PAWAN KALYAN: గెలవకున్నా పోరాడుతున్నా.. వైసీపీ పతనం మొదలైంది: పవన్ కల్యాణ్
కురుక్షేత్ర యుద్ధంలో మేం (జనసేన-టీడీపీ) పాండవులం.. మీరు (వైసీపీ) కౌరవులు. ఈ కురుక్షేత్రంలో జగన్ ఓడిపోవడం ఖాయం. మేం గెలవడం కాయం. జనసేన-టీడీపీ కూటమికి మద్దతివ్వండి. సరైన వ్యక్తుల్ని గెలిపించుకోకుంటే.. ఒక తరం నాశనమవుతుంది.

PAWAN KALYAN: ఏపీలో వైసీపీ పతనం మొదలైందని, వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని వ్యాఖ్యానించారు జనసేన అధినేన పవన్ కల్యాణ్. కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్పై, వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. తాను గెలవకున్నా పోరాడుతున్నానని, తన నిబద్ధత ఏంటో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు. ‘‘ఈసారి జరగబోయే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అన్నారు.
కురుక్షేత్ర యుద్ధంలో మేం (జనసేన-టీడీపీ) పాండవులం.. మీరు (వైసీపీ) కౌరవులు. ఈ కురుక్షేత్రంలో జగన్ ఓడిపోవడం ఖాయం. మేం గెలవడం కాయం. జనసేన-టీడీపీ కూటమికి మద్దతివ్వండి. సరైన వ్యక్తుల్ని గెలిపించుకోకుంటే.. ఒక తరం నాశనమవుతుంది. మళ్లీ జగన్కు ఓటేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అవనిగడ్డ ప్రాంతంలో ఇసుక దోపిడీ వల్ల 76 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీ భవిష్యత్ కోసం ఈసారి సరైన వ్యక్తులకు అండగా ఉండాలి. ఈసారి తేడా జరిగితే 20 ఏళ్లు వెనక్కు వెళ్లిపోతారు. నేనేం వెనక్కు వెళ్లను.. ఇక్కడే ఉంటాను. సమస్యలపై మాట్లాడుతోంటే నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. నన్ను బీసీలు.. ఎస్సీలతో తిట్టిస్తారు. జగన్ పదేళ్లు రోడ్ల మీద తిరిగితేనే ఓట్లేశారు. ఇప్పుడంటే పరదాలు కట్టుకుని తిరుగుతున్నారు కానీ.. గతంలో రోడ్ల మీదే తిరిగారు. ఏపీని పట్టి పీడిస్తోన్న వైసీపీ మహమ్మారికి మందే జనసేన-టీడీపీ వ్యాక్సిన్.
అధికారం కోసం కాదు..
జనసేన-టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం. బీజేపీతో కలిసి వెళ్లొచ్చు. కానీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉండదు. అందుకే టీడీపీతో కూడా కలిశాం. నేను అధికారం కోసం అర్రులు చాచలేదు. ఇచ్చిన హామీలు నెరవేరకపోతే నేను మీ పక్షాన నిలబడతాను. మేం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల రుణం తీర్చుకుంటాం. చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఓటు చీలకూడదు. మనకంటే.. మన పార్టీ కంటే మన నేల ముఖ్యం. వైసీపీది ఫ్యాన్ గుర్తు. అది ఎవ్వరికీ అందదు. ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్లులు పేలతాయి. ఏపీ అభివృద్ధిని.. నిరుద్యోగులను వైసీపీ ఫ్యానుకు ఉరేశారు. దాహం తీర్చే గ్లాసు.. ఓ చోటు నుంచి మరో చోటుకు చేర్చే సైకిల్ కలిశాయి. ఏపీ ప్రయోజనాల కోసం రెండు పార్టీలు కలిసి వెళ్తాయి. జగన్ బుద్ధిలేని మనిషిగా, పరిపక్వత లేకుండా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఎవరు సలహాలిస్తున్నారో.. కాస్త మార్చుకోండి. నన్ను విమర్శించే వాళ్ల కులం చూడను. మనుషుల్నే చూస్తాను. రామ-రావణ యుద్దం జరుగుతున్నప్పుడు రామాయ స్వస్తి.. రావణయా స్వస్తి అనే రకం కాదు. నేను ప్రజల కోసం ఒక సైడ్ తీసుకున్నాను’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.