వెనక్కి వచ్చేస్తాం…. డోర్లు తెరవండి సార్, బిఆర్ఎస్ కి తిరిగి వెళ్ళిపోనున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు…?
తెలంగాణ కాంగ్రెస్ కి, రేవంత్ సర్కార్ కి ఇదో పెద్ద షాకే. బి ఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ కొచ్చిన పదిమంది ఎమ్మెల్యేలు తిరిగి వెనక్కి వెళ్లిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? పార్టీ ఫిరాయించి తప్పు చేసాం అనే భావన లో ఉన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ కి, రేవంత్ సర్కార్ కి ఇదో పెద్ద షాకే. బి ఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ కొచ్చిన పదిమంది ఎమ్మెల్యేలు తిరిగి వెనక్కి వెళ్లిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? పార్టీ ఫిరాయించి తప్పు చేసాం అనే భావన లో ఉన్నారు.తిరిగి వెనక్కి వెళ్లిపోవడం కోసం బీఆర్ఎస్ సీనియర్ నేతతో ఆ పార్టీ అధినేత కెసిఆర్ కి సమాచారం పంపించారు. కెసిఆర్ ఆ పదిమందిని తిరిగి వెనక్కి తీసుకుంటారా… పార్టీలో చేర్చుకుంటారా… ఎప్పట్లాగే వాళ్ళని చూస్తారా అన్న విషయం ఇప్పుడు తేలాల్సి ఉంది. ఆరంభ సూరత్వంతో పదిమంది బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలను తెచ్చుకున్న కాంగ్రెస్… చివరికి వాళ్లని నిలబెట్టుకోలేక సతమతమవుతోంది.
ఒక పార్టీ అధికారంలోకి రాగానే… ప్రతిపక్షం నుంచి ఓ పది మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి జంప్ అయిపోవడం ఇప్పుడు చాలా కామన్. నైతిక విలువలు… తొక్క తోలు ఇలాంటి మాటలు లీడర్లు పట్టించుకోవడం లేదు .జనం పట్టించుకోవడం లేదు.2004 నుంచి తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు జంప్ అయిపోవడం అలవాటు అయిపోయింది.2014, 2018లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టి ఆర్ఎస్ అవసరం లేకున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి కలిపేసుకుంది. ఇప్పుడు కూడా అధికార కాంగ్రెస్ లోకి పది మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ అయిపోయారు. కానీ 14 నెలలుగా కాంగ్రెస్ పాలనను చూసిన వీళ్లంతా భవిష్యత్తు ఏమిటో అర్థం కాక తిరిగి సొంత పార్టీకి వెళ్లిపోయేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట.
2018లో టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోగలిగింది అంటే… ఒక పద్ధతి ప్రకారం రెండింట మూడు వంతులు మందిని వ్యూహాత్మకంగా టిఆర్ఎస్ లో విలీనం చేసుకుంది. కనీసం ఇప్పుడు కాంగ్రెస్ ఆ పని కూడా చేయలేకపోతోంది. రాజ్యాంగబద్ధంగా బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్లో విలీనం అవ్వాలంటే 36 మంది ఎమ్మెల్యేలు కనీసం 26 మంది ప్రత్యేక వర్గంగా బయటకు వచ్చి, ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం అవ్వచ్చు. కానీ ఇప్పటివరకు బి ఆర్ ఎస్ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ లాగ గలిగింది. బి ఆర్ఎస్ నుంచి దానం నాగేందర్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్ కుమార్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇలా పదిమంది కాంగ్రెస్ లోకి గెంతేశారు. వారిలో కొందరు తెలివిగా కాంగ్రెస్ కండువాలు వేసుకోకుండా మేనేజ్ చేసుకున్నారు. దానం నాగేందర్ మాత్రం ఏకంగా సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ కూడా చేసి ఓడిపోయారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల కేసుని బి ఆర్ ఎస్ సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లగలిగింది. సుప్రీంకోర్టులో ఏ క్షణానైనా ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పురావచ్చనే వాదన బాగా వినిపిస్తోంది. పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నుంచి నోటీసులు కూడా వచ్చాయి. ఏ క్షణానైనా వీళ్ళపై వేటు పడవచ్చని ఊహాగానాలు కూడా ఎక్కువయ్యాయి. అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఎంతవరకు వీళ్ళని కాపాడుతుంది అన్నది సందేహమే.
