అమెరికాపై ఉగ్రదాడి.. ప్రాణం పోసుకున్న ఇస్లామిక్ స్టేట్
అమెరికాలో న్యూ ఇయర్ వేడుకల్లో జరిగిన ట్రక్ ఘటనపై అమెరికా దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేసాయి. న్యూ ఓర్లీన్స్ లో జరిగిన ఘటనపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

అమెరికాలో న్యూ ఇయర్ వేడుకల్లో జరిగిన ట్రక్ ఘటనపై అమెరికా దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేసాయి. న్యూ ఓర్లీన్స్ లో జరిగిన ఘటనపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. షూటింగ్-ర్యామ్మింగ్ దాడిలో అనుమానితుడు , ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసిన యూఎస్ ఆర్మీ మాజీ సైనికుడిగా గుర్తించారు. అతని ట్రక్కుపై ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా జెండా గుర్తించారు. ఇతరుల సహాయంతో అతను మారణహోమానికి పాల్పడి ఉండవచ్చు అని భావిస్తున్నారు.
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిని ముందు ఉగ్రదాడిగా గుర్తించారు. దాడి చేసిన షంసుద్-దిన్ జబ్బార్ మొదట.. గుంపుగా ఉన్న ప్రజలపై ట్రక్ తో దూసుకు వెళ్ళాడు. అనంతరం కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 15 మంది మరణించగా… కనీసం 30 మంది గాయపడ్డారని అమెరికా పోలీసులు తెలిపారు. దాడికి కొన్ని గంటల ముందు దాడి చేసిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను ఎఫ్బిఐ గుర్తించింది.
అందులో తాను ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ నుండి ప్రేరణ పొందానని చెప్పుకొచ్చాడు. వీడియోలలో, జబ్బార్ తన విడాకుల గురించి కూడా మాట్లాడాడు. అతని కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశ్యంతో వేడుకలను టార్గెట్ చేసాడు. పబ్లిక్ రికార్డుల ప్రకారం, జబ్బార్ హ్యూస్టన్లో రియల్ ఎస్టేట్లో పనిచేశాడు. తన వీడియోలలో ఒకదానిలో, అతను హ్యూస్టన్కు తూర్పున 130 కిమీ దూరంలో ఉన్న బ్యూమాంట్లో పుట్టి పెరిగినట్లు వివరించాడు.
జబ్బార్ మార్చి 2007 నుండి జనవరి 2015 వరకు సాధారణ సైనికుడుగా పని చేసాడు. జనవరి 2015 నుండి జూలై 2020 వరకు ఆర్మీ రిజర్వ్ లో ఉన్నారు. అతను ఫిబ్రవరి 2009 నుండి జనవరి 2010 వరకు ఆఫ్ఘనిస్తాన్లో పని చేసాడు. అక్కడి నుంచే అతనికి ఇస్లామిక్ స్టేట్ తో సంబంధాలు బలపడ్డాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో అతను ఒక్కడే లేడని… దీని వెనుక గ్రూప్ ఉందని అధికారులు అనుమానించి విచారణ వేగవంతం చేసారు.