జగన్ కు షాక్ ఇచ్చిన వైసీపీ క్యాడర్.. అన్ననే తిట్టేస్తున్నారు

వైసీపీ అధినేత వైయస్ జగన్ గతంలో ఏం చేసినా సరే ఆ పార్టీ సోషల్ మీడియా ఎక్కువగా ప్రచారం చేసేది. జగన్ ఎక్కడికి వెళ్లినా సరే మీడియాలో హడావుడి ఎక్కువగా ఉండేది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 20, 2025 | 04:20 PMLast Updated on: Feb 20, 2025 | 4:20 PM

The Ycp Cadre Who Shocked Jagan

వైసీపీ అధినేత వైయస్ జగన్ గతంలో ఏం చేసినా సరే ఆ పార్టీ సోషల్ మీడియా ఎక్కువగా ప్రచారం చేసేది. జగన్ ఎక్కడికి వెళ్లినా సరే మీడియాలో హడావుడి ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా సోషల్ మీడియాలో జగన్ ఫోటోలు వీడియోలతో సందడి చేసే వాళ్ళు పార్టీ కార్యకర్తలు. అయితే ఇప్పుడు మాత్రం జగన్ విషయంలో ఆ పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. వల్లభనేని వంశీ మోహన్ ను విజయవాడలో పరామర్శించడానికి వైఎస్ జగన్ వెళ్లారు.

ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయనను కలవడానికి ఓ చిన్నారి రావడం.. దానికి సంబంధించిన వీడియో బయటకు రావడం.. కొన్ని ఫోటోలు కూడా బయటకు రావడం జరిగాయి. అయితే వాటి విషయంలో వైసిపి కార్యకర్తలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వాటిని సోషల్ మీడియాలో పెద్దగా షేర్ చేసేందుకు ఆసక్తి చూపించకపోవడం చూసి ఆ పార్టీ నేతలు కూడా షాక్ అవుతున్నారు. వాస్తవానికి గతంలో ఇటువంటి వీడియోలకు వైసీపీ సోషల్ మీడియా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది.

ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది. జగన్ ఏం మాట్లాడినా సరే వైరల్ చేసే వైసిపి కార్యకర్తలు.. విజయవాడలో జగన్ టూర్ ను కూడా హైలెట్ చేయలేదు. జగన్ చేసిన కొన్ని కామెంట్స్ కామెడీగా ఉండటం.. వాటి విషయంలో ట్రోలింగ్ ఎక్కువగా జరగడంతో వైసిపి కార్యకర్తలు మౌనంగా ఉండిపోయారు. ఇక ఆ చిన్నారి విషయం కూడా పైయిడ్ ఆర్టిస్ట్ అనే అనుమానాలు వైసిపి కార్యకర్తలకు కూడా కొంత కలిగాయి. సాక్షి మీడియా చిన్నారిని హైలెట్ చేయడం, భద్రతను దాటుకునే చిన్నారి అక్కడికి వెళ్లడం.. ఈ సందర్భంగా ఆమె ఏడవడం, ఆ ఏడ్చిన పద్ధతి కూడా నటనలా ఉండటంతో వైసిపి కార్యకర్తలు వాటిని షేర్ చేయడానికి ఆసక్తి చూపించలేదు.

ఇక బలవంతంగా కొన్ని పేజెస్ షేర్ చేసినా.. వాటిపై వైసిపి కార్యకర్తలు సెటైర్లు వేశారు. ఇక వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు విషయంలో కూడా వైసిపి కార్యకర్తలు పెద్దగా రియాక్ట్ అవలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. గతంలో ఎవరినైనా వైసీపీ నేతలను ఇబ్బంది పెడితే వైసీపీ సోషల్ మీడియా ఎక్కువగా రియాక్ట్ అయ్యేది. 2014 నుంచి 2019 వరకు ఒక రకంగా తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు నాయుడు పై యుద్ధం చేసింది వైసీపీ సోషల్ మీడియా.

కానీ ఇప్పుడు మాత్రం కేసులకు భయపడో లేదంటే.. జగన్ పై నమ్మకం లేకనో కాడి వదిలేసింది వైసిపి కేడర్. అటు వైసిపి నాయకత్వం వీడియోలు పంపించిన సరే వైసీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఇష్టపడలేదు. కనీసం కృష్ణా జిల్లాలో ఉన్న వైసిపి కార్యకర్తలు కూడా జగన్ పర్యటనను పట్టించుకోకపోవడాన్ని ఆ పార్టీ అధిష్టానం జీర్ణించుకోలేకపోతోంది. ఇక జగన్.. వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత కృష్ణాజిల్లా నాయకులు కూడా మీడియాతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదని చెప్పాలి.