పోనీ కాంగ్రెస్ కి వెళ్లి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము కోరుకున్న పనులు ఏమైనా చేసుకున్నారా అంటే అది లేదు. వాళ్లకు కాంగ్రెస్ హాయ్ కమాండ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవి ఇప్పటి వరకు నెరవేరలేదు. పార్టీ మారితే ఆర్థికంగా ఆదుకుంటారు. కాంట్రాక్టులు చేసుకోవచ్చు , రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చని, ల్యాండ్ సెటిల్మెంట్లు జరుపు కోవచ్చని, పెండింగ్ బిల్స్ క్లియర్ చేయించుకోవచ్చని ఇలా రకరకాల ఐడియాలతో చేరిన వాళ్ళందరికీ నిరాశ ఎదురయింది. వాళ్ళనీ ఏ రకంగానూ కాంగ్రెస్ పార్టీ గానీ రేవంత్ సర్కార్ గాని ఆదుకోలేకపోయాయి. మరోవైపు ఏడాదిలోనే రేవంత్ సర్కార్ పని అయిపోయిందనే భావన తెలంగాణలో బాగా వచ్చేసింది. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదనే విషయం తేట తెల్లమై పోయింది. కాంగ్రెస్ నాయకులే , నాలుగేళ్లలో చకచకా సర్దుకోవాలని తొందరలో ఉన్నారు. దీంతో తమ పొలిటికల్ ఫ్యూచర్ కరాబ్ అయిపోతుందని భయం లో పడ్డారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు. పదిమందిలో ముగ్గురు మాత్రం బింకంగా ఉన్నప్పటికీ…. ఏడుగురు బి ఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం నయానో భయానో కెసిఆర్ కాళ్లు పట్టుకొని తిరిగి పార్టీలోకి వెళ్లిపోవాలని ఆత్రుతలో ఉన్నారు. కొందరు ముందు జాగ్రత్తగా కెసిఆర్ కి వ్యతిరేకంగా ఎటువంటి కామెంట్స్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికీ తన కార్యాలయంలో కేసీఆర్ ఫోటో తీయలేదు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పోస్టర్స్ లో తన ఫోటో వేసుకుంటే ఒప్పుకోనని ఏకంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. తాను ఎప్పటికీ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే నని ..చెప్పుకుంటున్నా రాయన.అరికెపూడి గాంధీ ఎప్పటికీ కాంగ్రెస్ కండువా వేసుకోకుండా జాగ్రత్త పడ్డారు.
ఈ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు పోయిన తర్వాత టిఆర్ఎస్ లో మరింత పాతుకుపోయిన పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లు మాత్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకోకూడదని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఆయనతోపాటు మరికొందరు కూడా ఇదే భావన వినిపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ను మానసికంగా దెబ్బతీయాలంటే ఈ పది మందిని వెనక్కి తీసుకురావాలని…. 2028లో వాళ్లకి తిరిగి సీట్లు ఇవ్వాలా లేదా…? అన్నది తర్వాత ఆలోచించవచ్చని ఒకరిద్ద రూ సీనియర్లు చెప్తున్నారు. ఈ పరిస్థితులు మొత్తం కేసీఆర్ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎమ్మెల్యేలు తిరిగి వస్తారన్న సమాచారాన్ని కెసిఆర్ కు అందించిన సీనియర్ నేతకు కెసిఆర్ నుంచి ఇప్పటివరకు సంతృప్తికరమైన సమాధానం ఏది రాలేదు. మైండ్ గేమ్ తో అవతల వాళ్ళని ఆడుకునే కెసిఆర్ మరోసారి అదే వ్యూహాన్ని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ప్రయోగిస్తున్నారు. నమ్ముకున్న రేవంత్ రెడ్డి నట్టేట ముంచాడు. వెనక్కి వెళ్ళిపోతాం అంటే కెసిఆర్ ఏ విషయము తేల్చడు. దీంతో ఆ పది మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు నడి సముద్రంలో నావల తయారయింది.
కనీసం ఇప్పటికీ కూడా ఆ పదిమంది ఎమ్మెల్యేలను ఎలా నిలబెట్టుకోవాలి, వాళ్లు తిరిగి బి.ఆర్.ఎస్ కు వెళ్లకుండా ముందస్తుగా ఎలాంటి ప్లాన్ అమలు చేయాలి అన్న విషయంపై కాంగ్రెస్ లో ఒక్కరు కూడా చర్చించడం లేదు. ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేయలేదు. కనీసం ఆ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడలేదు కూడా. దీంతో బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఉండడం అనవసరం అనే నిర్ణయానికి వచ్చేసారు. ఇక రేపో మాపో ఆ బాంబు బద్దలవబోతోంది. అది ప్రస్తుతం కెసిఆర్ చేతిలో ఉంది.