PM MODI: కేసీఆర్‌ను టైమ్ చూసి కొట్టిన మోదీ.. తెలంగాణలో బీజేపీ జోరు ఖాయమా..?

ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. మరోవైపు బీజేపీ రోజురోజుకు వీక్ అవుతోంది. కమలం పార్టీ పని ఇక ఔట్ అనుకుంటున్న సమయంలో.. బాహుబలిలా ఎంటర్ అయ్యారు మోదీ. తెలంగాణలో పార్టీని మోసి, నిలబెట్టే బాధ్యత తనది అన్నట్లుగా కనిపించారు ఒక్క పర్యటనతో !

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 1, 2023 | 05:10 PMLast Updated on: Oct 01, 2023 | 5:10 PM

Pm Modi Targets Kcr And Congress Gives Hope To Bjp Cadre

PM MODI: బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అన్నట్లుగా ఫైట్ ఉండేది ఒకప్పుడు. అలాంటిది కర్ణాటక ఫలితాల తర్వాత సీన్ మారిపోయింది. బీజేపీ వీక్ అయింది. కారణం ఏదైనా బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్షుడిగా తప్పించి.. కిషన్‌ రెడ్డికి పగ్గాలు అప్పగించిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. మరోవైపు బీజేపీ రోజురోజుకు వీక్ అవుతోంది. కమలం పార్టీ పని ఇక ఔట్ అనుకుంటున్న సమయంలో.. బాహుబలిలా ఎంటర్ అయ్యారు మోదీ. తెలంగాణలో పార్టీని మోసి, నిలబెట్టే బాధ్యత తనది అన్నట్లుగా కనిపించారు ఒక్క పర్యటనతో !

ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చారు. ఎన్నికలకు ముందు ఆయన పర్యటన అనగానే.. రకరకాల అంచనాలు వినిపించాయ్. కేసీఆర్‌ను ఎలా టార్గెట్ చేస్తారు.. బీఆర్ఎస్ మీద ఎలాంటి విమర్శలు గుప్పిస్తారు.. ఇలా వినపించని చర్చ లేదు రెండు మూడు రోజులుగా! ఆ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా.. పక్కా పొలిటికల్ స్పీచ్ జనాల ముందు పెట్టారు మోదీ. బీజేపీ మీద, కేంద్రం మీద ఎలాంటి విషయాల్లో బీఆర్ఎస్ టార్గెట్‌ చేస్తుందో.. వాటన్నింటికి ఒక్క సభతో క్లారిటీ ఇచ్చారు మోదీ. యుద్ధానికి సిద్ధం అంటూ సంకేతాలు పంపించారు. పసుపు బోర్డు ఏది అంటూ ఇన్నాళ్లు బీఆర్ఎస్ నేతలు.. బీజేపీని లక్ష్యం చేసుకొని విమర్శలు చేయగా.. పసుపు బోర్డు ప్రారంభించడం చాలా హ్యాపీగా ఉందని మోదీ చెప్పుకొచ్చారు. రైతులను తాము ఎప్పుడూ గౌరవిస్తామని.. రామగుండం ఫ్యాక్టరీని ఓపెన్ చేయించింది తామే అని.. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రుణమాఫీలు, పథకాల పేరుతో అన్నదాతలను మోసం చేస్తుందని మోదీ విమర్శలు గుప్పించారు.

బీఆర్ఎస్‌ను మాత్రమే కాదు.. కాంగ్రెస్‌ను కూడా కలిపి జనాల ముందు టార్గెట్ చేశారు మోదీ. 2014 ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల నుంచి ఎంత ధాన్యం కొన్నది.. తాము ఎంత కొంటున్నది.. పక్కా లెక్కలను జనాల ముందు పెట్టారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌.. దొందూ దొందే అని.. జనాలు మార్పు కోరుకుంటున్నారని.. బీజేపీకి ఒక్క చాన్స్ ఇవ్వండి అన్నట్లుగా జనాల ముందు ఆప్షన్స్ పెట్టారు మోదీ. తెలంగాణకు మోదీ వచ్చి వెళ్లడం.. రాజకీయ పర్యటనగానో, రాజకీయ సభగానో చూసే అవకాశం లేదు. డీలా పడిపోయిన పార్టీ శ్రేణులు తిరిగి యాక్టివ్ అయ్యేలా చేసిన పర్యటన ఇది. ఎన్నికలు అనే యుద్ధంలో.. మరింత ధైర్యంగా, బలంగా అడుగులు వేసేందుకు స్ఫూర్తి నింపేలా చేసిన పర్యటన ఇది.

ఒక్కటి మాత్రం క్లియర్‌.. మోదీ పర్యటనకు ముందు, మోదీ పర్యటన తర్వాత అనేలా తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఇకపై మారడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. మోదీ తన వంతుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా.. రాష్ట్ర నేతల్లోనూ మార్పు రావాల్సిన అవకాశం ఉంది. తెలంగాణలో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోయాయ్. ఎవరికి వారు.. బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా మీటింగ్స్‌ పెట్టుకుంటున్నారు. ఐతే ఇప్పుడు మోదీ టూర్ తర్వాత ఈ గ్యాంగ్‌వార్‌కు కూడా బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. చూద్దాం మరి ఏమవుతుందో !