అనంతపురం వృద్ద రైతు ప్రాణం నిలబెట్టిన మంత్రి కొండపల్లి
అది అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం, నార్పల మండలం వెంకటాపల్లి గ్రామం. ఆ గ్రామానికి చెందిన రైతు కొరకుటి శ్రీనివాసులు పంట ఎండిపోతోంది.

అది అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం, నార్పల మండలం వెంకటాపల్లి గ్రామం. ఆ గ్రామానికి చెందిన రైతు కొరకుటి శ్రీనివాసులు పంట ఎండిపోతోంది. నీళ్ళు పడే బోరు ఉన్నా.. రాని కరెంట్.. అధికారుల చుట్టూ… ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కానరాని ఫలితం. ప్రాణానికి ప్రాణంగా వేసిన పంట ఓ వైపు ఎండిపోతోంది. నెలల తరబడి పోరాటం చేస్తున్నా.. పంటను కాపాడుకోలేని దీన పరిస్థితి. ఈ తరుణంలో.. ఆత్మహత్యే శరణ్యం అనుకున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో సన్నిహితులు, బంధు మిత్రులు ఇచ్చిన సలహాతో…. జనవరి 30న మంగళగిరి టీడీపీ ఆఫీస్ లో గ్రీవెన్స్ కు హాజరయ్యాడు ఆ రైతు.
అక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. ఆయన వద్దకు వెళ్లి తన గోడు వినిపించాడు ఆ వృద్ద రైతు. వెంటనే స్పందించిన మంత్రి.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. అప్పటి వరకు చూసినట్టు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం పరుగులు పెట్టింది. కరెంట్ లైన్ లాగారు.. పంటను కాపాడేందుకు పరుగులు పెట్టారు. అంతే.. బోరులో నీళ్ళు వచ్చాయి. ఆనందంతో పొంగిపోయిన ఆ రైతు.. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, అచ్చేన్నాయుడు ఫోటోలు అక్కడ ఏర్పాటు చేసాడు.
పూజలు చేసి.. బోరు ఆన్ చేసాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాకు పంపగా.. అవి విస్తృతంగా వైరల్ అయ్యాయి. తన ప్రాణాలను మంత్రి కాపాడారని, టీడీపీని నమ్ముకున్నందుకు తమ జీవితాన్ని నిలబెట్టారని ఆ రైతు ఓ వీడియో విడుదల చేసారు. 60 ఏళ్ళ వయసులో తన ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పంట ఎండిపోతుంటే.. కాపాడిన ప్రభుత్వానికి, టీడీపీ నేతలకు రుణపడి ఉంటాను అంటూ వారి ఫోటోలను తన ఇంట్లో కూడా పెట్టుకున్నారు సదరు రైతు. ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మంత్రి కృషిని టీడీపీ కార్యకర్తలు అభినందిస్తున్నారు.