1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్‌కుమార్‌కు జీవితఖైదు

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఢిల్లీ న్యాయస్థానం...సంచలన తీర్పు వెల్లడించింది. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్‌ జీవిత ఖైదు విధించింది. బాధిత కుటుంబం మరణశిక్ష విధించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 27, 2025 | 09:38 AMLast Updated on: Feb 27, 2025 | 9:38 AM

Sajjan Kumar Sentenced To Life In 1984 Anti Sikh Riots Case

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఢిల్లీ న్యాయస్థానం…సంచలన తీర్పు వెల్లడించింది. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్‌ జీవిత ఖైదు విధించింది. బాధిత కుటుంబం మరణశిక్ష విధించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అయితే మరణశిక్షకు బదులు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సజ్జన్‌ కుమార్‌ చేసిన నేరాలు…క్రూరమైనవేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ కేసులో ఇప్పటికే సజ్జన్‌కుమార్‌…తిహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్‌కు జీవిత ఖైదు పడింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసును విచారించిన ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం…సంచలన తీర్పు చెప్పింది. సజ్జన్ కుమార్ చేసిన నేరాలు నిస్సందేహంగా క్రూరమైనవేనన్న కోర్టు…అవన్నీ ఖండించదగినవేనని స్పెషల్ జడ్జి కావేరీ బవేజా చెప్పారు. సజ్జన్‌ కుమార్‌కు మరణశిక్ష విధించాలన్న జస్వంత్‌ భార్య పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. అతడి మానసిక స్థితిగతుల వివరాలతో తమకు నివేదికను సమర్పించాలని నిర్దేశించింది. సజ్జన్ వయసు ప్రస్తుతం 80 ఏళ్లు కావడంతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో ఆయనకు మరణశిక్షకు బదులుగా జీవిత ఖైదును విధించింది. కాంగ్రెస్ మాజీ ఎంపీని…సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో…ఈనెల 12న సజ్జన్‌ను దోషిగా తేల్చింది. మరోవైపు పాలం కాలనీలో జరిగిన ఐదుగురి హత్యల వ్యవహారంలోనూ…సజ్జన్‌కుమార్‌ నిందితుడిగా ఉన్నారు. ఆ కేసులో ఢిల్లీ హైకోర్టు కూడా గతంలో ఆయనకు జీవిత ఖైదు శిక్షను విధించింది. దీన్ని సవాల్ చేస్తూ..సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడది దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. ఢిల్లీ హైకోర్టులోనూ ఆయన మరో అప్పీల్ పిటిషన్ వేశారు.

మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం ఒక పెద్ద గంపు మారణాయుధాలతో విరుచుకుపడింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లూటీలు, గృహదహనాలకు పాల్పడింది. వ్యతిరేక అల్లర్లలో భాగంగా…1984 నవంబర్ 1న సరస్వతి విహార్‌ ప్రాంతంలో అల్లరిమూక.. జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌ను హతమార్చింది. ఆపై ఆ ఇంట దోపిడీకి పాల్పడింది. జస్వంత్ ఇంటిని అల్లరి మూకలు లూటీ చేసి నిప్పుపెట్టారు. ప్రత్యక్ష సాక్షి, జస్వంత్‌ భార్య ఫిర్యాదుతో చేసింది. పంజాబీ బాఘ్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. జస్వంత్ ఇంట్లోని వారిపై దాడి చేసేలా అల్లరి మూకలను సజ్జన్ రెచ్చగొట్టినట్లు తేల్చింది. 2021 డిసెంబరు 16న సజ్జన్ కుమార్‌పై కోర్టులో అభియోగాలను నమోదు చేశారు. ఈ విషయంలో ఇప్పటి వరకు జస్వంత్ భార్య ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సుదీర్ఘ న్యాయపోరాటాన్ని కొనసాగించారు. 2015లో అమిత్‌ షా చొరవతో అప్పట్లో ఈ కేసును సిట్‌ దర్యాప్తు చేసింది. ఇందులో సజ్జన్ కుమార్ ప్రమేయం ఉందని విచారణలో తేల్చింది. ప్రస్తుతం సజ్జన్‌కుమార్‌ ఢిల్లీలోని తిహార్‌​ జైలులో ఉన్నారు.

సిక్కు వ్యతిరేక అల్లర్లు, తదనంతర పరిణామాలపై ప్రభుత్వం నానావతి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇది నివేదికను తయారు చేసింది. దీని ప్రకారం…సిక్కు వ్యతిరేక అల్లర్లలో 2,733 మంది చనిపోయారు. ఈ మారణహోమం జరిగిన తర్వాత…ఢిల్లీలో ఎంతో మంది బాధితుల ఫిర్యాదు చేశారు. అప్పట్లో 587 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. వీటిలో సరైన సమాచారం లేదంటూ 240 ఎఫ్‌ఐఆర్‌లను మూసేశారు. 250 కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. కేవలం 28 కేసుల్లోని 400 మంది నిందితులకు మాత్రమే శిక్షలు పడ్డాయి.

సజ్జన్‌ కుమార్‌…ఢిల్లీలో ఓ బేకరీ యజమాని. ఇందిరాగాంధీ రెండో కుమారుడు సంజయ్‌ గాంధీతో మంచి సంబంధాలు ఉన్నాయి. అలా ఢిల్లీ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి…అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో ఔటర్‌ ఢిల్లీ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1991, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున అదే స్థానం నుంచి గెలుపొందారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు పోలైన రాజకీయ నేతగానూ రికార్డు సృష్టించారు. సజ్జన్ కుమార్ సహా దాదాపు 50 మంది మాత్రమే హత్య కేసుల్లో దోషులుగా తేలారు. అప్పట్లో దిల్లీ కాంగ్రెస్ పార్టీలో ప్రభావవంతమైన నేతగా సజ్జన్ వ్యవహరించేవారు. అయితే 2018లో సిక్కుల ఊచకోత కేసులో దోషిగా కోర్టు ప్రకటించడంతో ఆయన కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.