Revanth Reddy: రేవంత్‌ కోసం కేసీఆర్‌ భారీ స్కెచ్‌.. కొడంగల్‌లో స్ట్రాటజీ ఇదేనా..?

హస్తం పార్టీలోని కీలక నేతలకు చెక్ పెట్టేందుకు కే‌సి‌ఆర్ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి వంటివారిని ఈసారి ఓడించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కేసీఆర్‌. రేవంత్ విషయంలో మరింత శ్రద్ధ పెడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 29, 2023 | 04:13 PMLast Updated on: Aug 29, 2023 | 4:13 PM

Kcr Targets Tpcc Chief Revanth Reddy In Kodangal

Revanth Reddy: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఒకరికి మించి ఒకరు అన్నట్లగా వ్యూహ, ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి పార్టీలు. బీఆర్ఎస్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు చేస్తుంటే.. కమలం, కాంగ్రెస్‌ను కలిపి కొట్టాలని కేసీఆర్‌ స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నారు. బీజేపీ సంగతి ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో కారుకు, కాంగ్రెస్‌కు మధ్య పోటీ తీవ్రంగా ఉండేలా కనిపిస్తోంది.

దీంతో హస్తం పార్టీలోని కీలక నేతలకు చెక్ పెట్టేందుకు కే‌సి‌ఆర్ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి వంటివారిని ఈసారి ఓడించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కేసీఆర్‌. రేవంత్ విషయంలో మరింత శ్రద్ధ పెడుతున్నారు. గత ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి, బి‌ఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఐతే ఈసారి కూడా రేవంత్ రెడ్డి కొడంగల్‌ నుంచే బరిలో దిగబోతున్నట్లు తేలిపోయింది. దీంతో రేవంత్ రెడ్డికి మళ్లీ చెక్ పెట్టేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌కే టికెట్ కేటాయించారు కేసీఆర్‌. ఐతే కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి గ్రాఫ్‌ అమాంతం పెరిగిందని సర్వేలు చెప్తున్నాయి. రేవంత్ కూడా ఈసారి గెలుపు విషయంలో డ్యామ్‌ష్యూర్‌గా ఉన్నారు. అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో కొడంగల్‌లో బీఆర్ఎస్‌కు ఓటమి తప్పదా అనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా ఈసారి కూడా కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికి కేసీఆర్‌ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

నియోజకవర్గంలో పట్నం నరేందర్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టే బాధ్యతను మంత్రి మహేందర్ రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల టైమ్‌లో కొడంగల్‌లో పట్నం నరేందర్ రెడ్డి గెలుపులో ఆయన అన్న మహేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అందుకే ఈసారి కూడా మహేందర్ రెడ్డి ద్వారా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలని కే‌సి‌ఆర్ వ్యూహరచన చేసినట్లు టాక్‌. అందులో భాగంగానే మహేందర్ రెడ్డికి మంత్రి పదవి కూడా కట్టబెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే..