SEETHAKKA: లీడర్‌.. ప్ర‌జా గొంతుక‌.. సీతక్క‌.. మరోసారి అసెంబ్లీకి..

ప్ర‌జ‌ల్లో ప్ర‌త్యేక ఆద‌రాభిమానాలు క‌లిగిన ఆమె.. ములుగు (ఎస్టీ) నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్ర‌జాగొంతుక‌గా అంద‌రూ పిలుచుకునే సీత‌క్క.. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ నేత బడే నాగజ్యోతిపై 33,700 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 6, 2023 | 06:02 PMLast Updated on: Dec 06, 2023 | 6:02 PM

Seethakka Wins Again In Telanganas Mulug

SEETHAKKA: ధనసరి అనసూయ అంటే ఎవరికి తెలియకపోవచ్చు. కానీ.. సీతక్క అంటే గుర్తు పట్టని రాజకీయ నాయకులు లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే తెలంగాణ రాజ‌కీయాల్లో సీత‌క్క‌ది ఓ ప్ర‌త్యేక ప్ర‌స్థానం. ప్ర‌జ‌ల్లో ప్ర‌త్యేక ఆద‌రాభిమానాలు క‌లిగిన ఆమె.. ములుగు (ఎస్టీ) నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్ర‌జాగొంతుక‌గా అంద‌రూ పిలుచుకునే సీత‌క్క.. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ నేత బడే నాగజ్యోతిపై 33,700 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 2009లో టీడీపీ నుంచి 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె గెలిచారు. మావోయిస్ట్ నేపథ్యం ఉన్న సీతక్క.. కోవిడ్ మహమ్మారి సమయంలో తన నియోజకవర్గంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు కాలినడకన వెళ్లి సరకులు అందించి ప్ర‌జ‌ల‌కు ఎంతో చేరువ‌య్యారు.

REVANTH REDDY: మంత్రి పదవులెన్ని..? పోటీ పడుతోంది ఎందరు..?

రాజకీయ అరంగేట్రానికి ముందు.. అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం 15 ఏళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సలైటు నాయకురాలు సీతక్క. 1988లో నక్సల్ పార్టీలో చేరినప్పుడు సీతక్క 10వ తరగతి చదువుతున్నారు. ఫూలన్ దేవి రచనల నుంచి ప్రేరణ పొంది, ఆర్థిక దోపిడీ, కులవాద వివక్షపై కోపంతో ఉన్న సీతక్క తొలుత విప్లవోద్యమం వైపు అడుగులు వేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్‌గా, దళం లీడర్‌గా ప్రధాన భూమిక వహించారు. ఆ తర్వాత మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని నందమూరి తారక రామారావు పిలుపునివ్వడంతో.. మావోయిస్టులు అందరూ కూడా పోరుబాట వదిలి లొంగిపోయారు. 2004లో తొలిసారి తెలుగుదేశం నుంచి పోటీ చేసిన సీతక్క, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్యపై గెలుపొంది, తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన 2014లో వరుసగా మూడోసారి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓటమి పాల‌య్యారు.

ఆ తర్వాత టీడీపీకి గుడ్‌బై చెప్పి సైకిల్ దిగిన సీతక్క కాంగ్రెస్ చేయి అందుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా చందులాల్‌పై కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి గెలిచారు. పార్టీకి సీతక్క చేస్తున్న సేవలు గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం, 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యురాలిగా పదవి ఇచ్చింది. ఇక‌.. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భంజ‌నం సృష్టించ‌డంతో.. సీత‌క్క‌కు అధిష్టానం ఓ కీల‌క శాఖ‌ను అప్ప‌గించ‌నుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. అదే నిజ‌మైతే అస‌లు సిస‌లైన ప్ర‌జా నేత‌కు ప‌ట్టం క‌ట్టిన‌ట్టే అంటున్నారు ఆమె అభిమానులు