమలాన్ని ఈశాన్యంలో నిలబెట్టాయి.

కీలక నేతలను తనవైపు తిప్పుకోవడంలో బీజేపీ వెనకడుగు వేయదు. 2015లో జరిగిన రాజకీయ పరిణామం బీజేపీకి కలసి వచ్చింది. ప్రస్తుతం అసోం ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ బిశ్వశర్మ అప్పట్లో కాంగ్రెస్‌లో ఉండేవారు. సోనియాతో విబేధించి ఆయన బీజేపీలో చేరారు. ఈశాన్య రాష్ట్రాల్లో కాస్త చరిష్మా ఉన్న హేమంత్ బిశ్వశర్మ…. నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్‌ను ఏర్పాటు చేశారు. ఇది బీజేపీ ఆ రాష్ట్రాల్లో చొచ్చుకెళ్లడానికి సాయం చేసింది. కాంగ్రెస్, స్థానిక పార్టీలకు దూరంగా ఉన్నవారిని బీజేపీకి దగ్గర చేసింది.

ఈశాన్య రాష్ట్రాలకు ఢిల్లీ పార్టీలంటే అంతగా పడదు. ఒకప్పుడు కాంగ్రెస్ వెలిగినా తర్వాత దాని ప్రభ క్షీణించింది. ఢిల్లీ బహుత్ దూర్ అనేది స్థానిక పార్టీల నినాదం… అలాంటి రాష్ట్రాలకు మోడీ నేతృత్వంలోని బీజేపీ విదేశీ పార్టీలాగా కనిపించడంలో వింతేం లేదు. అయితే శర్మ నేతృత్వంలోని ఎన్‌ఈడీఏను మాత్రం వారు ఆదరించారు. అలాగే పెమాఖండు, బీరేన్‌సింగ్‌ వంటి వారిని బీజేపీ తనవైపు తిప్పుకోగలిగింది. వ్యక్తిగతంగా పట్టున్న నేతలను తనవైపు తిప్పుకోగలిగింది. పార్టీలను చీల్చుతోందని అపవాదులు వచ్చినా పట్టించుకోలేదు. దీనికి తోడు రామ్‌మాధవ్‌ వంటి వారు ఈశాన్య రాష్ట్రాలపై చాలాకాలంగా పనిచేస్తూ వచ్చారు. నిజానికి బ్రిటీష్ కాలం నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌ ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చింది. మిగిలిన పార్టీలకు దూరమైన వారు బీజేపీకి దగ్గరయ్యేలా ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యూహాలు రచించింది. పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లాగా ఈశాన్య రాష్ట్రాలు వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు కాదని బీజేపీకి తెలుసు.. అందుకే బీఫ్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కొన్నిరోజుల క్రితం తానూ బీఫ్‌ తింటానని ఇది మన సంస్కృతి అంటూ మేఘాలయ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బీజేపీ స్ట్రాటజీలో భాగమే.

తనకు అవకాశం ఉన్న చోటు ఆక్రమించేయడం, బలం తక్కువగా ఉన్న చోట కాలు మోపడానికి స్థానిక పార్టీలను ఉపయోగించుకోవడం బీజేపీకి అలవాటు. దాన్ని పక్కాగా అమలు చేసింది. పైగా ఈశాన్యంలో కాస్తో కూస్తో పట్టున్న పార్టీలు అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీతో సఖ్యతగా ఉంటూ వచ్చాయి. దీన్ని బీజేపీ తనకు అడ్వాంటేజ్‌గా మార్చుకుంది. ఈ సమీకరణాలన్నీ కమలానికి కలసివచ్చాయి. 2019లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 25ఎంపీ సీట్లకు గాను బీజేపీ 14చోట్ల, దాని మిత్రపక్షాలు 4చోట్ల గెలిచాయి. బీజేపీకి ఇక్కడ ఏ స్థాయి పట్టుందో ఇది చెబుతోంది.

ఓవైపు ఈశాన్యంలో కమలం వికసిస్తోంటే కాంగ్రెస్ మాత్రం వాడిపోతోంది. ఒకప్పుడు రాష్ట్రాలను ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు కనీసం ఒకటి రెండు సీట్లు కూడా సాధించలేకపోతోంది. త్రిపురలో కమ్యునిస్టులతో కలసి పోటీ చేసినా ఐదుసీట్లకే పరిమితమైంది. ఇక మేఘాలయలోనూ ఇదే పరిస్థితి. ఇక నాగాలాండ్ లో అయితే ఒక్కటంటే ఒక్క సీటులోనూ కాంగ్రెస్ గెలవలేకపోయింది. మొత్తంగా చూస్తే అందివచ్చిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని ఈశాన్యంలో కమలం పాగా వేసింది. రానున్న రోజుల్లో మిగిలిన రాష్ట్రాలపైనా పూర్తిగా పట్టు పెంచుకునేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది.

(KK)